విశ్వప్రేమను నేర్పే విపశ్యన – కొండవీటి సత్యవతి

(ఈ వ్యాసం రాసి రెండేళ్లయింది. భూమికలో ఉద్ధేశ్యపూర్వకంగానే వెయ్యలేదు. కానీ డిశంబరు ‘బుద్ధభూమి’లో ప్రచురితమయ్యాక దీనిని భూమికలో వెయ్యమని అసంఖ్యాకంగా నాకు ఫోనులొచ్చాయి. అందుకే పునర్ముద్రిస్తున్నాం – సంపాదకులు)

హైదరాబాద్‌ నుండి నాగార్జునసాగర్‌ వెళ్ళే దారిలో, గుర్రంగూడ గ్రామంలో విపశ్యన సెంటర్‌ వుంది. 2012 జులై 19వ తేదీన 1.30కి విపశ్యన సెంటర్‌కి చేరాను. 2-15 గంటలకు అప్లికేషన్‌ నింపడం అయ్యింది. అప్లికేషన్‌ నింపాక పద్మజ అనే ఆవిడ దగ్గరకి (టీచర్‌) వెళ్ళమన్నారు. అన్ని నియమాలకు కట్టుబడి వుంటారా? రూల్స్‌మరియు రెగ్యులేషన్‌లు చదివారా? అని అడిగారు. అన్నీ చదివాను. మీ వెబ్‌సైట్‌లుకూడా చూశాను అని చెప్పాను. మీరు జర్నలిస్ట్‌ అని రాశారు కదా! ఏ పేపర్‌కి? అని అడిగారు. భూమిక పత్రిక అని, స్త్రీల కోసం ఒక హెల్ప్‌లైన్‌ నడుపుతానని చెప్పాను. మీరు రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో చేసేవారు కదా అని అడిగారు. నేను ఆశ్చర్యపోయి మీకెలా తెలుసు అన్నాను. తర్వాత చెబుతాను అన్నారు. ఎలా తెలుసో ఆ తర్వాత చెప్పారులెండి. నాకు సింగిల్‌రూమ్‌ కావాలంటే 117 నెంబరు రూమిచ్చారు. సామాను మోసుకుని రూమ్‌ కొచ్చాను. రూమ్‌ చక్కగా నీట్‌గా, క్లీన్‌గా వుంది. సిమెంటుతో కట్టిన మంచం, దానిపై పరుపు వున్నాయి. స్టోర్‌కెళ్ళి దుప్పట్లు తెచ్చుకుని మంచంమీద పరిచాను. నేను తెచ్చుకున్న దుప్పట్లు కూడా పరుచుకుని ఈ రూమ్‌ని ప్రేమించడం మొదలుపెట్టాను. రూమ్‌ ముందు పెద్ద రావిచెట్టు. ఆకులు గలగలమంటూ ఒకటే సంగీతం. దానికి తోడు లెక్కలేనన్ని పిట్టల వైవిధ్య స్వరాలు. రామచిలకలు, పిచ్చుకలు ఒకటే పాడుతున్నాయి. వస్తూ వస్తూ కారులోనే లంచ్‌ తిన్నాను. రూమ్‌ సర్దాక బయటకొచ్చాను. ఒకావిడ నిలబడి వుంది. నవ్వగానే వచ్చి నా రూమ్‌ ముందు కూర్చుంది. ఆవిడ ఇలా రావడం మూడోసారట. విపశ్యన గురించి చెప్పింది. అన్నం తిన్నారా అని అడిగితే ఇక్కడ తినలేదు. పన్నెండింటికి ఓ జొన్న రొట్టె తిన్నాను అన్నాను. అయ్యో పదండి. సాయంత్రం ఏమీ వుండదు..అంటూ డైనింగ్‌ హాల్‌కి తీసుకెళ్ళి తనే కంచంలో అన్నం, చపాతీ, పప్పు, మజ్జిగ పట్టుకొచ్చింది. ‘ఆకుకూర, పెరుగు అయిపోయినట్టుంది’ అంది. నాకు చపాతీ వద్దు కొంచెం అన్నం చాలు అని పప్పు అన్నం తిని మజ్జిగ తాగాను. పప్పు చాలా రుచిగా వుంది. 5 గంటలకు హాలు దగ్గరకి రమ్మన్నారు. అప్పటి వరకు మాట్లాడవచ్చు. సెల్‌ఫోన్‌, డబ్బు, వాళ్ళ దగ్గర డిపాజిట్‌ చేసేశాను.

ఆవరణంతా చెట్లతో నిండి వాతావరణం హాయిగా బావుంది. పెద్ద లోటస్‌పాండ్‌లో పసుపుపచ్చ కలువలు పూశాయి. మూడు రౌండ్లు నడిచి ఒక చెట్టు దగ్గర కూర్చున్నాను. సత్యవతి గారూ! అంటూ పిలుపు. సర్వీస్‌ కమీషన్‌ కొలీగ్‌. ఇద్దరం మాట్లాడుతూ మరో రౌండు నడిచాం. నాలుగింటికి నా రూమ్‌ కొచ్చాను. ఇక్కడికి రాగానే పెద్ద బరువేదో వదిలినట్టుంది. చేతిలో పైసా లేకుండా హాయిగా పదిరోజులు వుండొచ్చు. రూమ్‌కి తాళం వెయ్యక్కర్లేని హాయి. దేనినీ పట్టించుకోనక్కరలేదు. బ్యాగ్‌, సెల్‌ఫోన్‌ బాదరబందీ లేదు. రూమ్‌ తలుపు దగ్గరకేసి అలా చెట్లలోకి నడుచుకుంటూ వెళ్ళిపోవడం..అబ్బ నిజంగా ఎంత సుఖంగా వుందో! పదిరోజులపాటు దొరికే ఈ స్వేచ్ఛ కొత్త అనుభూతి నిచ్చింది. శృంఖలాలు లేని స్వేచ్ఛని అనుభవించటం నిజంగా గ్రేట్‌ ప్రివెలేజ్‌. ఎలాంటి మతపరమైన బోధనలు, కీర్తనలు లేకపోవడం కేవలం ప్రకృతితో సంబంధం వుండడం. మనతో మనకి మాత్రమే సంబంధం వుండడం. గుడ్‌ ఫీలింగ్‌. రేపటినుండి ఎలా వుంటుందో తెలియదు. ఆ అనుభవం ఎలా వుంటుందో చూడాలి. నాకిష్టమైన చెట్లు, పిట్టలు వుండనే వున్నాయి. వుండలేకపోవడం ఏమిటి? దూరంగా ఎక్కడినుండో నెమలి కేక కూడా వినిపిస్తోంది. కోయిల బృందగానం వుండనే వుంది.

ఆరుగంటల నుండి ఏక్టివిటీ మొదలైంది. ఆరింటికి ఉప్మా, టీ ఇచ్చారు. అదే రాత్రి భోజనం. ఆ తర్వాత మెడిటేషన్‌ మొదలైంది. విపశ్యన ప్రారంభించిన గురువు సత్యన్నారాయణ గోయెంకా గారు. ఆడియోపన్యాసంతో తొలి మెడిటేషన్‌ ప్రారంభమయ్యింది. అంతకుముందు ధమ్మ సేవకులు, పాత సాధకులు నియమాల గురించి వివరిస్తూ ఆవరణలో వున్న వివిధ మెడిటేషన్‌ సెంటర్లు చూపించారు. ఆ తర్వాత ఐడికార్డు ఇచ్చారు. రాత్రి తొమ్మిది వరకు మెడిటేషన్‌ నడిచింది. బాసింపట్టులో అంతసేపు కూర్చోవడం కష్టమైంది. గుండె బరువెక్కినట్లనిపించింది. నొప్పిగా కూడా అనిపించింది. దాన్ని పట్టించుకోకుండా మెడిటేషన్‌ చేశాను. రాత్రికి 9.30కి లైటార్పేసి పడుకున్నాను. చాలాసేపు నిద్ర పట్టలేదు. దీన్ని ‘0’ (జీరో) డే అంటారు. బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం కనుగొన్న మెడిటేషన్‌ని ఇలా ఇప్పుడు నేర్చుకోవడం బావుంది. మనం తీసుకునే శ్వాస మీదే ధ్యాస పెట్టడం, పరధ్యాస లేకుండా వుండటం ఇదే మొదటి మూడు రోజులు. శ్వాస ఎటు వెళుతుంది. ఎలా వెళుతోంది చూడ్డమే పని, వేరే పనేమీ లేదు.

