అసలు స్త్రీలు లేని చరిత్ర ఉందా? -కొండపల్లి కోటేశ్వరమ్మ

 

ఎందుకు వీళ్ళకు నిరుత్సాహం? ఈ నిరుత్సాహంతో దేవుడివైపు మొగ్గారా లేక వీళ్ళకీ సిద్ధాంతం ఒంటబట్టలేదా అని నేను ఫీలవుతున్నాను ఈ ఫ్యామిలీస్‌ను చూస్తూ.

మొదటిసారిగా దేశం, ప్రజలు, దేశభక్తి అనేది ఆనాడు ఎట్లా తెలిసిందంటే, మా బాబాయి కాంగ్రెస్‌ ఉద్యమంలో పని చేస్తుండేవారు. నేను చదువుకునే రోజుల్లోనే కాంగ్రెస్‌ ఉద్యమం గురించీ, బ్రిటిష్‌ వాళ్ళు చేసే అరాచకాల గురించి పాటలు వింటే చిన్నతనంలోనే అసహ్యం పుట్టింది. ‘మాకొద్దీ తెల్లదొరతనం’, ‘వాడు కుక్కలతో పోరాడి కూడు తింటాడట’ అనే పాటలు వినేవాళ్ళం. అలాగే దేశాన్ని గురించి, దేశమంటే, దేశభక్తి గేయాలంటే నేను ప్రభావితమవుతూ దేశభక్తులుగా పుట్టడం ఒక అదృష్టమేనేమో అనుకుంటూ వచ్చేదాన్ని. అలాగే కాంగ్రెస్‌ చరిత్ర, కాంగ్రెస్‌కు ఓటు వేస్తానంటే పదేళ్ళ దానివి నీకు ఓటుహక్కు ఎక్కడ నుంచి వస్తుంది, వద్దు తర్వాత వేద్దువుగానిలే అనేవారు.

అలా నేను ప్రతి కాంగ్రెస్‌ మీటింగ్‌కి హాజరవడం, దేశభక్తి గేయాలు పాడుతూ ఉన్న సమయంలో కాంగ్రెస్‌ నుంచి కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ అనేదొకటి ఉద్భవించింది. అదే కుర్రవాళ్ళందర్నీ కూడగట్టి మంత్రివారి పాలెంలో, ఇంకా కొన్ని చోట్ల సమ్మర్‌ స్కూల్స్‌ పెట్టి వాళ్ళలో మార్పు తీసుకొచ్చింది. అప్పుడది కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీగా ఉండేది. వాళ్ళే కొన్నాళ్ళకు కమ్యూనిస్టులుగా మారారు. ఆ కాంగ్రెస్‌ సోషలిస్ట్టు పార్టీలో ఉండే కుర్రాళ్ళని, ఇలా దేశభక్తుండి, చక్కగా పాడగలిగిన ఉత్సాహమున్న పిల్లల్ని తీసుకెళ్తే జీవితం రాణిస్తుంది, ఉద్యమం బలపడుతుందన్న ఉద్దేశంతో ఆలోచించి ఇలా యాక్టివిటీస్‌లో ఉన్న వాళ్ళందర్నీ తీసుకొచ్చి వివాహాలను కూడా ప్రోత్సహించారు. అలా నా వివాహం ఒక కమ్యూనిస్టుతోనే జరిగింది. వివాహం జరిగిన తర్వాత కూడా, కమ్యూనిస్టు భావాలతోటి, దేశభక్తితోటి స్వరాజ్యం రావాలి, అందరూ సుఖపడాలి, తెల్ల వాళ్ళు పోవాలి అనేవి మనసులో బాగా నాటుకున్నా, సంప్రదాయాలు, ఆచారాలు వంటి వాటికి ముడిపడి ఉన్న జీవితం కాబట్టి, కొన్ని విషయాల్లో ముందుకు రాలేకపోయాం.

స్త్రీలందరితో కూడా మే డే అనీ, విప్లవ దినోత్సవాలనీ పండుగలుగా చేసుకునేవాళ్ళం. ఆ పండుగ రోజుల్లో స్త్రీలందర్నీ కూడా పెద్దగా ఊరేగింపుల్లో తీసుకొచ్చేవాళ్ళం. చుట్టూరా ఉన్న ఫిర్కా వాళ్ళంతా గుడివాడ సెంటరుకొచ్చేసి అక్కడ ఊరేగింపు, పెద్ద బహిరంగ సభ అన్నీ జరిపేవాళ్ళం. ఆ మీటింగుల్లో పాటలు పాడటం వంటివి చేసేవాళ్ళం. తర్వాత ప్రజాసంఘాలు ఏర్పడ్డాయి. ఆ ప్రజాసంఘాల్లో స్త్రీలందరూ కూడా మహిళా సంఘాలుగా ఏర్పడాలి, మహిళలుగా కృషి చేసి సమస్యలపై పోరాడాలి, స్త్రీలకెవరేం చేశారో ముందు తెల్సుకోవాలి. ఆ స్త్రీ సమస్యలెట్లా సమాజాన్ని బట్టి, మానవుని అవసరాల్ని బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి. కాబట్టి పూర్వం ఎన్ని ధర్మాలున్నా మారిపోయి ఇప్పుడు మానవత్వం మనుగడకు సమసమాజంలో ఏ ధర్మాలు కావాలనేది గుర్తించి దానికి దోహదం చేసే సాహిత్యం. వీరేశలింగం గారు, ”దేశభక్తియుతమైంది వందేమాతరం కాదు. అంతకంటే మంచి గేయం, దేశభక్తి గేయం గురజాడ రాశారు చూడండి” అని చెప్పారు. మేము చదివి దానిలో ఉన్న సారాన్ని అర్థం చేసుకున్నాం. అలాగే మేం కూడా వట్టి మాటలు కాదు, సొంత లాభం కొంతయినా మానుకుని.. అంతా మానుకోవటం సాధ్యం కాదనుకోండి, కొంత మానుకునైనా ముందుకు రావాలని అనుకుని మహిళా ఉద్యమంలో పనిచేశాం. తర్వాత ఉపన్యాసాలతో పాటుగా మనసుకి ఉల్లాసాన్ని, ఆనందాన్నిచ్చే పాటలు, నాటకాలు, బుర్రకథలు కూడా కావాలి అనే

ఉద్దేశంతో బయల్దేరాం. మీరు రండి, అనే ప్రోత్సాహం కమ్యూనిస్టు పార్టీ ఇచ్చింది.

మహిళా ఉద్యమంతో పాటుగా కల్చరల్‌ యాక్టివిటీస్‌లో కూడా పాల్గొనేవాళ్ళం. అయితే అప్పట్లో స్త్రీలు నాటక రంగంలోకి వచ్చేది లేదు. కిరాయి స్త్రీలు వచ్చి నాటక రంగంలో పాల్గొనేవాళ్ళు. మహిళలు

ఉద్యమంలోకి వచ్చినంత చొరవగా నాటక రంగంలోకి రాలేకపోయాం. మేం బెంగాల్‌నే ఆదర్శంగా తీసుకునేవాళ్ళం. బెంగాల్‌లో రవీంద్రుని మనుమరాలు నాటకాల్లో యాక్ట్‌ చేసింది. అలా ‘ముందడుగు’ నాటకం స్టార్ట్‌ అయింది. దీన్ని సుంకర, వాసిరెడ్డి రాశారు. ముందడుగు నాటకాన్ని మగవాళ్ళే యాక్ట్‌ చేస్తే అది ముందడుగు అనిపించదు, స్త్రీ పాత్రలు స్త్రీలే యాక్ట్‌ చేయాలి, అప్పుడే అది ముందడుగు అన్పించుకుంటుంది అని భావించాం.

అలా నాటకాలు వేశాం. దీనికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సలహాలిచ్చేవారు. మొదట ఎవరూ రాలేకపోయాం. భయం. సంసార స్త్రీలు రంగం మీదికొస్తే ఏదో వేశ్యను చూసినట్లు చూస్తారేమో అనే భయం. రాత్రి యాక్ట్‌ చేసిన అమ్మాయి అదిగో అని వెక్కిరిస్తారని చెప్పి నేను రానంటే సీతారామయ్యగారు అసలు అన్నం తినకుండా ఉపవాసం ఉన్నారు. మరి పురుషునికున్నంత నిబ్బరం స్త్రీకి ఉండదు కదా! భర్త అన్నం తినకపోతే చాలా బాధపడిపోతుంది. ఈ మనస్తత్వం బాగా జీర్ణించుకుని

ఉన్నవాళ్ళం. మరి సోవియట్‌ రష్యాలో వాళ్ళ కల్చర్‌ ఎలా ఉండేదో తెలియదు కానీ, ఇక్కడ భర్త తిడుతుంటే సహించేవాళ్ళం. ఆయనెట్లా చెప్తే అలా వినాలి తప్పదు అనే భావనతో ఆ నాటక రంగంలోకి వచ్చాం. అసలు ఇష్టంలేని పనులు చేయిస్తున్నారనే బాధ ఎక్కువగా

ఉండేది. ఇక తప్పదు విధి అనుకునేవాళ్ళం. కొన్నిసార్లు మా పక్కన భర్తగా ఎవరో ఉంటే యాక్ట్‌ చేయలేకపోయేవాళ్ళం. నాటకమంతా చక్కగా ఉండాలంటే మీరలా కాక నటన బాగా చేయాలి, నటన సహజంగా ఉండాలి, ఆయన మీ అన్నయ్యలాంటి వాడే అని చెప్పేవారు. నటన కృత్రిమంగా లేదు, బాగుందని అభినందనలు ప్రదర్శించేసరికి మాకు ఉత్సాహం వచ్చేసింది. మా మిత్రులు, కామ్రేడ్స్‌ అంతా మేమంతా ఉన్నాం కదా అనేవారు.

దీనికంటే ముందు అంటే ‘ముందడుగు’ కన్నా ముందు సాహిత్యంలో ఈ ఛందస్సు, గణాలు, కామాలు, పుల్‌స్టాప్‌, ఈ బండిర (ఱ) ఇవన్నీ అనవసరం అనే భావనతో తాపీ ధర్మారావు గారు రాసినవి, గురజాడ గారి ‘కన్యాశుల్కం’ లాంటి కొన్ని నాటకాలు వేశాం. అంటే పాతవాళ్ళు అభ్యుదయ భావాలతో రాసిన నాటకాల్నే ముందు వేశాం. అయితే గురజాడ, కందుకూరి నాటకాలు మా వరకే వేసి చూపెట్టాం. బైట ప్రపంచానికి చూపెట్టలేదు. ‘ముందడుగు’, ‘మా భూమి’ నాటకాలు బయటి ప్రపంచం ముందు వేయడానికి భయపడ్డాం. కమ్యూనిస్టు పార్టీ ఎంత బలంగా ఉందో తెలుసు కదా! మనవాళ్ళే కాదు, ఇతర స్త్రీలపై కూడా ఈగవాలితే మేం ఊర్కోం అని చెప్పేసి ఒక పొలిటికల్‌ అవగాహనతోనే కాకుండా ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో తీసుకొచ్చామన్న మాట.

మా కుటుంబాల్లో బంధువుల్నీ, పాత మిత్రులకంటే కూడా ఈ పార్టీలో ఉన్న వాళ్ళమంతా ఒక ‘ఫ్యామిలీ’లో లాగా, అక్క చెల్లెళ్ళలాగా కలిసి పనిచేశాం. కొందరు మహిళా సంఘాల్లో పనిచేసినా, కొందరు ప్రజానాట్యమండలిలో, కమ్యూన్‌లో బుల్లెమ్మకి సహకరించినా అందరం ఏకతాటిపై ఉండేవాళ్ళం. మన అభిరుచులకి అనుగుణంగా ఉన్నవాళ్ళతోటే దగ్గర సంబంధాలు ఏర్పడి మనం దేశవ్యాప్తంగా రావడానికి కృషి చేయాలి అనే ఉద్దేశ్యంతో మా రోజుల్లో వర్ణాంతర వివాహాలు జరిగాయి. వితంతు వివాహాలను కందుకూరి ప్రవేశపెట్టారు. కానీ విస్తృత ప్రాతిపదిక మీద పార్టీ వాళ్ళే చేశారన్నమాట. వర్ణాంతర వివాహాలు కూడా ఉద్యమ రీత్యా, ఉద్యమం బలపడడానికే. దేశవ్యాప్తంగా ఒకరికొకరితో లింకు ఏర్పడడానికి గోదావరి జిల్లా అమ్మాయిని, కృష్ణా జిల్లా అమ్మాయిని, నందిగామ తాలూకా, గుంటూరు… ఇలా అన్ని చోట్లకీ సంబంధాలుండేలా…. అయితే కమ్మోరిలో నాలుగు తెగలు, రెడ్డోరిలో పది తెగలు ఉండేవి, కాపుల్లో కూడా ఇలా తెగలుండేవి. ఈ తెగలే కాకుండా కులాంతర, వర్ణాంతర, మతాంతర వివాహాల దాకా తీసుకొచ్చారు. ఇవి కూడా ఉద్యమంలో భాగంగా జరిగేవి. వీళ్ళు కట్నాల్లేకుండా చేసుకున్నా కానీ బయట వ్యతిరేకత బాగా ఉండేది. ఈ కమ్యూనిస్టు పిల్లలు ఉద్యోగాల్లేకుండా జైళ్ళకే పోతారు. చేసుకుంటే మా పిల్లలు సుఖపడరేమోనని చాలామంది తల్లిదండ్రులు వ్యతిరేకించేవారు. అయితే ఆ పిల్లలను, ధైర్యంగా ఉండేవారిని ప్రోత్సహించి తీసుకొచ్చేవాళ్ళం.

తాపీ ధర్మరావుగారి కోడలు రాజమ్మ. ఆమె బ్రాహ్మిన్‌. ఆమెను ముసలాయనకిచ్చి పెళ్ళి చేయబోతుంటే ఏడుస్తూ చెప్పి వెళ్ళిపోయింది. చెప్తే నీకేం భయంలేదు అని చెప్పి తీసుకొచ్చేశారు. మాకు కమ్యూనుండేది. ఏ హోటల్లోనో, ఎవరి ఇంట్లోనో ఉండాలనే భయం లేదు. కమ్యూన్లో ఉండేది. ఆమె అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది. ప్రజానాట్య మండలిలో కూడా పాల్గొనేది. కొంత కాలం తర్వాత తాపీ ధర్మారావు గారి కొడుకు యోషన్‌ రావు గారు ఆమెను వివాహం చేసుకున్నారు. ఇంకా ఎన్నోచోట్ల అలా చేశామనుకోండి. దీన్ని ఉదాహరణ కోసం చెబుతున్నా అంతే.

అలా కొంతకాలానికి కమ్యూనిస్టు పిల్లల్ని చేసుకుంటే మా పిల్లలు సుఖపడతారనేది మా కుటుంబాల్ని చూసిన తర్వాత అనుకున్నారు. వాళ్ళకు విమర్శ, ఆత్మ విమర్శ ఉండేది. అసలిలా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేవనుకోండి. ఏదైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళు కోప్పడడం, వాళ్ళ సహకారం ఉంది కాబట్టి మా పిల్లల్నిస్తే సుఖపడతారనే స్థితికి వచ్చారు.

ఇక సాహిత్యంలో చూస్తే స్త్రీలు ఎంతవరకు రాయగలిగారు అంటే, అంత విస్తృతంగా అది వ్యాప్తిలోకి రాకపోవచ్చు. కానీ సాహిత్య వారమని జరుపుకునేవాళ్ళం. ఈ మహిళా కార్యకర్తలందరూ కూడా మన ప్రోగ్రెసివ్‌ సాహిత్యమంతా సంచుల్లో పెట్టుకుని తిరిగేవాళ్ళు. ఇప్పటిలాగా బస్సు సౌకర్యాలు లేవు. మోయలేక, మోయలేక మోసేవాళ్ళం. ఊరూరా తిరిగేవాళ్ళం. మాలపల్లి, శరత్‌, ప్రేమ్‌చంద్‌, వీరేశలింగం, గురజాడ. ఈ సాహిత్యంతో పాటు అభ్యుదయ సాహిత్యం, దాని తర్వాత ఇతర దేశాల సాహిత్యం కూడా ప్రవేశించింది. గోర్కీ రాసిన ‘అమ్మ’, ‘అన్నా కెరనీనా’, ‘నానా’ ఇలా కొన్ని నవలలు వచ్చాయి. అప్పుడు సాహిత్యంలో కాల్పనికోద్యమం

ఉండేది. ఆ కాల్పనిక సాహిత్యం నుంచి అభ్యుదయ సాహిత్యం మొదలైంది. దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కృష్ణశాస్త్రి, సోమసుందర్‌ లాంటి వాళ్ళందరూ కాల్పనికోద్యమం నుంచి వచ్చారు.

అభ్యుదయ సాహిత్యానికి శ్రీ శ్రీ పెద్ద అన్నయ్యలాగా అన్పించేవారు. శ్రీ శ్రీ ద్రోణాచార్యులైతే, తెలియని ఏకలవ్యులెందరో. చలం సాహిత్యం కూడా కొంతమంది చదివేవారు. ఆయన స్త్రీకి కూడా న్యాయం చేశాడు. అంటరాని వాళ్ళెంతో స్త్రీలూ అంతే కానీ, ఈ సాహిత్యం ఆచరణ సాధ్యం కాదేమో అనిపించేది. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా స్త్రీకి ఇబ్బందులు అలాగే ఉన్నాయని నా భావన. ఎంత కమ్యూనిస్టు పార్టీ వచ్చినా, రివల్యూషన్‌ వచ్చినా స్త్రీల బాధలు, గాధలు తప్పవనే అనుకోండి. చలంగారు స్త్రీ, పురుషుల్ని సమానంగా చిత్రించిన సాహిత్యం మేమందరం చదివాం. కానీ అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు కదా! చలం ‘బిడ్డల శిక్షణ’, ‘స్త్రీ’ ఇంకా ఉన్నాయి కదా! అవన్నీ చదివి మనం ఎంతవరకు జీర్ణించుకుంటాం. ఇప్పుడిప్పుడే ఉద్యమంలోకి వచ్చేవాళ్ళకి ఇస్తే అది ఎంతవరకు రాణిస్తుంది అనే ఉద్దేశ్యంతో ఆ వైపునకి పెద్దగా వెళ్ళలేదు. ఈ సాహిత్య వారంలో, ఇతర దేశాల్నుంచి మార్క్సిస్టు ఔట్‌లుక్‌, సిద్దాంతంతో పాటు స్త్రీలను సభ్యులుగా చేర్పించి గ్రామాల్లో చదివించేవాళ్ళం, అభ్యుదయ రచయితల పాటలు పాడి విన్పించేవాళ్ళం. వాళ్ళు కూడా చాలా సంతోషంగా వినేవాళ్ళు. మీటింగుల్లో పాటలే కాకుండా చందాలు కూడా వసూలు చేసేవాళ్ళం.