మొదటిరోజు

ఉదయం నాలుగింటికి గంట మోగింది. ఠక్కున మెలకువ వచ్చింది. బ్రష్‌ చేసి మెడిటేషన్‌ హాలుకెళ్ళిపోయాను. 4.30కి తొలి సెషన్‌ మొదలైంది. శ్వాసమీద ధ్యాస అంతే. శ్వాస ఎలా వెళుతోంది. ఎలా బయటకు వస్తోంది గమనిస్తూ మనసును ముక్కుపుటాల మీదే కేంద్రీకరించమని గోయంకా గారు హిందీలోనూ, ఇంగ్లీషులోను, వేరొకాయన తెలుగులోను చెబుతుంటారు. మనసు శ్వాస మీద నిలవదు. అది గమనించి మనసును లాక్కొచ్చి శ్వాస మీద నిలపమంటారు. ఓ క్షణం వుంటుంది. రెండో క్షణం పారిపోతుంది. వరంగల్‌ పోతుంది. హైదరాబాద్‌ పోతుంది. అమెరికా పోతుంది. అండమాన్‌ పోతుంది. ఏమిటేమిటో ఆలోచనలు వస్తుంటాయి. చిత్రమైన ఆలోచన లొస్తుంటాయి. ఎవరితోనో మాట్లాడుతుంటాం. మళ్ళీ గుర్తొచ్చి మనసును లాక్కొచ్చి ముక్కు మీద కూర్చోబెడతాం. కొంచెం సేపు కూర్చుంటుంది. మనసు అలా నిలకడగా వున్నప్పుడు మనం శ్వాసని చూడగలుగుతాం. మనసు షికార్లు చేస్తున్నప్పుడు శ్వాసమీద ధ్యాస వుండదు. ఆలోచనలని ఆపడం మన తరం కాదు.

గమ్మత్తుగా మన ఆలోచనలకనుగుణంగా మన శ్వాసలో తేడా తెలుస్తుంది. ఎవరిమీదో కోపం, ఎప్పటిదో! వాళ్ళ పని ఎలా పట్టాలి? ఏదో పని మిగిలిపోయింది. దానిని ఎప్పుడు పూర్తి చెయ్యాలి? ప్రియమైన వ్యక్తులు, అప్రియమైనవాళ్ళు ఆలోచనలోకి వస్తే…శ్వాసలో తేడా గమనించొచ్చు. తనకు నచ్చని అంశం గుర్తొస్తే మనసు ఉద్రిక్తమౌతుంది. నచ్చినది గుర్తొస్తే మనసు సేదతీరుతుంది. ఈ తేడాలు శ్వాసలో తెలుస్తాయి. ఉద్రేకపడినప్పుడు శ్వాస బరువుగా, బలంగా వస్తుంది. అంటే నెగిటివ్‌ విషయాలు ఆలోచనల్లోకి వచ్చినప్పుడు శ్వాస బరువెక్కుతుంది. గాలి ధారాళంగా లోపలికి వెళ్ళలేకపోతుంది. మనసు తేలికగా వున్నప్పుడు గాలి మామూలుగా, తేలికగా వెళ్ళిపోతుంది. అలాగే మనసు ఎప్పుడూ గతంలోకి, భవిష్యత్తులోకి చక్కర్లు కొడుతుంటుంది. ఇప్పటి మీద నిలవదు. నిన్నేం జరిగింది? ఎందుకు జరిగింది? ఎలా జరిగింది లాంటి జరిగిపోయిన వాటిమీద, రేపేం జరగబోతోంది? ఏం కాబోతోంది లాంటి వాటి చుట్టే తిరుగుతుంటుంది. దీనివల్ల ఆందోళన పెరిగి ప్రస్తుతాన్ని ఆస్వాదించలేకపోతాం. ఇది తొలిరోజు గోయంకా గారి ఉపన్యాస సారాంశం.

ఉదయం 4.30 నుండి మధ్యలో కొంత విరామంతో రాత్రి 9.00 దాకా సాగింది మెడిటేషన్‌. సాయత్రం ఏడున్నరకి గోయంకా గారి వీడియో ప్రసంగం విన్నాం. ఆయన్ని చూశాం టీవీలో. సాయంత్రం ఐదింటికి మరమరాలు, అరటిపండు, టీ ఇచ్చారు. ఇదే డిన్నర్‌. తొమ్మిదింటి దాకా మెడిటేషన్‌లో వున్నాం కానీ ఆకలి వెయ్యలేదు. మధ్యాహ్నం అన్నం, చపాతీలు, కమ్మటి పప్పు తియ్యటి పెరుగు, వేడి వేడి సొరకాయ, బెండకాయ కూరతో మంచి భోజనం. ఉదయం ఆరింటికి వేడి వేడి పొంగలి, పల్లీ చట్నీ, అరటిపండు, టీ, తొమ్మిదింటికి రూమ్‌కొచ్చిన వెంటనే పడుకుండి పోయాను. వెంటనే నిద్రపట్టేసింది. ఈరోజు నేను నేర్చుకున్న ముఖ్యమైన అంశం-భోజనాన్ని ప్రేమగా, ఇష్టంగా, గౌరవంగా తినడం. ఏం తింటున్నామో తెలుసుకుంటూ తినడం. ఆకలిని అర్థం చేసుకోగల గడం. నచ్చని అంశం-బుద్ధుడిని భగవానుడనడం, శ్వాసమీద ధ్యాస సాధిస్తే పరమపదం పొందుతారని చెప్పడం. పరమపదం అంటే ఏమిటి? సెంటర్‌లో ఎక్కడా బుద్ధ విగ్రహం కానీ, గోయంకా గారి ఫొటోలు కానీ లేవు. ఇది బావుంది.

రెండోరోజు

నాలుగింటికి గంట మోగింది. వెంటనే లేచాను. సెంటర్‌ వైపు నడిచాను. చాలా నిశ్శబ్దంగా వున్నాయి పరిసరాలు. చల్లటిగాలి. రావి ఆకుల గలగలలు. మాతో పాటే కొన్ని పక్షులు లేచాయి. కోయిలమ్మ గొంతు సవరించుకుంటూ కూయడం మొదలుపెట్టింది. రకరకాల పిట్టల సంగీతం వింటూ సెంటర్‌ దాకా నడిచాను. రోజూ ఇరవై సార్లన్నా ఇదంతా నడుస్తాను. ఆ నిశ్శబ్ద వేళ 4.30కి మెడిటేషన్‌ మొదలైంది. నిన్న మొదలైన ప్రశ్నల వల్ల ఒక వ్యతిరేక భావం రావడంతో మెడిటేషన్‌ కష్టమైంది. పదేపదే అదే ప్రశ్నలు వేధించడంతో ఇంక చెయ్యలేనేమో అనుకున్నాను. ‘జీవనకళ నేర్చుకోవడమే విపశ్యన’ అని గోయంకా గారు చెప్పడంతో ఆ రెండు ప్రశ్నల్ని పక్కన పెట్టాను. సింపుల్‌గా, అర్థవంతంగా, ఆనందంగా జీవించడానికే ఈ కళ అని ఆయన రెండో రోజు చెప్పారు. బుద్ధుడిని భగవాన్‌ అనలేదు కానీ స్వర్గం, నరకం, పాపం, పుణ్యం అంటూ బుద్ధుడు వ్యతిరేకించిన వాటిని ప్రస్తావించారు.

ఈ రెండు రోజుల సాధన విపశ్యనకి ఉపయోగపడుతుంది అన్నారు. అంటే విపశ్యన వేరే వుందని అర్థమైంది. బహుశా రేపటి నుండి మొదలవుతుందేమో! 4.30 నుండి మధ్యలో కొంత విరామమిస్తూ 9.00 దాకా సాగింది. అంతసేపు కూర్చోవడం చాలా కష్టంగా వుంది. మోకాళ్ళు, పాదాలు విపరీతమైన నొప్పి. ఐదు నిమిషాలు ఒకే ఫోజులో కూర్చోలేక ఇబ్బంది పడుతున్నాను. కావాలంటే కుర్చీ మీద కూర్చోవచ్చు. అయినా దిండులేసుకుని కిందే కూర్చున్నాను. ఉదయం ఆరున్నరకి ఉప్మా, బత్తాయి పండు ఇచ్చారు. ఎనిమిది దాకా రెస్ట్‌. అప్పుడే స్నానం, రూమ్‌ శుభ్రం చేసుకోవడం, బట్టలుతుక్కోవడం, లాండ్రి సౌకర్యం వుంది. నేను తొలిరోజు మాత్రమే లాండ్రికిచ్చాను. తర్వాత నేనే ఉతుక్కోవడం మొదలుపెట్టాను. పనులన్నీ స్వయంగా చేసుకోవడం చాలా బావుంది. మధ్యాహ్నం మంచి భోజనం. కేసరి స్వీట్‌ ఎక్కువ తినడం వల్ల మధ్యాహ్నం సరిగా కూర్చోలేకపోయాను. ఇలా చెయ్యకూడదు.

సాయంత్రం ఐదింటికి పేలాలు, బత్తాయిపండు, టీ. అదే డిన్నరు. పేలాలు తిని బత్తాయి రూమ్‌కి తెచ్చాను. రాత్రికి ఆకలేస్తుందేమోననే భయం వదలడం లేదు. నిజానికి ఆకలి వెయ్యడం లేదు. తొమ్మిదింటికి రూమ్‌కొచ్చి బత్తాయి తిని, స్నానం చేసి నిద్రపోయాను. మూడు రోజులుగా నిశ్శబ్దమే. మాటలు లేవు. ఒకరివేపు ఒకరు చూడ్డం లేదు. తల దించుకుని ఎవరి ధోరణిలో వాళ్ళు వుంటున్నారు. మూడు రోజుల్లో కేవలం మూడు మాటలు, అదీ టీచర్‌తో, ధమ్మ సేవకులతో మాట్లాడాను. గోయంకా గారి ఉపన్యాసం వింటూ కొంచెం నవ్వాను అంతే. మా గుంపులో పెద్దవాళ్ళు, మధ్యవయస్కులు, పిల్లలు దాదాపు డెబ్బయ్‌ మంది. పన్నెండు మంది క్రిస్టియన్‌ నన్స్‌ వున్నారు. అందరూ చాలా శ్రద్ధగా చేస్తున్నారు. తొలిరోజు వాళ్ళతో మాట్లాడాను. మీరు ఎందుకు వచ్చారు అని. డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం అన్నారు. నేనూ అందుకే వచ్చానని చెప్పాను.