ఇక కల్చరల్‌గా ప్రజా నాట్య మండలి, మహిళా సంఘం, బాల సంఘం ఎవరివి వారికి ఉన్నాయి. ఈ ప్రజా సంఘాలన్నింటినీ కమ్యూనిస్టు పార్టీ ప్రభావితం చేసింది. ఈ పార్టీ అంటే భయపడే వాళ్ళంతా ప్రజా సంఘాల్లోకి రావచ్చు. కొందరు మాత్రం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో వచ్చిన సంఘాలే కదా ఇవి కూడా అనేవారు. అలా ఉంటుండగానే జపాన్‌ ఫైట్‌, పీపుల్స్‌ వార్‌ ప్రకటించిన తర్వాత హిట్లర్‌, ముస్సోలినిలను దుయ్యబడుతూ కొన్ని గేయాలు వచ్చాయి. ఆ గేయాలను కూడా ప్రచారం చేసేవాళ్ళం. సుంకర వాళ్ళు ప్రజలకు తేలిగ్గా అర్థమయ్యేలా గేయాలు రాశారు. తెలంగాణా మీద గోపాలకృష్ణయ్య ఒక వ్యాసం కూడా రాశారు. కొన్ని పుస్తకాలు అర్థమయ్యేవి, కొన్ని కొన్ని అర్థమయ్యేవి కాదు. సోమసుందర్‌ రాసిన ‘వజ్రాయుధం’ అర్ధమయ్యింది. కానీ ఆరుద్ర ‘త్వమేవాహం’ అర్థం కాలేదు. అట్లా అర్థం కానప్పుడు దాంతో స్టార్ట్‌ చేస్తే బాగుంటుందని, గిడుగు రామ్మూర్తి పంతులుగారు, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు ఆరాధ్యులుగా మన జాతికి ఎంతో మేలు చేశారు. అప్పుడే గిడుగు రామ్మూర్తిగారు చేశారు కానీ మనం ఇప్పటికీ చేయలేకపోతున్నాం. అప్పట్లో పార్టీ కోసం ఆంధ్రపత్రికను మేమే ప్రారంభించాం.

అప్పట్లోనే బెంగాల్‌లో కరువొచ్చింది. దాని నివారణకు మానవతా దృక్పథంతో మనమేం చేయాలని ఆలోచించి, చందాలు వసూలు చేయడమే కాకుండా, ప్రత్యక్షంగా కరువు గురించి గేయాలు రాసి పాడేవాళ్ళం. ‘ఇదీ లోకం’ అని శ్రీరామచంద్రమూర్తి అని ఒకాయన రాశారు. ఈ నాటకాన్ని ప్రజల ముందు ప్రదర్శించాం. నేను దాంట్లో ‘జీవచ్ఛవం’ పాత్ర వేశాను. దానికి చాలా గుర్తింపు వచ్చింది. తర్వాత రాష్ట్ర కాన్ఫరెన్స్‌ జరిపినపుడు మా నాటకానికి ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. నాకు ఉత్తమ నటిగా వెండి ప్పు వచ్చింది. తర్వాత రాయలసీమలో కరువు వచ్చింది. జి.వరలక్ష్మితో పాటు అందరూ వచ్చి పాల్గొన్నారు. పోటీలు మనవాళ్ళకే కాకుండా, సాహిత్య అకాడమీ వాళ్ళు అన్ని ప్రాంతాల్లో పోటీ పెట్టినపుడు కూడా మనవాళ్ళే గెలిచారు. అప్పుడు మిత్రులందరూ కిరాయి స్త్రీలు (మగవాళ్ళే ఆడపాత్రలు పోషించడం) చేస్తూ ఉండడం వల్ల ఇలా అణగారిపోయింది అనుకున్నారు. ‘ప్రజా నాట్యమండలి’ మంచి ఆర్గనైజేషన్‌. వాళ్ళు పెద్ద పెద్ద నాటకాలు వేయలేకపోయినా ఈ నాటకం రాణించడానికి చక్కగా దోహదం చేశారు. వాళ్ళంతా ఇంత ఆర్గనైజ్డ్‌గా ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి వాళ్ళు పాత్రలో విలీనమైపోయి నటించడమే కారణం. దీనికి కారణం ఉద్యమమే అని ఇతరులు గుర్తించారు.

ఇలా ప్రజా నాట్యమండలిలో పనిచేశాను. తర్వాత సీతారామయ్యగారిని వేరే తాలూకాకి వేశారు. అది బలహీనమైన తాలూకా. కుటుంబమంతా కలిసి అక్కడికి మారిపోయాం. అక్కడ కూడా నేను ప్రజా నాట్యమండలి, మహిళా ఉద్యమంలో పనిచేసేదాన్ని.

మేము తాలూకా సంఘాల్లో, ప్రజా సంఘాల్లో, మహిళా సంఘాల్లో పనిచేస్తూ పత్రికల్ల్లో కూడా చేసేవాళ్ళం. తాపీ ధర్మారావుగారు కొంత పనిచేసేవారు. పీపుల్స్‌ వార్‌, ప్రజాశక్తి, ఇతర పత్రికలెన్నో ఉండేవి. బోల్షివిక్‌ పోటీతో ఉన్నాయన్నమాట.

బోల్షివిక్‌ చరిత్ర అంటే పెద్దగా తెలియకపోయినా కమ్యూనిస్టు పార్టీ అనే భక్తిభావంతో చేశాం. ఒకరి కోటా పది పత్రికలైతే, ఒక్కొక్కరు పాతిక దాకా అమ్మేవారు. అవన్నీ చేతులమీద వేసుకుని బజార్లలో తిరిగి అమ్మేవాళ్ళం. రైల్వేస్టేషన్‌లో అమ్మేవాళ్ళం. చందాలు వసూలు చేసేవాళ్ళం. అయ్యో! ఎండ కన్నెరగకుండా బ్రతికిన పిల్లవే తల్లీ, మీరెందుకే ఎండలో తిరుగుతున్నారు. ఎండలో తిరుగుతూ ఈ పత్రిక అమ్మడమంటే ఏం దరిద్రమొచ్చిందే. మీ నాన్నగారు చాలా భాగ్యవంతులు, మీ అత్తగారు భాగ్యవంతులు. మీకు రూపాయి, అర్థరూపాయి ఎందుకంటూ సానుభూతి తెలిపేవారు కొందరు దగ్గరి బంధువులు. అదంతా మీకనవసరం, అంతగా అంటున్నారు కాబట్టి ఒక రూపాయి కాదు, పది రూపాయలవి వేసుకోండి అనేవాళ్ళం మేము. పదిరూపాయలంటే నవ్వుకుంటూ ‘ఒప్పుకోం’ అనేవారు. మీరు పుట్టినప్పుడు పార్టీ తెలీదు, ఇప్పుడు చూడు ఎంత విస్తరించిందో, మీరు కూడా ఎప్పటికైనా కమ్యూనిస్టులైపోవలసిందే అనంటే నవ్వేవాళ్ళు. కొందరు కొంటెతనంగా మా దగ్గరలేని పత్రికలను అడిగేవారు. అప్పుడు జస్ట్‌ వెయిట్‌ అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర్నుంచి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. మీ దుంపల్దెగ మీరు లేరనుకున్నామమ్మా, మాకెందుకీ పత్రికలు అనేవాళ్ళు. వాటిలో ఏముందో చదవండి, తీసుకోండి అని ఇచ్చేవాళ్ళం.

అట్లా ఇరవై రోజులకో, నెల రోజులకో ఎంత అమ్మాము, తప్పు చేశామా అని విమర్శ, ఆత్మ విమర్శ చేసుకునేవాళ్ళం. ఈ విమర్శ, ఆత్మవిమర్శ పార్టీకి గుండెకాయ లాంటిది అప్పుడు. మరి ఇప్పుడెలా ఉందో నాకు తెలియదనుకోండి. మా రాజేశ్వరరావుగారు తప్పు చేసినా కూడా మేం ధైర్యంగా వెళ్ళి అడిగేవాళ్ళం. ఇవన్నీ పెట్టీ బూర్జువా లక్షణాలని అనేవాళ్ళం. అర్థం తెలియకపోయినా తిట్టుగా అనుకునేవాళ్ళం. అప్పుడు మామూలుగా స్త్రీలు తిట్టుకునే తిట్లు మర్చిపోయాం. పార్టీ పుణ్యంతో కాస్త సంస్కారం ఏర్పడింది. అప్పుడు ఈ కులాల్లో తిట్లుండేవి కదా! చాకలి సచ్చినోడ, మంగలి సచ్చినోడ, మాదిగ సచ్చినోడ అని ఉండేవి. వాట్ని నోటిమీద కొట్టినట్లుగా చెప్పి ఆ తిట్లన్నీ మాన్పించేశామన్నమాట. కొత్త తిట్టు ‘పెట్టీ బూర్జువా’ అన్నమాట.

తర్వాత కొంతకాలానికి పార్టీ పిలుపునిచ్చింది. కనుచూపు మేరలో సోషలిజం ఉందని, అంచేత అందరూ ఆస్తులన్నీ అమ్మేసి పార్టీకి పనిచేయండి అని. ఎన్ని పత్రికలున్నాయి! అవన్నీ నడవాలన్నా, పార్టీ నడవాలన్నా ఈ ఆస్తులు శాశ్వతం కాదు కదా! అందరికీ సమానమైన ఆస్తులు, హక్కులు, ఆర్థిక ప్రతిపత్తి అన్నీ వచ్చేస్తాయనే భావనతో తల్లిదండ్రుల ఆస్తి వాళ్ళకు ఉంచేసి, మిగిలినవి అమ్మి వచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. చాలావరకు ముందు నాయకులు అమ్మేస్తే కొంతమంది కుర్రాళ్ళు ఆ ఉత్సాహాన్ని తట్టుకోలేక మేం కూడా ఇది చేస్తాం, అది చేస్తాం అనేవాళ్ళు. చందాలు ఇవ్వగలిగితే ఇవ్వండి, ఈ ఉద్యమంలో శారీరకంగా పనిచేయండి, ఈ తాత్కాలికోద్రేకంతో చేయకండని తిప్పి ఇచ్చేయటం, మార్క్సిస్ట్‌ ఔట్‌లుక్‌ మీ బుర్రకు వంటబట్టాక ఇద్దురు కానీ అంటే… ఏం వీళ్ళేనా త్యాగమూర్తులు, మేం కాదా, మాదంతా తిప్పి ఇచ్చేస్తారా అని వాళ్ళకు కోపం రావడం… వాళ్ళ పేరెంట్స్‌ మాత్రం పిల్లలు తొందరపడ్డా కానీ, వాళ్ళు మంచిగానే ఆలోచిస్తారని అర్థం చేసుకుని గుర్తించారు.

నాకు నాలుగు సంవత్సరాలప్పుడు పెళ్ళిచేశారు. శారదా యాక్ట్‌ వస్తుందని భయపడి నాలుగు, అయిదు సంవత్సరాలకే పెళ్ళి చేశారు. నా అయిదో, ఆరో ఏటనే మా మామయ్య చనిపోయారు. నాకు చనిపోయింది కూడా తెలియదు, పెళ్ళయిందీ తెలియదు. అప్పట్నుంచి మా అమ్మ నాకు మళ్ళీ పెళ్ళి చేయాలని తాపత్రయపడుతూ వచ్చింది. ఈ కమ్యూనిస్టు కుర్రాళ్ళకివ్వాలనే ధ్యేయంతోనే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ ఊళ్ళో ఒత్తిడి… అక్కడ సీతారామయ్యగారి ఊళ్ళోకూడా ఒత్తిడి… బైటి వాళ్ళను చేసుకుంటే ఆస్తంతా బైటకు పోతుంది. మేనత్త కూతుళ్ళను చేసుకోలేదనే కోపంతో ఆయన్ని ఒక బండిలో ఘోషా స్త్రీలాగా తీసుకొచ్చారు. మా ఊర్లో ఘోషా స్త్రీలకి బండికి అటూ ఇటూ తెరలు కట్టి తీసుకొస్తారు. కర్రలు పట్టుకుని వచ్చి ఆగం చేస్తారు. ఇలా గొడవైపోతుందనే ఉద్దేశంతో ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతంలో, గ్రామంలో ఉంచి ఉద్యమ నాయకుని ఇంట్లో పెళ్ళిచేసేవారు. అలా మా ఇంట్లో ఎన్నో పెళ్ళిళ్ళు జరిగేవి. కన్నవారు, అత్తవారు అంతా మేమే. బాగానే రియాక్షన్‌ వచ్చేది. తర్వాత్తర్వాత కల్సిపోయేవారు.

అప్పుడు నాకు పదిహేడు, పద్దెనిమిదేళ్ళుండవచ్చు. నన్ను విడో అని తెలియకుండానే పెంచారు. పెద్దయ్యాక తెల్సింది అమ్మేడుస్తుంటే. తర్వాత కర్మ సిద్ధాంతం మీద నమ్మకం కదా… నాకు పెళ్ళిచేస్తే అతను చచ్చిపోయాడు, నాకు పెళ్ళివద్దు అనేదాన్ని తెలీక. కానీ, ఈ పార్టీ కుర్రాళ్ళంతా కాదు కాదు అనటం, వితంతు వివాహం చేసుకుని పిల్లల్ని కన్నవాళ్ళను చూపించడం, కుటుంబాల్ని చూపించడం చేసేవారు. అప్పుడు నేను పాటలు బాగా పాడేదాన్ని. చక్కటి గొంతు, చొరవా, ధైర్యం ఉన్నాయి ఈ అమ్మాయిలో, ఈ అమ్మాయి జీవితం రాణించాలంటే మంచి కుర్రాణ్ణి చూడాలని అంటూ వెతికారు. మా మ్యారేజి అయిపోగానే పార్టీలోకి వెళ్ళాను. పార్టీ అంటే మార్క్సిస్టు ఔట్‌లుక్‌ లేకపోయినా వెళ్ళాను. విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్న మా మామయ్య ఇన్‌ఫ్లుయెన్స్‌ బాగా ఉండేది.

పెళ్ళిళ్ళు చేసుకుని విడిపోయేవారికి ఆనాడు ఎలాంటి సౌకర్యాలుండేవంటే… ఇప్పుడు కన్నవారు వచ్చి పురుడు పోసేవారు కదా, అలా పురుళ్ళ కోసం డాక్టర్‌ అచ్చమాంబగారి ఇల్లు ఉండేది. దాన్ని కన్నవారిల్లులానే వాడుకునేవాళ్ళం. మీకెందుకు! పురుళ్ళొస్తే మీ అమ్మ లేకపోతే నేను లేనా అనేవారు. ఆమె పురుళ్ళు పోసి, మందులిచ్చి అన్ని రకాలుగా చూసేవారు. ఇక్కడే కమ్యూనుండేది భోజనాలు పెట్టడానికి. మేం ఏ అర్థరాత్రి వచ్చినా వంట చేసుకోవలసి ఉండేది కాదు. ఒక్కోసారి ఫ్యామిలీతో ఇబ్బంది వచ్చి వంటా గింటా చేయడానికి బాధయితే మ్యూనుంది తినొచ్చని వచ్చేవాళ్ళం. బాచిలర్స్‌, గ్రామాల్లో కార్యక్రమాలుండి ఇక్కడే కొన్నాళ్ళుండాలని వచ్చిన వాళ్ళు ఉండిపోయేవారు. మీటింగ్స్‌కి వచ్చి కొందరు రెండు, మూడురోజులుండేవారు. కొందరు హోటళ్ళలో తినేవారు, మరి కొందరు కమ్యూన్‌లో ఉండేవారు. ఎప్పుడూ ఎంతో కొంతమంది ఉండేవారు. బుల్లెమాంబ ఆర్గనైజ్‌ చేసేవారు. మేమంతా గోర్కీ నవల ‘అమ్మ’ చదివి ఆ అమ్మ ఈ బుల్లెమ్మ అనుకునేవాళ్ళం.

మా ఆస్తులన్నీ అమ్మినపుడు పిల్లలకీ, భర్తకీ, భార్యకీ, తల్లిదండ్రులకీ అని భాగాలు చేసి ఎవరి భాగం వాళ్ళకిచ్చేవాళ్ళం. మా భాగాన్నీ అమ్మి పార్టీకి ఇచ్చేశాం. ఆస్తి దమ్మిడీ లేకుండా మొత్తం ఇచ్చేశాం. బుల్లెమాంబ కూడా తన భాగం అమ్మేసి తనూ ఇచ్చేసింది. మీరంతా నా ఆస్తి అనేది. కమ్యూన్‌లో ఎంతమందున్నా కానీ, ఎవరి రుచులేంటి, ఎవరు జబ్బు మనుషులు, ఎవరికెలా పెట్టాలి అనేవన్నీ ఆమెకే తెలుసు. ఆమె కమ్యూన్‌లోనే ఉండేవారు. మేం ఆలస్యంగా వచ్చినప్పుడు ఆమెని బాధ పెట్టడం ఎందుకని వస్తూ వస్తూ అరటిపళ్ళు తెచ్చుకుంటే, నాకు తెల్సే మీరు అన్నం తినరు, రాత్రి తినకుండా పడుకుంటే పొద్దున్నే నీరసపడిపోతారే అంటూ అంత పెరుగన్నం తినండి, అంత చద్దన్నం తినండి అని తల్లికంటే ఎక్కువగా ఆదరించేది. మర్నాడు పొద్దున్నే లేచి మేం ఆకలేస్తోందంటే నాకు తెలుసే మీరు రాత్రి

ఉంటుందో లేదో అని తిని వచ్చామని అబద్దం చెప్తారని అనేది. అలా ఎవరు చూస్తారు?