మూడోరోజు

నాలుగింటికి బెల్‌. నాలుగున్నర నుండి ఆరున్నర వరకు మెడిటేషన్‌. ఆరున్నరకు ఇడ్లీలు పల్లీ చట్నీ, బత్తాయి పండు. పండు రూమ్‌కి తెచ్చాను. ఎనిమిది నుండి 11 వరకు కంటిన్యూస్‌గా మెడిటేషన్‌. కూర్చోవడం చాలా కష్టం. అయినా కూర్చుంటాం. కూర్చోలేక బయటకొస్తే రెండు నిమిషాల్లో ధమ్మ సేవకురాలు వచ్చి నమస్కరించి లోపలికి పదమంటుంది. సౌంజ్ఞలే. మాటలుండవు.

పదకొండుకి వేడి వేడి భోజనం, మితంగా తినడం మంచిది. లేకపోతే కూర్చోలేం. ఒకటి నుండి ఐదింటివరకు నిరంతర ధ్యానం. మధ్యలో టీచర్‌తో మాట్లాడొచ్చు. ‘మీరు మధ్యలో లేవకండి. కళ్ళు తెరవకండి’ అని సలహా ఇచ్చారు. ‘శ్వాసమీద ధ్యాస పెట్టండి. నొప్పులుండవు’ అని కూడా అన్నారు. నాకు విపరీతంగా చెమట పడుతోంది. అంటే చాలా మంచిది కదా! చెమట పట్టాలంటే ఎంత కష్టపడాలి. మీకు ఫ్రీ స్టీమ్‌ బాత్‌ అవుతోంది కదా అంటూ నవ్వారు.నేను కూడా హాయిగా నవ్వాను. ఆవిడ సలహా పాటించాను. మధ్యలో లేవలేదు. కళ్ళు తెరవలేదు. నొప్పుల మీద దృష్టిపోయింది. శ్వాసమీదే ధ్యాస పెట్టాను. ఏడున్నర గంటల నుండి తొమ్మిది దాకా గోయంకా గారి ఉపన్యాసం. రేపు విపశ్యన నేర్పుతామని చెబుతూ చాలా సరదాగా మాట్లాడారు. చాలా నవ్వాను. బుద్ధుడి అష్టాంగమార్గం గురించి చెప్పారు. విపశ్యన తర్వాత ఎలాంటి మార్పులొస్తాయో ప్రతి క్షణాన్నీ ఎరుకతో ఎలా ఆస్వాదిస్తామో ప్రతిదీ నిరంతరం ఎలా మార్పు చెందుతుందో, శరీరంలోని కణాలు చస్తూ పుడుతూ ఎలా వుంటాయో మంచి సరదా ఉదాహరణతో చెప్పారు. ప్రతిదీ అశాశ్వతమని, మార్పు మాత్రమే శాశ్వతమని అర్థం చేసుకోవాలని చెప్పటం విని నేను ఆశ్చర్యపోయాను. ‘మార్పు మాత్రమే శాశ్వతం’ అని ఒక సందర్భంలో నేను రాసిన కవిత గుర్తొచ్చింది. ఒక వేదనామయ సమయంలో నేను ఆ కవిత రాశాను. భ్రమలకు లోనవ్వకుండా అన్నింటినీ తీక్షణంగా చూడాలని, అప్పటికి ఏది సత్యమో అదే సత్యమని, గతానికి భవిష్యత్తుకు లంకెపెట్టి మనుషులు బాధపడతారని వాస్తవంలో ఎప్పుడూ జీవించరని ఆయన చెప్పింది నేను చాలాకాలంగా ఆచరిస్తున్నదే. గతం గొప్పది భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళనతోనే మనిషి బతుకుతుంటాడు. నాకెప్పుడూ ఈ ఆందోళన లేదు. నేను ప్రస్తుతంలోనే జీవిస్తాను.

తొమ్మిదింటికి రూమ్‌కొచ్చాను. ఒకావిడ రూమ్‌ ముందు పాము ముడుచుకుని పడుకుంది. అందరూ బేజారయ్యారు. మౌనం వీడి మాటల్లో పడ్డారు. ఈలోపు ధమ్మ సేవిక వచ్చి చాలా నిబ్బరంగా పాముని చీపురుతో తొలగించేసి అందరినీ రూముల్లోకి పంపింది. పాము పెద్దది కాదు. చిన్న కట్లపాము పిల్ల. అయినా జనాలకి పామంటే భయమే కదా! చిన్న పాము పిల్ల అందరి మౌనాన్ని కాసేపు భగ్నం చేసింది. రూమ్‌ లోపలికొచ్చి ఉదయం, సాయంత్రం సేకరించిన బత్తాయిలు తిని, స్నానం చేసి మంచమెక్కాను. చాలాసేపు నిద్ర పట్టలేదు. రేపు విపశ్యన నేర్పుతారట. అంటే ఏమిటోనని చాలాసేపు ఆలోచించాను. మెల్లగా నిద్రపట్టింది. ఏవేవో కలలు. ఒంటి గంటకు ఏదో చప్పుడై మెలకువ వచ్చింది. మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకున్నాను. సాయంత్రం మెడిటేషన్‌ అయ్యాకా వొళ్ళంతా తేలిక పడుతున్న ఫీలింగ్‌ వచ్చి నవ్వొచ్చింది.

నాలుగోరోజు

ఈరోజు చాలా ముఖ్యమైంది. రోజులాగానే 4 గంటలకు లేవడం, 4.30కి మెడిటేషన్‌లో కూర్చోవడం. 4.30కి ప్రకృతి ఎంత ప్రశాంతంగా, సమ్మోహనంగా వుంటుందో! చల్లటి గాలి అడక్కుండానే ప్రేమగా వొళ్ళంతా తాకుతుంది. ఆ నిశ్శబ్దం మనసును ఎంత హాయి పరుస్తుందో! మధ్యాహ్నం విపశ్యన క్లాసు వుంటుందని, క్లాసు ప్రారంభమయ్యక రెండు గంటలసేపు ఎవ్వరూ హాల్లోంచి బయటకెళ్ళకూడదని, ఆసనం మీంచి లేవకూడదని చెప్పారు. మూడు రోజులపాటు శ్వాసమీద ధ్యాసతో మెడిటేషన్‌ నడిచింది. 3.15కి గోయంకాగారి ఆడియో ఉపన్యాసం మొదలైంది. విపశ్యన గురించి కళ్ళు మూసుకుని తలమీద ఆయువు పట్టును చూడమన్నారు. తర్వాత ముఖం, కళ్ళు, చెవులు, ముక్కు, బుగ్గలు, నోరు, పెదవులు, మెడ కుడి చెయ్యి మొత్తం. ఎడమచెయ్యి మొత్తం, గుండె, పొట్ట, నాభి, కుడికాలు మొత్తం, ఎడమకాలు మొత్తం, వీపు మొత్తం మీద శ్వాసను నడుపుతూ చూడమన్నారు. ఏం సంవేదన/సెన్‌సేషన్‌ జరుగుతుందో గమనించమన్నారు. శిరస్సు నుంచి పాదాల దాకా ఎలాంటి సెన్సేషన్‌ ఏర్పడుతున్నాయో సాక్షిలాగా గమనించమన్నారు. ప్రతిదీ అశాశ్వతం. పుడుతుంది. నశిస్తుంది. నిత్యం మారుతుంది అనే ఎరుకతో గమనించమన్నారు. తలనించి పాదాలకొచ్చే సరికి ఎన్నో నొప్పులు పుడతాయి. నశిస్తాయి. చెమట పడుతుంది. ఆరిపోతుంది. దురద పుడుతుంది. పోతుంది. శరీరం మొత్తంలో నిరంతరం ఎన్నో సంవేదనలు పుడుతుంటాయి. పోతుంటాయి. మళ్లీ పుడుతుంటాయి. పోతుంటాయి. వాటిని నిర్వేదంగా, నిరపేక్షంగా, సాక్షిలాగా గమనించమంటారు. ఏదీ నిత్యం కాదు. ఏదీ శాశ్వతం కాదు అనే దృష్టిలో సంవేదనలని చూడమని చెప్పారు. అలాగే ఎక్కువ నొప్పిని ద్వేషించవద్దని, తక్కువ నొప్పిని ప్రేమించవద్దని, రెండూ శాశ్వతం కాదని తలనించి పాదాల వరకు జరిగే ప్రయాణంలో కనపడే సంవేదనలన్నీ శాశ్వతం కాదనే ఎరుకతో చూడమని చెప్పారు.