రాజకీయ క్లాసులు పెట్టేవాళ్ళు. భారత మహిళా మండలి క్లబ్బులో ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు. కానీ ఆ రాజకీయ క్లాసుల్ని వాళ్ళు ఎంతవరకు జీర్ణింప చేసుకున్నారు అనేది కాకుండా చకచకా రాజకీయాలు చెప్తూ వెళ్ళిపోయారేమో, మాకు అంతగా జీర్ణÛం కాలేదేమో అని ఇప్పుడు అనుకుంటున్నాను. అన్నప్రాశం నాడు ఆవకాయ పెట్టినట్టవుతుందేమో అన్పించింది. అదెలా అంటే జపాన్‌ ఫైట్‌ వాళ్ళనెలా ఎదుర్కోవాలో చెప్పి రష్యాలో సోషలిజమొచ్చింది, ఆ సోషలిజం ఏ బేసిస్‌ మీద వచ్చింది, అది దేశవ్యాప్తంగా ఎలా వచ్చింది, వాళ్ళెలా అర్థం చేసుకుని ఆ పోరాటంలో పాల్గొన్నారనేది మాకు కిందికి వెళ్ళి చెప్పలేదేమో అని నా అనుమానం. ఇప్పుడు బాధపడుతున్నాను. ఎందుకంటే, అప్పుడు మూడడుగులు ముందుకేసి ఇన్ని కార్యక్రమాలు చేసినా కొన్ని కమ్యూనిస్టు పార్టీ ఫామిలీస్‌లో ఇప్పటికీ దేవుడంటే నమ్మకాలున్నాయి. వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళల్లో పిల్లల్ని భర్త కులం వారి వైపు భర్త ఇవ్వాలనీ, భార్య కులం వారివైపు భార్య ఇవ్వాలని పోటీ వచ్చింది. ఇప్పుడు గతి తార్కిక భౌతిక వాదాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు జీర్ణింపచేసుకుంటే ఇలా పూజలు చెయ్యరు కదా! అది కమ్యూనిస్టు పార్టీ ఎంతవరకు నేర్పింది? అది నేర్చుకోని వాళ్ళ బలహీనత చాలావరకు కార్యకర్తల్లోకి వచ్చేసింది కదా ఈ మార్పు.

మరి కార్యకర్తల్లో రావడానికి కారణం? అంటే వీళ్ళు ఒక ఉత్సాహంతో, ఉద్రేకంతో వచ్చి పనిచేశారు. ఆ ‘యాక్టివిటీస్‌’ పార్టీలో తగ్గిపోయేసరికి మళ్ళీ వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయారు. అవి ఎందుకు తగ్గాయనేది ‘ఫీల్డ్‌’లో ఉన్నవాళ్ళకి తెలుసనుకోండి. నేను పార్టీకి దూరమై బ్రతుకు తెరువు కోసం ఎక్కడో దూరం వెళ్ళిపోయాను. తర్వాత చరిత్ర మీక్కొంత తెలిసే ఉంటుంది. నేనిప్పుడు అవగాహన చేసుకునేదేంటంటే ఇది ప్రకృతి సహజమైంది. ఈ అపారమైన శక్తంతా ప్రకృతిలో ఉంది. మానవుడు సైన్సు ద్వారా ముందుకు తీసుకొస్తున్నాడు. సైన్స్‌ డెవలప్‌ అయ్యేటప్పటికీ, ఇవన్నీ కూడా డెవలప్‌ అవుతున్నాయనేది ఎంతవరకు చెప్పగలిగారు? అంతేకాకుండా ఏవేవో రాజకీయాలు చెప్పేవారు. ఈ రాజకీయాలు ‘ఇనుప గుగ్గిళ్ళ’లాగా మింగుడుపడేవి కావు. ఈ సిద్ధాంతం దేనిమీద బేస్‌ అయింది, దేనిమీద నిలబడింది, పునాదుల్నుంచి తీసుకొచ్చి వీళ్ళ బుర్రలో ఎక్కించినట్లయితే, ఇంకా చాలామంది స్త్రీ, పురుష కార్యకర్తలు గట్టిగా నిలబడే అవకాశం ఉండేది. కనీసం గట్టిగా నిలబడి ఉద్యమంతో టచ్‌ పెట్టుకోవటానికుండేది. చిన్న చిన్న అభిప్రాయభేదాలొచ్చి, అంతర్జాతీయంగా తగాదాలొచ్చి, విడిపోతే విడిపోవచ్చు. కానీ అసలీ మూఢనమ్మకాలు, ఆచారాలు వీటిపై ఇంత ప్రచారం చేశాం, ఇంత పని చేశాం. మరి ఎందుకు వీళ్ళకు నిరుత్సాహం? ఈ నిరుత్సాహంతో దేవుడివైపు మొగ్గారా లేక వీళ్ళకీ సిద్ధాంతం ఒంటబట్టలేదా అని నేను ఫీలవుతున్నాను ఈ ఫ్యామిలీస్‌ని చూస్తూ.

మా రాజేశ్వరరావు గారు, సుందరయ్యగారు చెప్పారు కాబట్టి, మా ఆయన పోట్లాడి బైటికి

తీసుకెళ్తున్నాడనే దాంతోటి వెళ్తున్నాం, అలాగే వెళ్ళాం కూడా. మొట్టమొదట భర్త అడుగుజాడల్లోనే ఉద్యమంలోకి వచ్చాం. సిద్ధాంతపరమైన లెనినిజం, మార్క్సిజం ఎంతవరకు తెలుసనేది కాదు, నాకు తెలిసినంతవరకు ముందు నాయకుల భార్యల్ని రమ్మనక వేరే వాళ్ళనెందుకు రమ్మంటారు అని

అడిగేవాళ్ళు. ముందు మీ భార్యల్ని రమ్మనండి తర్వాత మేం వస్తామని అనేవారు. స్త్రీలతో ఊరేగింపులు, గీరేగింపులు జరిపినపుడు వాళ్ళ భార్యలేమో చక్కగా మడికట్టుకుని కూర్చోవాలా, మేమేమో ఇలా రావాలా అన్న దాంతో ఫోర్స్‌ చేసి తీసుకొచ్చారు. ఊరేగింపులో, దీంట్లో నేనూ వచ్చాననుకోండి. నాపక్కనే మా అక్క, చెల్లి అంతా వస్తుంటే, పెద్ద ఊరేగింపు జరుపుతుంటే పెద్ద పండుగ. తర్వాత మా అంతట మేమే ఆసక్తిగా ఊరేగింపుల్లో వస్తామంటే ఈ రోజు కాదు, కామ్రేడ్స్‌ వస్తారు, మీరంతా వంట చేసేయండి, ఊరేగింపుకి రాకపోయినా ఫర్వాలేదులే, ఇంకా చాలామంది వస్తున్నారు, వాళ్ళందరికీ వంటా, గింటా చేయాలి కదా అనేవారు. దాంతో మేం ఎందుకు చేయాలి, మేం కూడా రావాలిగా, ముందేమో ఫోర్స్‌ చేసి తీసుకొచ్చారు, ఈ రోజున మేం రావాలంటే అడ్డుగా కనపడ్తున్నామా! వెళ్ళండి, హోటల్‌కి వెళ్ళండి, తినండి అనేవాళ్ళం. దాంతో మాకు దగ్గరగా ఉండేవాళ్ళు, అదికాదు కోటేశ్వరమ్మా అన్నం వండి పడేసెయ్‌, ఆవకాయ ఉందిగా, ఒక్కచారు పెట్టు అన్నీ వద్దులే అని చెప్పేవారు. పదిమందని చెప్పి, పదిహేను మంది వచ్చేవారు. ఇప్పుడు మళ్ళీ కోటేశ్వరమ్మతో వంట చేయించడం న్యాయం కాదని వస్తూ వస్తూ పళ్ళు తెచ్చేవారు. అన్నీ కలిపి అందరం తినేవాళ్ళం.

మేం పార్టీలో ఉన్నవాళ్ళం అక్క చెల్లెళ్ళం, అన్నదమ్ములం. పక్కింట్లో ఉన్నామె ఎవరో తెలియదు కానీ ఆమె మరిదిగారు, నేను పార్టీలో పనిచేసేవాళ్ళం. అక్కాచెల్లెల్లాగా ఉండేవాళ్ళం. ఆమెకు బాబు పుట్టాడు. నాకు పాప పుట్టింది. నేను మహిళా సంఘం కల్చరల్‌ యాక్టివిటీస్‌కు వెళ్తుంటే వచ్చేలోపల పాప ఏడుస్తుంటే తాను పాలిచ్చేది. వచ్చాక నేను వాడికి పాలిచ్చేదాన్ని. నేను పులుసు చేస్తే మా చెల్లి వేపుడు చేసేది. ఆమె ఇడ్లీ చేస్తే నేను ఇంకోటి చేసేదాన్ని. మధ్య డోర్‌ తీసేవాళ్ళం. వాళ్ళు మేం బంధువులం కాదు. అట్లా కలిసి ఉన్నాం. మేం తగాదాలనేది ఎరగం. ఈ పార్టీ చుట్టరికమే చుట్టరికమనుకున్నాం, మా చుట్టాల్ని మర్చిపోయాం.