విపశ్యన అంటే మార్పు. శరీరంలోను, ప్రకృతిలోను నిరంతర మార్పులు జరుగుతుంటాయి. ఏదీ శాశ్వతం కాదు అనే ఎరుకే విపశ్యన అని నాకు అర్థమైంది. క్లాసయ్యాక బయటికొచ్చాక ఓ బెంచీ మీద చాలాసేపు అలాగే కూర్చుండిపోయాను. నా ఆలోచనా విధానం విపశ్యనకు చాలా దగ్గరగా వుందనిపించింది. ‘మార్పు మాత్రమే శాశ్వతం. మరేదీకాదు’ అంటూ నేను రాసుకున్న కవిత పదే పదే గుర్తొచ్చింది. ఎంతో అందంగా పూసే బ్రహ్మ కమలం ఎంత అశాశ్వతమో గుర్తొచ్చింది. ఎర్రటి చిగురాకు, ఆకుపచ్చగా మారి, పసుపు రంగుకు మారి రాలిపోవటం గుర్తొచ్చింది. అందమైన గులాబీ నాలుగు రోజులకే రేకులన్నీ రాలిపోయి నిర్జీవమవ్వడం గుర్తొచ్చింది. ప్రకృతిలో ప్రతిదీ పుడుతూ నశిస్తూ, మళ్ళీ పుడుతూ నశిస్తుంటుంది. మనిషి మాత్రమే తాను శాశ్వతమని విర్రవీగుతాడు. ఎంతో విధ్వంసం సృష్టిస్తాడు. సంపద పోగేసి జనాలని దోపిడీ చెయ్యాలనుకుంటాడు. ఏదీ శాశ్వతం కాదు. తానే శాశ్వతం కాదు అనే ఎరుకతో జీవించడం, అదే ఎరుకతో మరణించడం విపశ్యన అని నాకు అర్థమైంది.

ఐదోరోజు

ఈరోజు కూడా 4.30 నుండి 9 దాకా ధ్యానం సాగింది. నిన్న తలనించి పాదాల వరకు మనసును నడుపుతూ మెడిటేషన్‌ చేస్తూ శరీరంలో ఏ భాగంలో ఏ స్పందన కలుగుతుందో చూస్తూ, ఆ స్పందనలను అర్థం చేసుకోమని చెప్పారు. ఈరోజు పాదాల నుండి శిరస్సు దాకా చూడమని చెప్పారు. గంటసేపు కదలకుండా, కళ్ళు తెరవకుండా మెడిటేషన్‌ చేస్తూ మనసుతో శరీరంలోని అంగాంగాన్ని పరిశీలిస్తే ఎన్నో సంవేదనలు తెలుస్తాయి. నెప్పులు, చెమటలు, మంటలు, దురదలు, దగ్గులు, తుమ్ములు, ఆవలింతలు ప్రతి అంగంలోను ఏదో ఒక సంవేదన పుడుతూ, నశిస్తూ వుంటుంది. చెమట మీద చల్లగాలి తగిలినపుడు హాయిగా వుండడం, చెమటకి మంట పుట్టినప్పుడు చికాకుగా, కోపంగా వుండటం అన్నీ తెలుస్తుంటాయి. 150 మంది కూర్చునే హాలులో ఫ్యాన్‌లు వెయ్యరు. చెమట పట్టాలని ఆ ఫీలింగ్స్‌ తెలియాలనీ ఫ్యాన్‌లు వెయ్యరని తర్వాత అర్థమైంది కానీ ముందు చాలా కోపమొచ్చేది. కోపంగా బయటకొచ్చి చల్లగాలిలో తిరిగిన సందర్భాలు కూడా వున్నాయి. కానీ ఆ స్థితి అవసరమని తర్వాత అర్థమై నా ప్రవర్తనకి సిగ్గుపడ్డాను. ఆల్‌మోస్ట్‌ అందరూ అలాగే చేశారు.

తలనించి పాదాల దాకా, పాదాల నించి తలదాకా కళ్ళు మూసుకుని సర్వే చేస్తున్నప్పుడు శరీరంలో ఎన్నో స్పందనలు పుట్టి, నశిస్తున్నాయని, ఏ స్పందనా శాశ్వతంగా వుండదని అర్థమౌతుంది. తలనించి దిగుతున్నప్పుడు మెడమీద నొప్పి వుండవచ్చు. మళ్ళీ పాదాల నించి తలమీదికి వచ్చేటప్పటికి ఆ నొప్పి పోవచ్చు. తీవ్రత తగ్గొచ్చు. అంటే శరీరంలో పుట్టే ప్రతి స్పందన అశాశ్వతం. శరీర ధర్మం ప్రకారం నొప్పులు, చెమటలు, దురదలు ఇంకా ఎన్నో సంవేదనలు వస్తూ పోతుంటాయి. ఒకనాటికి తన ధర్మం ప్రకారం ముసలిదై శరీరం నశిస్తుంది. మట్టిలో కలిసిపోతుంది. ఆ శరీరానికి ఎన్ని నగిషీలు చెక్కినా, గుడిసెలో వున్నా, బంగ్లాలో వున్నా, వీధిలో వున్నా మరణం ఆసన్నమైనప్పుడు నశిస్తుంది. ఇది శరీర ధర్మం. ప్రకృతి ధర్మం కూడా అదే.

ప్రకృతి కూడా అనుక్షణం మారుతుంటుంది. గంగానదిలో నిలబడి నీళ్ళు తాగతున్నప్పుడు ఒకే నీరును మరో మాటు ఎప్పటికీ తాగలేం. తాగి తలయెత్తే సరికి గంగా ప్రవాహం ఎంతో దూరం పోతుంది. కొత్త నీరు వస్తుంది. హిమాలయాలు అలాగే వున్నట్టనిపిస్తాయి కానీ హిమం కరుగుతూ వుంటుంది. మళ్ళీ మంచు కురుస్తుంటుంది. విత్తనం మొలకెత్తగానే ఎదుగుతుంటుంది. ప్రకృతిలో చలనమున్నదంతా చలిస్తూనే వుంటుంది. మారుతూనే వుంటుంది. మార్పు సహజం. సుకుమార బాల్యం, ముగ్ధ యవ్వనం, మధ్య వయస్సు, ముసలితనం-శరీరం నిరంతరం మారుతుంటుంది. శరీరంలో కానీ, ప్రకృతిలో కానీ ఏది నిత్యం, శాశ్వతం కాదు. అంతా అనిత్యం. మార్పు మాత్రమే శాశ్వతం. ఇదే విపశ్యన. ప్రతిది నిత్యం మారడాన్ని అర్థం చేసుకోవడమే విపశ్యన. మార్పును అర్థం చేసుకోలేక శాశ్వతమనుకుంటేనే దుఃఖం. ఇప్పటికిది నిజం. వాస్తవం. అంతే.

ఆరోరోజు

ఈరోజు ఉదయం ఓ గమ్మత్తు జరిగింది. నాలుగ్గంటలకి విపరీతమైన వర్షం కురుస్తున్నప్పుడు మెలకువ వచ్చింది. లేచి టైమ్‌ చూస్తే నాలుగయ్యింది. బయట వర్షం. గంట కొట్టారో లేదో తెలియటం లేదు. అందరి రూమ్‌ తలుపులు మూసే వున్నాయి. ఎవ్వరూ లేవలేదు. బ్రష్‌ చేసుకుని బయటకొచ్చాను. ధమ్మసేవిక కనపడింది. బెల్‌ కొట్టలేదు అని చెప్పాను. అప్పుడు వెళ్ళి బెల్‌ కొట్టింది. నేను గొడుగు తెచ్చాను. గొడుగేసుకుని వర్షంలో సెంటర్‌ కెళ్ళాను. అలా కుండబోతగా కురుస్తున్న వర్షంలో ఒక్కదాన్ని నడుచుకుంటూ వెళ్ళడం ఎంత బావుందో చెప్పలేను. కాసేపటికి వాన తగ్గింది. ఒక్కరొక్కరే రాసాగారు. ఆలస్యంగా మెడిటేషన్‌ మొదలైంది. నిన్నటి పద్ధతే. తలమీంచి పాదాల వరకు ఏం జరుగుతుందో గమనించటం. గంటసేపు కదలకుండా కళ్ళు మూసుకుని కూర్చుంటే అన్నీ తెలుస్తాయి. మనసు ఎక్కడ ఆగుతుందో అక్కడ ఏదో ఓ సంవేదన/సెన్సేషన్‌ తెలుస్తుంది.

పదిగంటలకి మమ్మల్ని సెల్‌కి వెళ్ళమన్నారు. సెల్‌ అంటే పగోడా. ఆరు అడుగుల పొడవు/మూడు అడుగుల వెడల్పు వుండే చీకటి గది. లైట్‌ వుంటుంది. కానీ చిమ్మచీకటిలోనే కూర్చోవాలనిపిస్తుంది. అక్కడ కూర్చుని మెడిటేషన్‌ చెయ్యాలి. ఇక్కడ కూడా ఓ గమ్మత్తు జరిగింది. నాకు ఆరుబయటే విపరీతంగా చెమట పడుతుంది. పగోడాలోకి వెళ్ళగానే టాప్‌ తీసేసి బనీను, పైజామా మీద కూర్చున్నాను. చెమటతో తడిసిపోతాననుకున్నాను. ఒక్క చుక్క చెమట పట్టలేదు. ఆ మాట టీచర్‌కి చెబితే ‘మీరు పరిసరాలకు బాగా అడ్జస్ట్‌ అవుతారు. కొత్త ప్రాంతంలో కూడా టెన్షన్‌ వుండదు. చాలామందికి పగోడా చూస్తే భయం. చీకటి చూస్తే భయం. మీకు ఎక్కడున్నా ఒకటే. వాస్తవం మీద మీ దృష్టి వుంటుంది. ఇది చాలా మంచిది’ అన్నారు. మధ్యాహ్నం టీచర్‌ పిలిచారు. ఎందుకు పిలిచారా అనుకుంటూ ఆవిడ దగ్గరకు వెళ్లాను. పగోడాలో ఎలా వుందో అడగటానికి పిలిచారు. చాలాసేపు మాట్లాడారు. ఆవిడ కూడా పదిరోజుల కోసం వచ్చారు. మాతోపాటే వెళ్లిపోతారు. నా మెళ్ళో వున్న పూసలదండ ఏంటి? ఏం నమ్మకం ఇది అని అడి గారు. ఉట్టిదే! సరదాగా వేసుకున్నాను. నేను నాస్తికురాలిని. దేవుడిని నమ్మను అని చెప్పాను. ఓ ఇరవై నిమిషాలు అవి ఇవి మాట్లాడారు. ఆవిడ ఎవరితోనూ అలా మాట్లాడ్డం చూడలేదు. గుళ్ళల్లో నాకు ఎదురైన అనుభవాలు చెబితే బాగా నవ్వారు. గోయంకా గారి ఉపన్యాసాలు చాలా బావున్నాయి. చాలా వ్యంగ్యంగా సూటిగా మాట్లాడతారు. బుద్ధుడి జీవితం గురించి, ఎందరివో అనుభవాల గురించి చక్కగా చెబుతారు. ఆయన ఇంగ్లీషు చక్కగా వుంటుంది. నేను ఆయన హిందీ ఉపన్యాసాలు విన్నాను. తెలుగు అనువాదం నచ్చలేదు. రోజూ ఓ కొత్త అనుభవం. కొత్త ఆలోచనలు వస్తున్నాయి.

ఏడోరోజు ఉదయం ఓ సంఘటన జరిగింది. బ్రేక్‌ఫాస్టుకి వెళ్లినప్పుడు సేవిక నన్ను అరటిపండు తీసుకోవద్దని సైగ చేసింది. మొదట నాకు అర్థం కాలేదు. సరేనని ఉప్మా మాత్రమే తిన్నాను. నేను పండు రూమ్‌కి తీసుకుపోతున్నానని, ఐదు తర్వాత ఏమీ తినకూడదనే నియమం వుంది కాబట్టే అలా చెప్పింది కాబోలనుకున్నాను. ఆమెను అడిగాను. ఎందుకు అలా చెప్పారని (సేవికతో మాట్లాడొచ్చు) రూమ్‌కి తీసుకెళ్లి తినడం ‘శీల్‌భంగ్‌’ అని, అలా చెయ్యకూడదని చెప్పింది. కానీ చాలామంది రూమ్‌కి తీసుకెళ్ళడం గమనించాకే, తీసుకెళ్ళొచ్చనుకుని నేనూ అలా చేశాను. ‘శీల్‌భంగ్‌’ అనే మాట చాలా చికాకు పెట్టింది. టీచర్‌కెళ్ళి చెప్పాను. ‘నేను ఓ పొరపాటు చేశాను. నాకు తెలియక చేశాను’ అన్నాను. ‘పర్వాలేదులేండి. ఇప్పుడు తెలిసి మానేశారుగా. చెప్పారు కాబట్టి మాఫీ అయిపోయిందిలెండి’ అంటూ నవ్వారు. మనసులో చికాకు మాయమై పోయింది. అంతకు ముందు చాలా గింజుకున్నాను. ఎందుకు అలా చేశానని చాలాసేపు మధనపడ్డాను. పొరపాటును ఒప్పేసుకుని, బయటకు చెప్పేసుకోవడంతో ఎంత రిలీఫ్‌ వుంటుందో తెలిసి వచ్చింది.

పగోడాలో ఏడుపు

విపశ్యన మెడిటేషన్‌లో పగోడాలో కూర్చుని చేసే మెడిటేషన్‌ చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది. మనసు చాలా తీక్షణమౌతుంది. ఏడోరోజు పగోడాలో మెడిటేషన్‌ చేస్తున్నప్పుడు నాకెందుకో ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది. వెక్కి వెక్కి ఏడుస్తూనే వున్నాను. నా జీవితంలో నేను చేసిన కొన్ని తప్పులు గుర్తొచ్చాయి. వాటివల్ల ప్రభావితమైన వాళ్ళు గుర్తొచ్చారు. నా ప్రవర్తన వాళ్ళనెంత బాధపెట్టి వుంటుందో గుర్తొచ్చింది ఇలాంటివి ఒకటి రెండు సంఘటనలే నా జీవితంలో జరిగాయి. అవే గుర్తొచ్చి అమితమైన దుఃఖం కలిగింది. రెండోది హెల్ప్‌లైన్‌కి కాల్‌చేసే అసంఖ్యాక స్త్రీల దుఃఖం, వారి సమస్యలు, బాధలు గుర్తొచ్చి మరింత ఏడుపు తన్నుకొచ్చింది. నా స్నేహితుల్లో, నా చుట్టూ వున్న వాళ్ళల్లో కొంతమంది పడుతున్న మానసిక వేదనలు, సంఘర్షణలు గుర్తొచ్చి కూడా చాలా ఏడుపొచ్చింది. వాళ్ళంతా ఆ దుఃఖాలను మోయకుండా, ఇలాంటి మెడిటేషన్‌కి వచ్చి, ఆ బరువుల్ని దింపేసుకోగలిగితే ఎంత బావుంటుంది. అనిపించింది. పగోడాలో ఏడుపు గురించి టీచర్‌కి చెప్పాను. ”అలా దుఃఖం రావడం చాలా మంచిది. లోపలున్న బరువంతా కరిగిపోతుంది. స్త్రీల దుఃఖం మిమ్మల్ని కదిలించింది. వాళ్ళంతా సంతోషంగా వుండాలని మీరు భావిస్తారు. అందుకే వాళ్ళకోసం ఏడ్చారు” అన్నారావిడ.

ఆకలివేళ అందిన బిస్కెట్‌

మెడిటేషన్‌ పూర్తయ్యాక తొమ్మిదింటికి రూమ్‌కొచ్చి స్నానం చేసి, నైటీ తగిలించి బయటకొచ్చి నిలబడ్డాను. బయట చల్లగా, హాయిగా వుంది. ఆకాశంలో అర్ధచంద్రుడు ఆహ్లాదంగా కనిపిస్తున్నాడు. మెల్లగా ఆకలి మొదలైంది. రూమ్‌ లోపలి కెళ్ళి నీళ్ళు తాగాను. కాసేపు చల్లబడింది. మళ్ళీ మొదలైంది. ఐదింటికితిన్న మరమరాలు. సేవిక అలా చెప్పాక అరటిపండు డైనింగ్‌హాల్లో కూడా తినాలనిపించలేదు. తినలేదు. ఇంత ఆకలేస్తోంది. నిద్రపడుతుందా అసలు? పొద్దున్నే నాలుగింటికి లేవాలి కదా! తలుపేసి పడుకున్నాను. ఊహూ! ఆకలి…మళ్ళీ వరండాలో కొచ్చాను. అటు ఇటూ తిరగడం మొదలుపెట్టాను. అలా తిరుగుతున్నపుడు హఠాత్తుగా పక్కరూమ్‌లో ఉన్నావిడ ఓ చిన్న బిస్కెట్‌ పాకెట్‌ తెచ్చి నా చేతిలో పెట్టింది. ఆశ్చర్యపోయాను. మాటలు, పరిచయాలు లేవు కాబట్టి ఆవిడ పేరు తెలియదు. వొద్దన్నాను. ఫర్వాలేదు తీసుకోండి అని సైగల ద్వారానే చెప్పింది. ఆ తర్వాత ఆవిడ లోపలి కెళ్ళిపోయారు. నేను నా రూమ్‌లో కొచ్చి బిస్కెట్‌ ప్యాకెట్‌ విప్పాను. మూడు బిస్కెట్‌లున్నాయి. బ్రిటానియా వాళ్ళు కొత్తగా తెస్తున్న రాగిబిస్కట్స్‌ రెండు బిస్కెట్‌లు తిని నీళ్ళు తాగాక అబ్బ! ఆకలి మంట చల్లారడం అంటే ఏంటో అర్థమైంది. అసలావిడకి నాకంత ఆకలిగా వుందని ఎలా అర్థమైందబ్బా! బిస్కెటివ్వాలని ఎందుకన్పించిందబ్బా అంటూ ఆశ్చర్యపోతూ, ఆలోచిస్తూ నిద్రపోయాను.