అప్పుడు విజయవాడలో ఆత్మరక్షణ పాఠశాల ఉండేది, జపాన్‌ పైకొస్తే ఏం చేయాలనే దానికోసం. కాకీ నిక్కర్లు వేసుకోవడానికి కొంత ఇబ్బందే ఉండేది. రౌడీల్ని అణిచిపెట్టేశారు. అయినా మొదట్లో భయమే ఉండేది. కొందరు సైకిళ్ళు నేర్చుకునేవారు. ఇవి నేర్చుకోవడానికి నచ్చచెప్పాల్సి వచ్చేది. పెరేడ్స్‌ చేస్తున్నప్పుడు కన్వీనియన్స్‌ కోసం నిక్కర్లు వేసుకునేవాళ్ళం. కానీ బైటున్నప్పుడు చీరలే కట్టుకునేవాళ్ళం. బూర్జువా లక్షణాల్లో పడి పట్టు చీరలు, నగలు పెట్టుకోవద్దని కూడా చూసేవారు. అలా అన్ని యాంగిల్స్‌లో చూసేవారులెండి. రాజేశ్వరరావు గారి భార్య చంద్రహారం పెట్టుకుంది, గజ్జెల వడ్డాణం పెట్టుకుంది. ఆమె పెట్టుకోగా లేనిది మేమెందుకు పెట్టుకోకూడదు అని తతిమ్మా వాళ్ళంటారు కదా! ముందు అన్ని బెడదలూ, కార్యకర్తల భార్యలకే వచ్చేవి. స్టేజి ఎక్కి పాట పాడాలంటే ఆమె పాట పాడాలి, నాటకంలో యాక్ట్‌ చేయాలంటే ఆమె చేయాలి, నగలన్నీ ముందు తీయాలంటే ఆమె తీయాలి అని అనుకునేవారు. కార్యకర్తల భార్యలే మహిళా

ఉద్యమానికి నిర్మాతలు. అన్నపూర్ణమ్మ, హనుమాయమ్మ… వీళ్ళంతా చేశారు.

ప్రజా నాట్యమండలి తర్వాత ఇక నిషేధం దగ్గరికి వెళ్ళిపోతాం. గాంధీగారి సిద్ధాంతం ప్రకారంగా స్వరాజ్యం వచ్చిందన్నారు. స్వరాజ్యం వచ్చిన తర్వాత ఇది స్వరాజ్యం కాదని కమ్యూనిస్టులు చెప్పారు. దానికోసం పోరాడుతూ ఎప్పటికీ సోషలిజమే సరైనది, ఇది స్వరాజ్యం కాదు, స్వరాజ్యం కావాలంటే సోషలిజమే శరణ్యమని కమ్యూనిస్టులు చెప్పిన తర్వాత అనేక యాంగిల్స్‌లో ఉద్యమాలు తీసుకొస్తుండగా ప్రజాశక్తి మీద నిషేధం వచ్చింది.

కార్యకర్తలందరినీ జైళ్ళలో పెట్టడం, కామ్రేడ్స్‌ అంతా రహస్యంగా వెళ్ళిపోవడం, అక్కడ తెలంగాణా ఉద్యమం స్టార్ట్‌ అవటం, దాని పక్కనే ఆంధ్ర ఉద్యమం కూడా… అంతటా కాదనుకోండి. అన్ని రాష్ట్రాల్లో వచ్చింది కదా! ”ఇదే కంటికి కన్ను పంటికి పన్ను” అనే నినాదం. మన ప్రభుత్వం మన కన్ను పొడిస్తే, మనం ప్రభుత్వ గూండాల్నీ, రౌడీల్నీ, అటు తరుపు తొత్తులందర్నీ పంటికి పన్ను, కంటికి కన్ను… ఈ తుపాకీ గొట్టంలో నుంచే సోషలిజం వస్తుందని, వాళ్ళేం చేస్తే మనం కూడా అది చేయొచ్చు అంటే హింసకి ప్రతి హింస అనేది ఆనాటి నినాదం. దాంతో ప్రభుత్వం పత్రికను నిషేధించటం, కామ్రేడ్స్‌నందరినీ అరెస్టు చేయడం, బుర్రకథల్ని, నాటకాలను నిషేధించడంతో దాన్ని ధిక్కరించి అప్పుడు స్త్రీలందరం రంగంలోకి దిగాం. ఆ 144 సెక్షన్‌ని ధిక్కరించి మహిళా కార్యకర్తలు ముందుండి, మహిళా సానుభూతిపరులందర్నీ ముందు పెట్టుకుని ఒక వెయ్యిమందితో విజయవాడలో కలెక్టరాఫీసు ముందు ఊరేగింపుగా వెళ్ళాం. ఎక్కడివాళ్ళనక్కడ టియర్‌గ్యాస్‌ ప్రయోగించడం, లాఠీలతో కొట్టడంతో పాటు కొన్ని వ్యాన్‌లు తీసుకొచ్చి ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్ళారు. నందిగామ జైల్లో పెట్టారు. అప్పుడు కూడా మాకేమీ భయం వేసేది కాదు. జైళ్ళకి వెళ్ళగానే ఆ టియర్‌ గ్యాస్‌వల్ల ఒళ్ళంతా మంటలు పుట్టింది. గాలి, వెలుతురు లేని గదిలో పడేసేసరికి భయం కలిగింది, ఎప్పుడూ చూడలేదు కదా!

ఒక్కొక్కరినీ తీసుకొచ్చి పడేస్తుంటే నలుగురితో చావు కూడా పెళ్ళిలాగే అన్పించి మనవాళ్ళందరూ వచ్చేశారు, ఇంకేం భయమనుకొని, మేమే అల్లరి చేసి, పోలీసుల్ని గేలి చేయడం, ప్రభుత్వాన్ని గేలి చేయడంతో తల్లీ వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు, విసిగించేస్తున్నారని అనేవారు. అలా చేసిన తర్వాత అందర్నీ వదిలేసి మాలో పదహారు మంది మీద కేసు నమోదు చేశారు. నందిగామ, జగ్గంపేట… ఎక్కడెక్కడో పదిహేను, ఇరవై రోజులపాటు వాయిదా వేసి తిప్పడం మొదలుపెట్టారు. అప్పుడు మేం ‘డాక్యుమెంట్స్‌’ మీద సంతకాలు పెట్టలేదు. ఈ రోజు వాయిదా వేశారు కాబట్టి మేము సంతకాలు పెట్టలేదు, ఈ రోజు వాయిదా వేశారు కాబట్టి సంతకాలు పెట్టం అంటూ, ఈ కేసు విచారణ చేస్తారా, లేదా? లేకపోతే మమ్మల్ని ఇక్కడే కూర్చోమంటారా, మేం మట్టుకు వెళ్ళేది లేదు, సంతకాలు పెట్టేది లేదు అంటూ మేం తిరగబడ్డాం. దాంతో మళ్ళీ జైల్లో పడేశారు. తర్వాత కేసు విచారణ చేస్తామని హామీ ఇచ్చి వదిలేశారు. మళ్ళీ, జైల్లో కూడా పోరాటం చేశామన్నమాట. కొంతమంది స్త్రీలనేమో రాయవెల్లూరు జైలుకి పంపించేశారు. పసిపిల్లల తల్లులు కూడా వచ్చారు అప్పుడు జైలుకి. ఈ అనసూయమ్మకు పదిహేను రోజుల కొడుకు. ఆమె కూడా వచ్చేసింది. పట్టుకుని వ్యాన్‌లో ఎక్కించలేక, పౌరుషం ఉంటే వ్యాన్‌లోకి ఎక్కండి మీరు, సినిమా బొమ్మల్లాగా గంతులేయడానకి వచ్చారా? ఉద్యమం చేయడానికి వచ్చారా? అని ఏదో అన్నారు. అందరికీ కోపమొచ్చి గబగబా వ్యానెక్కేశారు. పట్టుకొని ఎక్కించడానికి చేతకాక అలా ప్రొవొకేట్‌ చేశారన్నమాట. ఇక అక్కడ కూడా పసిపిల్లల తల్లుల్ని బైటికి రండని, పిల్లల్ని అడ్డం పెట్టుకుని మాకు పోలీసులని చూపించడం, మాకనవసరమని పంపించేయడం, అక్కడ కూడా జైల్‌ డిసిప్లిన్‌ ఉండాలి, కమ్యూనిస్టులు ఎక్కడికి వచ్చినా వాళ్ళు చక్కగా, ఆదర్శంగా ఉంటారన్పించాలి, మీరు పిచ్చి గంతులు వేయొద్దు అని ఆఖరికి వాళ్ళే అన్నారు. అప్పుడు మేము సర్దుకోవడం, ముఖాలు కడుక్కోవడానికి బైటికి వచ్చినపుడు నందిగామ జైలు చుట్టూ నిండిపోయారు. నందిగామ జైలు చుట్టూ పెద్ద పెద్ద నినాదాలు చేసేవారు, పాటలు పాడేవారు.

మేం నిరాహారదీక్ష ఎందుకు చేశామంటే… ఆగస్టు పదిహేను వచ్చింది. లడ్డూలు చేశారు. ఇవాళ ఆగస్టు పదిహేను అందుకే ఇవన్నీ చేయించాం అన్నారు. కానీ ఈ ఆగస్టు పదిహేనును మేం గుర్తించం, ఇది స్వరాజ్యం వచ్చినట్లు లెక్క కాదు, కాబట్టి ఈ రోజు మేం అన్నం తినం అన్నాం మేము. నిరాహార దీక్ష చేస్తే కొడతామన్నారు. కొట్టినా మంచిదే కానీ జెండా వందనం చేయం, ఈ జెండా మా జెండా కాదు అన్నాం. తినకుండా కూర్చుంటే బతిమాలారు, తంతామన్నారు, ఏవేవో చేశారు. కేసు విచారణ అవగానే బైటికి వచ్చేశాం. శిక్ష అనుభవించలేదు, జరిమానా విధించలేదు, తీసుకెళ్ళిపోయారు.

ఇక్కడుంటే మమ్మల్ని బతకనీయరు ఒకటి, తర్వాత స్త్రీలు కూడా అవసరం కదా! మరి స్త్రీలు లేకపోతే ఎలా? ఒక డెన్‌

ఉందనుకోండి, అందులో నలుగురు మగవాళ్ళు ఉంటే అనుమానం కదా! కానీ ఫ్యామిలీతో ఉంటే అనుమానం ఉండదు కదా! పిల్లా పాపలతో ఉంటే అనుమానం ఉండదు కదా అనే ఉద్దేశంతో తీసుకెళ్ళారు.

అసలు స్త్రీలు లేని చరిత్ర లేదమ్మా! గతం నుంచి ఇప్పటివరకు చూసుకోండి. స్త్రీలు లేని చరిత్ర లేదు. స్త్రీలు సగభాగం కాదు, జనాభాలో ఎక్కువ భాగం స్త్రీలే కదా! ఉద్యమం ప్రబలడానికి కారణం స్త్రీలే. స్త్రీల పాత్ర చాలా ఉంటుంది కానీ, వారి పాత్ర అణగారిపోతూ, పురుషుల పాత్రే పైకి వెళ్తూ ఉంది.దానికి కారణం తరతరాల నుంచీ ఉన్న స్త్రీ వ్యతిరేకతే. మరి స్త్రీల పాత్ర బైటికి రాలేదు. కానీ వాళ్ళు కమ్యూనిస్టు పార్టీకి చాలా ఉపయోగపడతారు. మేం కామ్రేడ్స్‌ని తీసుకెళ్ళి దాచిన రోజులున్నాయి. పురుషులనైతే పట్టుకుంటారు, కానీ స్త్రీలనైతే పట్టుకోరని మేము ఏ స్టేషన్‌లో ఎక్కుతున్నామో, ఏ స్టేషన్‌లో దిగుతున్నామో ఎవరికీ తెలిసేది కాదు. ఆయుధాలను బెడ్స్‌ కింద దాచేసేవాళ్ళం. అలా రాష్ట్రమంతటా డిస్ట్రిబ్యూట్‌ అయ్యేవి. తిరగబడిన స్త్రీలలాగా వేషభాషలు మార్చేవాళ్ళం. అవన్నీ టెక్నిక్స్‌. మాకు ‘షెల్టర్‌’ ఇచ్చారు. ఎంతోమంది తంతారనీ తెలుసు, కొడతారనీ తెలుసు. మానవతాదృష్టితో కానీ, పార్టీ భక్తితో కానీ.. అయ్యో రెండు రోజుల్నుంచి అన్నం లేదని చెప్పి అవతల మలబారు పోలీసులున్నా సరే మాకు ‘షెల్టర్‌’ ఇచ్చారు, అన్నం పెట్టారు. మరి స్త్రీలు ఆ రక్షణ ఇవ్వకపోతే మేమెలా బ్రతికేవాళ్ళం? స్త్రీలు అంతలా చూశారు, చేశారు. ఇక వీళ్ళకు అన్నం వండి పెట్టడంతో పాటు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకు రావాలన్నా స్త్రీలే తీసుకురావాలి, నగలు మార్చాలన్నా స్త్రీలే మార్చాలి. ఒక కార్యకర్త మాత్రమే కాకుండా ఫ్యామిలీ, బిడ్డలతో సహా ప్రయాణం చేయవలసి వచ్చేది.

మరి నేను పార్టీలోకి ఎంతో బంగారంతో వచ్చాను. నా మంగళసూత్రం, మట్టెలతో సహా చిన్నమెత్తు బంగారం లేకుండా పార్టీకి ఉపయోగపడింది. ఇవన్నీ కూడా తర్వాత వచ్చిన చైతన్యంతో చేశాం. పురుషులు చెప్తే చేయలేదు. మా కామ్రేడ్స్‌ అందరూ నల్లుల్లా మాడిపోతున్నారు, చచ్చిపోతున్నారు, వాళ్ళే పోగా లేనిది ఇంక ఇవన్నీ మాకెందుకు అని నాకు నేనుగా ఇచ్చేశాను. కమ్యూనిస్టు పార్టీ అంతా జమీందార్లనీ, ఆస్తుల్ని దోచుకుంటుంటే మరి కోటేశ్వరమ్మ నగలు పార్టీకి ఎందుకిచ్చిందని అనుకునేవారు.

వండి పెట్టడమే కాదు, పత్రికలు బైటికి రాకూడదు. పార్టీకి సంబంధించిన పత్రిక వస్తే తంతారు. మామూలు వాళ్ళను, పార్టీ వాళ్ళను కూడా కాల్చేసిన రోజులున్నాయి కదా! అలాంటప్పుడు రహస్య పత్రికలన్నీ ఆడవాళ్ళు సైక్లోస్టయిల్‌ చేస్తుంటే, కార్బన్‌ పేపర్లు పెట్టి రాస్తుంటే రాష్ట్ర కమిటీ, ఆలిండియా కమ్యూనిస్టు పార్టీ ఏం చేస్తుంది? చరిత్రంతా మాకు తెలిసేది. అదొక టెక్నిక్‌. కాపీలు తీసేటప్పుడు మానవునిలో ఉన్న సహజమైన బలహీనతలు వీళ్ళల్లో ఉన్నట్లుగా మేము చూశాం. ఈడొచ్చిన స్త్రీని వీళ్ళు కోరడం, వాళ్ళు బుద్ధి చెప్పడంతో లెంపలేసుకోవడం, మీరు ఇక్కడుంటే పనికిరారు, అడవిలోకి వెళ్ళండి, పోరాట కార్యక్రమాలకి వెళ్ళమని పంపిచేయడం జరిగేది. ఇవన్నీ చెప్పకూడదనుకోండి, కానీ చెప్తున్నా! ఇంకా కూడా మనకు బుద్ధిలేదు అన్పించేది. సహాయం చేసిన తల్లికంటే ఎక్కువగా ఆదరించి, చంపుతారనే భయం కూడా లేకుండా వండి పెడుతుంటే వాళ్ళకేమొచ్చింది మాయరోగం అని తిట్టుకునేవాళ్ళం.

అలా జరుగుతున్నప్పుడు నేను, సావిత్రక్కయ్య రాజేశ్వరరావుగారితో ”మేము వాళ్ళ దగ్గరా, వీళ్ళ దగ్గరా ఉండం. చావో, బ్రతుకో మీ దగ్గరే పెట్టుకోండి. కామ్రేడ్స్‌ అంతా చస్తున్నారు, మేం కూడా చావడానికే వచ్చాం. ఏంటి ఇదంతా హిందూ సెంటిమెంట్స్‌ అనండి, లేదా ఇంకేమైనా అనండి కానీ ఎవరి భర్త దగ్గర వాళ్ళని ఆ డెన్స్‌లో పడేయండి. లేకపోతే అడవుల్లో తుపాకీలు పట్టుకుని సాయుధ పోరాటం చేస్తాం, అడవులకెళ్ళి ఉండగలం” అని చెప్పాం. దాంతో ఆయన ”ఈ తుపాకీ నువ్వేం పట్టుకుంటావమ్మా! నీ పనులు నువ్వు చెయ్యి. తుపాకులు పట్టుకునేవాళ్ళు చాలామంది వస్తున్నారు. ఇవి ఎవరు చేస్తారు? ఇది ఇంపార్టెంట్‌ మాకు. నువ్వెక్కడికి వెళ్తావమ్మా! నీ జోలికెవరూ రారులే. ఎవరో పాపం పల్లెటూరి అమ్మాయిలు వాళ్ళు. మీ జోలికి రారు. వాళ్ళది గుండా, చెరువా! అయినా మేం కట్టుదిట్టాలు చేస్తున్నామంటే, మీరెందుకు భయపడతారు. గాబరా పడకండి” అన్నారు. వాళ్ళకు ఇవన్నీ ఎలా తెలిసినయయ్యా అనేవాళ్ళు కొన్నిసార్లు. ఎవరన్నా అరెస్టయినా మాకే ముందుగా తెలిసేది. ఎవరన్నా అరెస్టయితే వెంటనే టెక్నిక్‌ మార్చేవాళ్ళం. ఒక్కోసారి మనలోని బలహీనతతో చెప్పేవారు. కొడితేనో, తంతేనో చెప్పేస్తే కామ్రేడ్లంతా బయటపడిపోతారు. అలా ఒకసారి పొద్దూరి సోమయ్య చెప్తే పద్దెనిమిది మందిని కాల్చేశారు. అప్పుడే అనసూయమ్మ భర్త కూడా ద్రోణాచలం దగ్గర కాల్చబడ్డారు. ఎవరన్నా అరెస్టయ్యేసరికి మాతో ఉన్న డెన్సన్నింటినీ, కామ్రేడ్స్‌ అందర్నీ కూడా ఒక దగ్గర్నుంచీ మరో దగ్గరికి మార్చేవాళ్ళం.