ఎనిమిది, తొమ్మిది రోజులు పూర్తిగా మెడిటేషన్‌తోనే గడిచాయి. తలనుండి పాదాల వరకు, పాదాల నుండి తలవరకు గమనిస్తూ మెడిటేషన్‌ చెయ్యాలి. రిపీటెడ్‌గా గంటల తరబడి అదే స్ధితిలో వుండాలి. శరీరంలోని అంగాంగాన్ని గమనించడం, కలుగుతున్న సంవేదనల్ని చూడడం, సుఖకరమైన వాటిని, దుఃఖకరమైన వాటిని సమంగా చూడడం, నొప్పిని ద్వేషించడం, సుఖాన్ని ప్రేమించడం చెయ్యకుండా సమతని పాటించడం చాలా ముఖ్యమైన అంశంగా వుంటుంది. కళ్ళు మూసుకుని అంతర్నేత్రంతో మనసుని అంగాంగం మీదికి నడిపిస్తున్నపుడు చాలా అనుభవాలు కలుగుతాయి. మనసు ఒక అంగం మీద ఆగినపుడు అక్కడ ఏదో ఒక సెన్షేషన్‌ వుంటుంది. నొప్పో, దురదో, మంటో, చెమటో ఏదో ఒకటి వుంటుంది. మన రియాక్షన్స్‌ కూడా వుంటాయి. దురద పెట్టగానే గోకడం కూడా రియాక్షనే. దురదని ద్వేషిస్తాం. కోపంగా గోకుతాం. చెమటపట్టి చీదరగా వున్నపుడు చెమటని ద్వేషిస్తాం. ఆ చెమట మీదికి చల్లగాలి వాలినపుడు ఆ చల్లదనాన్ని ప్రేమిస్తాం. రెండూ క్షణికమైన స్థితులే. అశాశ్వతమైనవే.

మనం శిరస్సు నుంచి పాదాల వరకు అంతర్నేత్రంతో ప్రయాణం చేస్తున్నపుడు- మన ప్రయాణం మొదలుపెట్టినపుడు ముక్కు మీద దురదో, చెమటో, మంటో ఏదో ఒక సంవేదన కనబడుతుంది. మనం దాన్ని అలాగే సాక్షిలాగా చూసుకుంటూ పాదాలవేపు సాగాలి. ప్రయాణం అయిపోతే… మళ్ళీ పాదాల నుంచి శిరస్సు వేపు వచ్చినపుడు ఆ సంవేదన ముక్కు మీద వుండకపోవచ్చు. చెవిమీదో, నుదిటి మీదో అలాంటి సంవేదన కనబడవచ్చు. గోయంకా గారు చాలాసార్లు అనిత్య, అనిత్య అంటూంటారు. అలాగే మనసు పొరల్లోనో, గుండెల్లోనో గూడు కట్టుకుని గడ్డకట్టుపోయిన సంవేదనలు- మన సబ్‌కాన్షస్‌ మైండ్‌లో నిక్షిప్తం అయివున్న జ్ఞాపకాలు, ద్వేషాలు, ప్రేమలు, దుఃఖాలు, అసంఖ్యాక సంఘటనలు- మనం సంవత్సరాలుగా మోస్తున్న దుఃఖపు మూటలు మన అంతర్నేత్రానికి ఆనడం మొదలుపెడతాయి. శాశ్వత సంపదగా మనం మనలోపల నిక్షిప్తం చేసుకున్న గుట్టలకొద్దీ సంవేదనలు, వాటిద్వారా మనకి ఎదురైన దుఃఖాలు సుఖాలు అన్నీ కళ్ళకు కట్టడం మొదలౌతుంది. ఎవరి మీదో ఎంతో కాలంగా పెంచుకుని, గుండెల్లో ఘనీభవించుకున్న ద్వేషం, ఎవరి మీదో అవధుల్లేకుండా పెంచుకున్న ప్రేమ, ఆ ప్రేమవల్ల ఎదురైన దుఃఖాలు అన్నీ కరగడం మొదలౌతాయి. ఘనీభవించిన సంవేదనలు కరుగుతున్నపుడు మన కళ్ళల్లోంచి ఒక్కోసారి కన్నీళ్ళు ధార కడతాయి. చాలామంది బాగా ఏడుస్తారు. నా వరకు నేను ఎవ్వరి మీద శాశ్వత ద్వేషాన్ని పెంచుకోలేదు. నాకు ఎవరి మీద అంత ద్వేషం లేదు.

కానీ ఒక సంఘటన ఇక్కడ చెప్పాలి. నేను రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేటపుడు ఆ డివిజన్‌ సబ్‌కలెక్టరు నా మీద అకారణ ద్వేషం చూపించేవాడు. మీటింగుల్లో నిలబెట్టి అవమానించడం, పరుషంగా మాట్లాడడం చేసేవాడు. దానికి కారణముండేది కాదు. బహుశా నా బాడీ లాంగ్వేజ్‌, ధిక్కార స్వభావం అతనికి నచ్చి వుండవు. నాకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ప్యూడల్‌ బానిసత్వపు లక్షణాలు అలవడలేదు. నేను ఆఫీసుకు నా కైనటిక్‌ హోండా మీద వెళుతున్నపుడు, అతని జీప్‌ ఎదురుపడిందంటే- ఆ సాయంత్రం మీటింగ్‌లో అతను శివాలు తొక్కేవాడు. దీనివల్ల అతని మీద నాకు విపరీతమైన ద్వేషం, అసహ్యం పెరిగిపోయాయి. ఛాన్స్‌ వస్తే ఎప్పుడో తన్నాలి అన్నంత అసహనం పెరిగిపోయింది. ఇదంతా నా మనసులో ఘనీభవించిపోయింది. అతని పేరు తలిస్తే వొళ్ళంతా కంపించి పోయేంత కోపం. నేను ఆ డిపార్ట్‌మెంట్‌ వొదిలేసి వచ్చాకా పదేళ్ళ వరకు ఆ ద్వేషం నాలో వుంది. సంవత్సరం క్రితం భూమిక పనిమీద అతన్ని కలవాల్పి వచ్చినపుడు, కలిసి మాట్లాడినపుడు ఇతని మీద ఇంతకాలం ఈ ద్వేషాన్ని అలాగే గడ్డకట్టి దాచుకున్నానా? అని సిగ్గనిపించింది. ఆ ద్వేషం అలాగే వుండడంవల్ల నా కోపం పెరగడం తప్ప లాభమేముంది. అతని కొచ్చిన నష్టమేముంది? పోనీ నీ వల్ల నేనింత బాధపడ్డాను అని చెప్పానా? చెప్పే వీలుందా? లేదు కదా! ఆ రోజు అతని మీద ద్వేషం కరిగిపోయింది. గమ్మత్తుగా అతనిపుడు మా ఇంటి ఎదురుగా కొత్తగా కట్టిన ఐ.ఎ.ఎస్‌/ ఐ.పి.ఎస్‌ క్వార్టర్లో కొచ్చాడు. అతని మీద అదే ద్వేషం కొనసాగి వుంటే రోజు ఆ ఇంటి వైపు చూస్తూ కోపంతో సతమతమై వుండేదాన్ని, ఇపుడలాంటి ఫీలింగ్‌ లేదు. అలా గడ్డకట్టిన ద్వేషాలు, కోపాలు మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో విపశ్యన ద్వారా తెలిసింది.