కానీ మా దురదృష్టం. ఇంత చాకిరీ చేసినా మమ్మల్ని డెన్‌లోనే వదిలిపెడ్తారు. మా అదృష్టం బావుండి ఆ డెన్‌ ఎక్స్‌పోజ్‌ కాకుంటే అయిదు రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్తారు, లేకుంటే లేదు. డెన్‌కి తాళం వేయడానికి మాత్రం వీల్లేదు. సి.ఐ.డి. ఎంక్వయిరీ చేస్తారు కదా. అయితే మనవాళ్ళు వచ్చేవరకు మాకు నరకం అనిపించేది. మర్నాడు ఏ పది గంటలకో కొరియర్‌ ఎవరో సిగ్నల్స్‌ ఇచ్చి వెళ్తారు. ఏ క్షణంలో పోలీసులు వస్తారో అనే భయంతో స్నానాలు కూడా చేయకుండా ఉండేవాళ్ళం. వచ్చి ఏ పిచ్చి పని చేస్తారో అనే భయం ఉండేది.

మేం కాపీలు తీస్తాం కాబట్టి మాకు కొన్ని విషయాలు అర్థమయ్యేవి. స్టాలిన్‌ ముద్ర పడింది. కొందరు ఆలిండియా కార్యకర్తలు రష్యా వెళ్ళారని, స్టాలిన్‌ను కలిశారని. తర్వాత ”ఇది పోరాట కాలం కాదు, పోరాటానికి పరిపక్వత లేదు. పారిశ్రామిక కూలీలు, వ్యవసాయ కూలీలు, పీడితులు ఉద్యమంలోకి రావాలి. మధ్య తరగతి మేధావులే లీడర్లయ్యారు. చైనా వెనుకబడ్డ దేశమైనా, రష్యా సహకారం ఉండబట్టి రివల్యూషన్‌ వచ్చింది. అది భారతదేశానికి లేదు. ప్రస్తుతం మీరు విరమించుకోవాలి” అని పెద్ద తీర్మానం చేశారు. ఆ తీర్మానం వచ్చిన తర్వాత పోరాటం విరమించుకుని ఆయుధాలన్నీ ఇచ్చేశారు. ”అస్త్రసన్యాసం అప్పుడేనటనోయి, తుప్పు గడిచినాక గొప్ప చెప్తున్నావు” అని రాశాం నమ్మకం లేక. ఇంతమందిని చంపుకున్నాక పోలేంగా! ఇక ఒక్కొక్కళ్ళనీ బైటపెట్టారు. తుప్పుపట్టిన ఆయుధాలను బైటపెట్టినప్పుడు కొందరు హారతులిచ్చారు.

ఇంక బైటికి రావడంతోనే మార్క్సిస్టు భార్యల్ని, తల్లుల్ని గ్రామాలకు వెళ్ళి కలిశారు. కొంతమంది ‘మీరంతా చల్లగానే ఉన్నారు, మా పిల్లలేగా చనిపోయింది’ అన్నారు. మీరు రహస్యంగా ఉండి తిప్పలు బడ్డారు, మేం బయట ఉండి ఎన్నో తిప్పలు పడ్డాం అని చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. రేప్‌ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మధ్య తరగతి మనస్తత్వంతో చెప్పలేరు బైటికి. నార్ల చిరంజీవి భార్యనయితే క్యాంపులోకి తీసుకెళ్ళి మూడు రోజులకు వదిలిపెట్టారు. ఒళ్ళంతా గాయాలతో మొత్తుకుంటూ వచ్చింది. అలా వాళ్ళ అనుభవాలు, సంఘటనలు మాకు, మా అనుభవాలు, సంఘటనలు వాళ్ళకు చెబుతుంటే మాకంటే గ్రామాలవాళ్ళే ఎక్కువ కష్టపడ్డారేమో అనిపించింది. కుప్పలు తగులబెట్టి, ఆస్తులు తగులబెట్టేశారు.

కనుచూపు మేరలో స్వరాజ్యం ఉందనుకున్నాం. ఆస్తులన్నీ నాశనం చేసుకున్నాం. ఇప్పుడు వెళ్ళిపోవాలి, బిడ్డలు బతకాలి, ఏం చేయాలి? ఏదో బిజినెస్‌ చేసుకోమని, నర్స్‌ ట్రెయినింగ్‌, మిషన్‌ కుట్టుకుంటూ ఉద్యమాన్ని చూడండి. మాజీ కమ్యూనిస్టులు చేసినంత బాగా బిజినెస్‌ ఎవరూ చేయరు.

ఇక నా చరిత్ర ఇంకొక రూపంలోకి వెళ్ళిపోయిన తర్వాత, నేను బ్రతుకు తెరువు కోసం ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది. నేను ఫీల్డ్‌లో లేను కాబట్టి వాళ్ళందరూ నాకు మిత్రుల్లానే కనిపిస్తారు. పాతవాళ్ళతో కలిసి బ్రతికాను కాబట్టి పాత చరిత్ర ఉంది.

మనది తెలుగుదేశమమ్మా!

మనది తెలుగుదేశమమ్మా!

మనది తెలుగు జాతి తల్లీ!

వీరులను కన్నది తల్లీ!

వీరమాత జన్మభూమి! ||మ||

మన పాపారాయుడే తల్లీ!

మరువలేమతనిని తల్లీ!

బుద్దవరమున బుట్టి ఈ

భువికి వెలుగులనిచ్చి స్వేచ్ఛ

కావాలనే లక్ష్యమున్నా వాడు

సమతకై పోరాడ యువశక్తిని బిలిచి

సాహసముతో తానె సారధిగా నిలిచాడు

పర ప్రభుత్వపు బాట పైనించు పాలకులు

మలబారు పోలీసు మందలను రాబిలిచి

ముసునూరు ప్రాంతాన ముదురు చీకటిలోన

నిరాయుధునిగ నిలిపినారె!

నీవెవ్వరని యడిగినారె!

ఆయుధం బిచ్చి నన్నడుగురా యెవరని

అపుడదె తేల్చునన్నాడె హంతకులు

అడవి వీరుని గాల్చినారె!

ఆ వీరుని దలచుచు ఆశయము నిలుపుచు

కదలి ముందుకు నడువవమ్మా!

మనమతని చెల్లెండ్రమమ్మా! ||మ||

అతడె జగన్నాధరావు

ప్రజలకొరకె పుట్టినాడు.

లంకలు పుంతలు రాజులబ్బనిసొమ్మ

రైతు కూలీలపాన్నడె పోరాట

రంగమున ముందు నిలచాడె!

భువిని దివిజేయగ దీక్షబూనినవాని

పగబట్టి గాలించినారె యెచటనొ

అగుపడక బంధించినారె! పార్టీ

గుట్టు తెలుపని వాని ఫాసిస్టు పోలీసు

చిత్రహింసలు పెట్టినారె! గతితప్పి

చివరికంతము జేసినారె క్రూరులుగ

ఆంగిలేయుల మించినారె!

ఆ రైతు వీరుని పుత్రికల మేమంచు

ఆ త్యాగ నిరతిని గళమెత్తి పాడుచు

కదలి ముందుకు నడువవమ్మా!

విప్లవ జోహారులందించుమమ్మా! ||మ||

అసుమర్లపూడి నెరుగుదవా? ఓ

యమ్మ హాస్యరసమతని సొమ్మమ్మా!

ఆలికుల నాయకుండమ్మా

అవినీతి పాలనకు వ్యతిరేకిగ నిలిచి

పగవారి గుండెలో బల్లెమైనాడమ్మ

బానిసత్వము బాపనడుము గట్టిన వాని

చెరసాల బంధించినారె! చెప్పకనె

కడలూరకె అంపినారె!

నాలుగ్గోడల మధ్య న్యాయాన్ని విడనాడి

పోరుకొచ్చాడంటు నేరాన్ని మోపుచు

పిస్తోళ్ళతో కాల్చినారె యోధుని

ప్రాణాలనె తీసినారె!

ఆ అమర వీరుల ఆత్మ శాంతించగ

ఆ వీర యోధుల ఆశయము సిద్ధించ

కదలి ముందుకు నడువవమ్మా

స్వేచ్ఛకై యెర్రజెండానెత్తుమమ్మా! ||మ||

దిగులొందకె తల్లీ! పగబూనవె చెల్లీ!

మన జాతి కోసమై మన హక్కు కోసమై

ఒకరిద్దరె కాదు వందలొరిగిరి యిటుల

ఈ త్యాగఫలితాల జనరాజ్యముదయించు

అసుర రాజ్యము మాయుటది తథ్యమమ్మా!

యువశక్తిని లేపుమమ్మా!

వీరులకు వారసులమని చాటువమ్మా

మన విశాలాంధ్రలో రణరంగ ధీరులకు

కొదువలేదని తెలుపుమమ్మా!

కదలి ముందుకు సాగుమమ్మా!

పళని యిప్పునలాంటి ప్రజాకంఠకుల

ప్రజల కోర్టుకు లాగి వురికంభమెక్కించ

కదలి ముందుకు నడువవమ్మా

తెలుగన్న కీర్తి జగతిని చాటుమమ్మా!

(సారంగ వెబ్‌ మ్యాగజైన్‌ నుండి)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.