విపశ్యన ధ్యానం చేస్తున్న క్రమంలో, గంటలకొద్దీ సమయం మనతో మనం గడపడంతో మన మనస్సులో పేరుకున్న వికారాలు మనకు అర్థమవ్వడం మొదలౌతుంది. రాగం, ద్వేషం ఈ రెండే మనల్ని ప్రభావితం చేస్తుంటాయని తెలుస్తుంది. ఆ రెండూ కూడా శాశ్వతంగా మనలో ఉండిపోయేవి కావని, అవి కూడా మారుతుంటాయని తెలుస్తుంటుంది. మనకి దుఃఖాన్ని కలిగించేవి, సుఖాన్ని కలిగించేవి ఏ సంవేదనలైనా, అవి ఎంత కాలముంటాయి? అవి శాశ్వతంగా వుండిపోతాయా? మారిపోతుంటాయా? అనిత్యాలైతే, మారిపోతే మనమెందుకు బాధపడాలి? ఎందుకు సంతోషపడాలి? ఆ ప్రభావాలు మన జీవితాల నెందుకు శాసించాలి? ఎన్నో ఆలోచనలకు నిలయమౌతుంది మనసు. ఆ మనసే అంతర్నేత్రం ద్వారా శరీరంలోని ప్రతి అంగాన్ని శోధిస్తుంటుంది. సంవేదనలని చూస్తుంటుంది. విపశ్యన ధ్యానం చేస్తున్న వాళ్ళు ఆ దుఃఖకార, సుఖకారక సంవేదనల్ని సాక్షిలాగా, సమత్వంతో చూడాలని గోయంకాగారు చెబుతుంటారు. కోట్ల కణాల సముదాయం శరీరమైతే ప్రతి కణంలోను ప్రతి క్షణం మార్పు జరుగుతుంటుంది. సంవేదనలు పుడుతూ గిడుతూ వుంటాయి. పుట్టిన క్షణం నుంచి ఈ మార్పు శరీరంలో జరుగుతుంటుంది. ఒకరోజు గడవడం అంటే ఒక రోజు చావుకి దగ్గరవ్వడం. శిశువు ఒక రోజు పెరగడం అంటే మరణానికి ఒక రోజు దగ్గరవ్వడం. ఈ నిరంతర మార్పు అనివార్యంగా జరుగుతూ చివరికి శరీరం మరణించడంగా పరిణమిస్తుంది. ఇది శరీర ధర్మం, దీన్ని ఎవ్వరూ మార్చలేరు. శాసించలేరు. అయినప్పటికీ మనిషి తాను శాశ్వతమనే భ్రమతోనే సంపదల్ని, పోగేసుకుంటూ వుంటాడు. సమాజానికి అణచివేతలకి, దుర్మార్గాలకి పాల్పడతాడు. మనిషిలోని కౄరత్వం, శరీరధర్మం ఏమిటో అర్ధం చేసుకోనివ్వదు. అహంకారం, ఆధిపత్యం, పొగరుబోతుతనం తన ఉనికి శాశ్వతమనే భ్రమని కల్పిస్తాయి. ఒక్కసారి మనిషి అంతర్ముఖుడై తన మనసులోని భయంకర చీకటి కోణాలపై వెలుతురు ప్రసరింప చేసుకోగలిగితే, తాను ఎన్ని నికృష్ట కార్యాలకు పాల్పడ్డాడో, ఎన్ని వికారాలు తనలో గూడు కట్టుకుని వున్నాయో, అవి తననెంత హీనస్థితికి దిగజార్చాయో అర్ధమవుతుంది. విపశ్యనలో పది రోజులపాటు ఎలాంటి బహిర్ముఖం లేకుండా అంతర్ముఖంలో వుంటూ తన మనసు లోతుల్ని శోధిస్తుండడం వల్ల, వాటి నిజ నైజాలు తెలుస్తుండడం వల్ల, తమ నిజ స్వరూపాలు తేట తెల్లమవుతుంటాయి. ఒక్కోసారి అది గాఢమైన దుఃఖానికి దారితీస్తుంది. రాగం, ద్వేషం, కౄరత్వం, అహంకారం, ఆధిపత్యం లాంటి గుణాలు తనకు దుఃఖాన్నివ్వడంతో పాటు తన చుట్టూ వున్న వాళ్ళకు మానసిక వేదనని, మనశ్శాంతిని లేకుండా చేస్తాయని అర్థమవుతుంది.

శరీరధర్మం ఏమిటి? మరణించడం, అంటే అశాశ్వతం, అనిత్యం. మరి ప్రకృతి ధర్మం ఏమిటి? వాట్‌ ఈజ్‌ రూల్‌ ఆఫ్‌ నేచర్‌? ప్రకృతి ధర్మం కూడా పుట్టడం, గిట్టడం, నిరంతర మార్పు, ఓ చిన్న బీజం నుండి పుట్టిన మర్రిమాను కూడా పుట్టి పెరిగి, పువ్వులు పూసి, కాయలు కాసి, మరణించడం, విత్తనం ద్వారా మళ్ళీ పుట్టడం… మళ్ళీ అదే సైకిల్‌. అంటే ప్రకృతిలోని సమస్తం. పుడుతూ, గిడుతూ…నిరంతరం మార్పు చెందుతూ వుండడమే ప్రకృతి ధర్మం. ధర్మం అంటే ఇక్కడ నియమం. మహోత్తుంగ హిమాలయాల మీద మంచు కూడా శాశ్వతంగా వుండదు. మంచు కురుస్తుంది. కరుగుతుంది. ప్రవహిస్తుంది. నదిగా అవతరిస్తుంది. ఆఖరికి సముద్రంలో కలుస్తుంది. మళ్ళీ మబ్బురూపం ధరించి వాన చినుకై కురుస్తుంది. హిమాలయాలు మంచుతో శాశ్వతంగా అలాగే నిలబడి వుంటాయని మనకి భ్రమ కలుగుతుంది. కానీ అక్కడ నిరంతర చలనం, నిరంతర మార్పు జరుగుతుంటుంది. హిమాలయాల మీద మంచు కూడా అశాశ్వతమే. అలాగే సముద్రాలు ఒక్కచోటే వున్నట్టు అనిపిస్తుంది. సముద్రంలో నిరంతరం మార్పులు జరుగుతుంటాయి. నదుల నీరొచ్చి చేరుతుంది. తనలోని నీళ్ళే మబ్బులై మళ్ళీ తన మీదే కురుస్తుంటాయ్‌. సెలయేళ్ళు, జలపాతాలు ఇవన్నీ కూడా చలన శీలత సిద్ధాంతానికి కట్టుబడి వుంటాయి. మార్పు ప్రకృతి ధర్మం. శరీరధర్మం- ప్రకృతి ధర్మం ఒక్కలాగే వుండి అనుక్షణం మారుతూ వుంటాయి. రెండింటిలోను శాశ్వతత్వం లేదు. మార్పు చెందుతూ పుడుతూ, నశిస్తూ వుండడమే రెండింటి ధర్మం. ఈ నియమాన్ని, ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే, అనుభూతి చెందాలంటే, ఎవరో చెబితే కాకుండా మనకు మనమే అనుభవంలోకి తెచ్చుకునే జీవనకళే విపశ్యన.

ఓ అర్ధరాత్రి సమస్తాన్ని వొదిలేసి చీకటిలోకి నడుచుంటూ వెళ్ళిపోయిన సిద్ధార్థ గౌతముడు, బుద్ధగయలో రావిచెట్టు కింద తపస్సు చేసి దుఃఖానికి పరిష్కారం సాధించాడని, బుద్ధుడయ్యాడని, ప్రపంచానికి వెలుగు ప్రసాదించాడని చెప్పగా విన్నాం. సాహిత్యంలో చదువుతున్నాం. దుఃఖమంటే ఎరుగని సిద్ధార్థుడు దుఃఖం ఎదురైనపుడు కలత చెంది అసలు మనిషికి దుఃఖం ఎందుకు కలుగుతుంది. దుఃఖం ఎక్కడ, ఎలా పుడుతుంది? అని బోధివృక్షం కింద కదలకుండా కూర్చుని శోధించాడు. దుఃఖ కారణం కనుక్కున్నాడు. వారాల తరబడి కదలకుండా కూర్చుని సిద్ధార్థుడు, కన్ను విప్పకుండా దుఃఖం కారణం కోసం తన లోపలే వెతకనారంభించాడు. తన మనసులోకి, తన లోపలి ప్రపంచంలోకి చేసిన ప్రయాణం తన శరీరంలో జరుగుతున్న సంవేదనలను చూపించింది. దుఃఖకారక, సంతోషకారక సంవేదనలు ఎలా పుడుతున్నాయో, నశిస్తున్నాయో సిద్ధార్థుడు తన అంతర ప్రపంచంలో గమనించాడు. కోరికలు ఎలా పుడతున్నాయో అర్ధం చేసుకున్నాడు. సంవేదనల స్వభావం- అవి మంచివైనా, చెడువైనా, దుఃఖాన్నిచ్చినా, సంతోషాన్నిచ్చినా వాటి జీవితం స్వల్పమని పుడుతూ గిడుతూ వుంటాయని తెలుసుకున్నాడు.

తన సొంత అనుభవం నేర్పిన ఈ జ్ఞానాన్ని విపశ్యన పేరుతో ప్రజానీకానికి పంచాడు. మొదట తన అనుభవాన్ని ఐదుమందికి పంచాడు. ఆ తర్వాత కోట్లాది మంది ఈ జ్ఞానాన్ని అందుకున్నారు. మనసు ఆడించినట్టల్లా మనిషి ఆడితే- కోరికలు తీరినప్పుడు సంతోషపడటం (ఆ సంతోషం కూడా అశాశ్వతమే) తీరకపోతే దుఃఖపడటం జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్పాడు. కోరికలే మనిషి దుఃఖానికి కారణమని, సుఖదుఃఖాలను సమంగా చూడగలిగితే- సమతను సాధించగలిగితే మనిషి జీవితం సాఫీగా సాగిపోతుందని, గొప్ప ఆనందం అందుబాటులోకి వస్తుందంటాడు.

ఒక వ్యక్తి మీద ప్రేమకన్నా, వస్తువుల మీద ప్రేమ కన్నా విశాల ప్రేమని, ప్రకృతిలోని సమస్తాన్ని ప్రేమించగలిగితే మనిషి మహానందాన్ని అందుకుంటాడని, అతను కూడా బుద్ధుడవుతాడని, బుద్ధుడు అనేది పేరు కాదని, సమస్థితిని సాధించిన ప్రతి ఒక్కరూ బుద్ధులేనని విపశ్యన చెబుతుంది. భారతదేశంలో బుద్ధుడి ద్వారా పుట్టిన ఈ జ్ఞానం ఇక్కడ అంతరించి పోయిందని, బర్మా మాత్రం దీన్ని భద్రంగా కాపాడుకున్నదని, తాను 1969లో బర్మా నుంచి భారతదేశం వచ్చానని, విపశ్యన సెంటర్‌లను స్థాపించానని గోయంకాగారు చెబుతారు.

పదిరోజులపాటు ఇంటిని, పనిని, అన్ని సంబంధాలని వొదిలేసి కేవలం నాతో నేను, నాలో నేను గడపడానికి-విపశ్యనకి వెళ్ళడానికి కారణం అసలు విపశ్యన అంటే ఏమిటో తెలుసుకోవడం, ఆ అనుభవం ఎలా వుంటుందో అనుభూతి చెందడం కోసమే.

నిజానికి నేను ఎప్పుడూ పాజిటివ్‌ దృక్పథంతోనే వుంటాను. జీవితాన్ని సింపుల్‌గా ఎలాంటి ఆర్భాటాలు లేని విధంగా మలుచుకున్నాను. వస్తు సముదాయం- అవి ఎలాంటివైనా సరే నన్ను ప్రలోభ పెట్టలేవు. దుఃఖాలను, దిగుళ్ళను గుండెల్లో మోస్తూ తిరగడం నా వల్లకాదు. వాటిని అధిగమించే మార్గాలను అన్వేషిస్తాను. ప్రతి సమస్యకు పరిష్కారం, ఆ సమస్యలోనే వుంటుందని నమ్ముతాను. ఏ అతీత శక్తిని నమ్మని దాన్ని కాబట్టే నాకు విపశ్యన సెంటర్‌లో వాతావరణం చాలా నచ్చింది. మతపరమైన కర్మకాండ, సంప్రదాయాలు లేని లౌకిక పద్ధతులు అక్కడ నెలకొనడం, బుద్ధుడి విగ్రహం కూడా లేకపోవడం బావుంది. బుద్ధుడిని భగవానుడని పిలవడం వెనుక ఇప్పటి భగవానుడు కాదని, విపశ్యన జ్ఞానం ద్వారా సమతను సాధించిన వాళ్ళని భగవాన్‌ అని ఆ రోజుల్లో పిలిచేవారని గోయంకాగారు వివరించారు. అలాగే పరమపదమంటే మరణాన్ని కూడా ఎరుకతో, చిరునవ్వుతో స్వీకరించడంగా అర్ధం చేసుకోవాలి. బుద్ధుడు మతం ఆధారంగా సృష్టించబడిన స్వర్గ, నరకాలను నిరసించాడని, మతపరమైన కర్మకాండల వల్ల మనిషి పొందే జ్ఞానమేమీ వుండదని, ఆ కర్మకాండలో కూరుకుపోవడమే వుంటుంది తప్ప దాన్నుండి బయటపడలేరని బుద్ధుడు చెప్పాడని గోయంకాగారు చెబుతారు.

మొత్తానికి విపశ్యన మెడిటేషన్‌ నాకొక కొత్త అనుభవాన్నే ఇచ్చింది. ఆహ్లాదకరమైన వాతావరణం, ఎంతో నిబద్ధతతో పనిచేసే ధమ్మసేవికలు, ఎంతో స్నేహంగా వుండే టీచర్‌ పద్మజగారు. పది రోజుల పాటు చక్కటి క్రమశిక్షణ, వొళ్ళొంచి అన్ని పనులూ చేసుకోవడం చాలా నచ్చింది. మనం తలుచుకుంటే ఏమైనా చెయ్యగలం అనే నమ్మకాన్ని విపశ్యన మనకి ఇస్తుంది. పదిరోజులు మాట్లాడకుండా వుండగలం, రాత్రి భోజనం లేకుండా బతకగలం, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మనతో మనం పదిరోజులు గడపగలం. అన్నింటినీ మించి పుడుతూనే సెల్‌తో పుట్టామని, కంప్యూటర్‌ కవచ కుండలాలతో పెరిగామని విర్రవీగే వాళ్ళకి అవి లేకుండా కూడా హాయిగా పది రోజులు బతకొచ్చిని అర్ధమౌతుంది. ఎప్పుడూ బయట ప్రపంచంతో, వస్తు సముదాయంతో ఉక్కిరిబిక్కిరిగా బతికే మనం, మన లోపలి ప్రపంచాన్ని దర్శించాలంటే, సంకుచిత ప్రేమల్నుండి విశ్వప్రేమను అలవరుచుకోవాలంటే ప్రతి ఒక్కరం ఈ అనుభవాన్ని పొంది తీరాలి.

మరో ముఖ్య విషయం చెప్పాలి. ఇక్కడ భోజనం, వసతి అన్నీ ఉచితమే. విరాళాలివ్వమని కూడా అడగరు. అయితే పది రోజులు హాయిగా అన్ని సౌకర్యాలు పొందుతాం కాబట్టి మనమే విరాళం ఇవ్వాలనుకుంటాం. నేను రూ.2000/-లు విరాళమిచ్చాను. ఇక్కడ పద్ధతి ఏమంటే నేను ఇచ్చిన విరాళం నా తర్వాత వచ్చేవాళ్ళకు ఉపయోగపడుతుంది. నా కోసం ఎవరో విరాళం ఇచ్చే వుంటారు. ఈ అవగాహనతో అందరూ తోచినంత విరాళం ఇస్తారు. నిజానికి పదిరోజులు తిండితిప్పలు, కరెంట్‌, వాటర్‌ వీటికి బాగానే ఖర్చవుతుంది. సాధకులిచ్చే డొనేషన్స్‌ కాకుండా వేరే ఎలాంటి విరాళాలు స్వీకరించరు.

అన్ని మానవ సంబంధాల్లోకి స్నేహం ఉన్నతమైందని నమ్మే నాకు- విపశ్యన చివరిరోజు మంగళమైత్రి ఒక్కటే అలవరుచుకోవాలని, ప్రకృతి మీద, మానవాళి మీద స్నేహాన్ని, ప్రేమని మాత్రమే కురిపించాలని, మనం స్నేహంతో మన హృదయాన్ని నింపుకుంటే, ఆ స్నేహం మన చుట్టూ ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతుందుని, ఒక్కోసారి ఆ స్నేహం- ప్రేమ మన మనసుల్లోంచి పొంగిపొర్లి మనతో వున్న వాళ్ళందరికీ దాన్ని పంచుతుందని గోయంకా గారు చెప్పినపుడు నా కళ్ళల్లోంచి ఆనందబాష్పాలు కురిసాయి. మానవాళి మొత్తం ఈ కళని అలవరచు కుంటే యుద్ధాలు, ఉగ్రవాదాలు, అరాచకాలు, అన్యాయాలు తొలగిపోయి, ప్రపంచం మొత్తం శాంతి నెలకొని, అందరూ మనశ్శాంతితో హాయిగా బతుకుతారు కదా అనిపించింది.

చివరగా పదో రోజు మధ్నాహం నుండి ఒకరితో ఒకరం మాట్లాడుకునే అవకాశం దొరికింది. చిత్రంగా చాలామంది నన్ను గుర్తుపట్టారు. మీరు టివీలో వస్తారు కదా! మిమ్మల్ని చాలాసార్లు చూశాం అన్నారు. పరస్పర పరిచయాల్లో భూమిక పత్రిక, భూమిక హెల్ఫ్‌లైన్‌ గురించి చెబుతూ నేను రచయిత్రినని, జర్నలిస్ట్‌నని చెప్పగానే చాలామంది బాగా ఎగ్జయిట్‌ అయ్యారు. హెల్ప్‌లైన్‌ గురించి వివరంగా చెప్పమన్నారు. నేను చేస్తున్న పనిని మెచ్చుకుంటూ చాలామంది అభినందనలు చెప్పారు. టీచర్‌ పద్మజగారు నిన్నటివరకు మీరు నాకు నమస్తే చెప్పారు. ఈ రోజు నేను మీకు నమస్తే చెబుతున్నాను. మీరు బాధిత స్త్రీల కోసం చాలా చేస్తున్నారు. అభినందనలు, నేను మీ ఆఫీసుకొస్తాను. మనం మళ్ళీ కలుద్దాం” అన్నపుడు నాకు నా పనిపట్ల మరింత గౌరవం, నిబద్ధత పెరిగినట్లనిపించింది. నేను రెగ్యులర్‌గా సందర్శించే చెంచల్‌గూడా మహిళా జైలులో విపశ్యన మెడిటేషన్‌ను ఏర్పాటు చేద్దామని పద్మజగారితో చెప్పినపుడు ఆవిడ తప్పకుండా ప్రయత్నిద్దాం అన్నారు.

జులై మొదటి తేదీన పెట్టే బేడా సర్దుకుని, నా రూమ్‌ని శుభ్రంగా కడిగి, దుప్పట్లు వగైరాలు ఉతికేసి మళ్ళొస్తానని చెట్టులకు, పిట్టలకు చెప్పి, తేలికైన శరీరంతో (మూడు కేజీల బరువు తగ్గాను) ఉత్సాహంగా వున్న మనసుతో మా ఇంటి దారి పట్టాను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.