అమ్మకోసం -దాసరి సుబ్రహ్మణ్యేశ్వరరావు

ప్రపంచంలో ఎవరంటే ఇష్టం అంటే మొదటగా చెప్పేది అమ్మ పేరు మాత్రమే. ఎందుకంటే సర్వం అమ్మ ప్రేమ కనిపిస్తుంది. తండ్రి ప్రేమ కనిపించదా అంటే కనిపిస్తుంది కానీ అమ్మ ప్రేమలా బయటకు వ్యక్తమవ్వదు. ఇలాంటి ప్రేమలు రానున్న రోజుల్లో చూడడానికి కనుమరుగైపోతాయేమో? ఈ సృష్టిలో తల్లిదండ్రులను మించిన ప్రేమ మరొకటి ఉండదేమో! ఈ వ్యక్తి చాలా మంచివాడు చాలా వినయంగా నడుచుకుంటాడు అంటే వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ, పెంపకం అలాంటిదని సహజంగా ఎవరో ఒకరు అంటూనే

ఉంటారు. మా తల్లిదండ్రుల పెంపకంలో కూడా నేను అలాగే పెరిగాను. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు పక్కన చిన్న పల్లెటూరు. మాకు ఇరవై ఎకరాల పొలం ఉంది. ఈ ఇరవై ఎకరాల పొలాన్ని మా నాన్న (గోపాలరావు) గారు ఒక్కరే సాగు చేసేవారు. నేను చిన్నప్పుడు పొలంలో ఉన్న మా నాన్నగారికి అన్నం పట్టుకెళ్ళేవాడిని. మా నాన్నగారు పొలం పనులు చేస్తుంటే నేను కూడా చేయాలని పొలంలో దిగి పనిచేస్తుంటే నీకు ఎందుకు నాన్నా ఈ పొలం పనులు, చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకో అని ప్రతిరోజు చెబుతుండేవారు. నేను పదవ తరగతిలో ఉండగానే మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు నేను పొలం పని చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ మా అమ్మ (అన్నపూర్ణమ్మ) నాన్న పై చదువులు చదువుకుని మంచి ఉద్యోగం చేసుకోమని చెప్పారు కదా! చక్కగా చదువుకో నాన్నా అని బ్రతిమలాడి చెప్పింది. అప్పటినుంచి నాకు అమ్మ మాటలే మా ఊరిలో మంచి గౌరవాన్ని సంపాదించి పెట్టాయి. అంతేకాదు అందరికంటే ఎక్కువగా చదువుకున్నది నేనే. మా ఊరిలో చాలామంది పది పాసైన వారు ఉన్నారు కానీ ఎక్కువగా పొలం పనులకు వెళ్ళిపోతూ

ఉండేవారు. కానీ మా అమ్మ నా పై చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా చదివించింది.

నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండగా నాకు పెళ్ళి సంబంధాలు చూడమని పక్క ఊర్లో ఉన్న దూరపు బంధువులకు చెప్పింది అమ్మ. అమ్మాయి (పెళ్ళి కూతురు) ఎలా ఉన్నా ఫర్వాలేదు కానీ మా అబ్బాయిని జీవితాంతం చక్కగా చూసుకోవాలి. ఇలా మా ఊళ్ళో ఎవరు కనబడినా ఇలాగే చెప్పేది అమ్మ. ఏదైతేనేం నా పెళ్ళి అంగరంగ వైభవంగా ఘనంగా చేసింది. నా భార్య పేరు సాహితి. సాహితి అనే పేరులోనే మంచి సాహిత్య విలువలు ఉంటాయని మా అమ్మ పెళ్ళి కార్డు చూసినప్పుడు చెప్పింది. నాకు పెళ్ళయిన మూడు నెలలకి ప్రముఖ టివి ఛానల్‌ వాళ్ళు రమ్మని నన్ను బాగా ఒత్తిడి చేశారు. మీకు ప్రభుత్వ ఉద్యోగంపై వచ్చే జీతం కంటే మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళు కాల్‌ లెటర్‌ చేతిలో పెట్టి వారంలో మీరు ఉద్యోగానికి వచ్చేది, రానిది తెలియజేయమని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు మా అమ్మ గారు ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగం ఉంది, హైదరాబాద్‌ ఎందుకు వద్దులే అంది. నా మనసులో ఉన్న మాట కూడా అదే. ఇంతలో మా అత్తగారు, నా భార్య సాహితి వాళ్ళ అమ్మగారు ఇంతకంటే మంచి జీతం మరెక్కడా సంపాదించుకోలేరు, ప్రస్తుతం ఉన్న జీతంకంటే మూడు రెట్లు ఎక్కువగా ఇస్తున్నారంటే ఇంతకంటే ఏముంది అని ఆ టీవీ ఛానల్‌ గురించి గొప్పగా చెప్పింది. అసలు నేను టీవీ ఛానల్‌కి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదు. నా ప్రస్తావన టీవీ ఛానల్‌ వరకు ఎందుకు వెళ్ళింది అని ఆరా తీయగా మా అత్తగారి బంధువులు ఆ టీవీ ఛానల్‌ వాళ్ళకి గొప్పగా చదువుకున్న వ్యక్తి, సామాజిక అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి అని నా పేరు వాళ్ళకి తెలియజేశారని తెలిసింది. ఇంతలో నా భార్య కూడా హైదరాబాద్‌ వెళ్దామండి, హైదరాబాద్‌ నేను ఇంతవరకూ చూడలేదు, దయచేసి ఒప్పుకోండి అని ఒత్తిడి చేసింది. ఊళ్ళో చాలామంది ఇంత పెద్ద జీతం వస్తుంటే వెళ్ళండని చెప్పారు. కానీ నా మనసు అంగీకరించలేదు. చివరికి మా అమ్మగారిని కూడా నా భార్య ఒప్పించింది. హైదరాబాద్‌ వెళ్దామని అన్నీ సర్దుకున్నాం. ఇంతలో మా అమ్మగారు నేను రావడంలేదు నాన్నా, ఇక్కడ పొలం, ఇల్లు చూసుకోవాలి మీరు సంతోషంగా వెళ్ళండి అని చెప్పింది. మీరు రాకపోతే నేను వెళ్ళను అమ్మా! మేము ఇక్కడే ఉంటాం అని చెప్పాను. ఇంతలో అమ్మ ఈ పొలాన్ని కౌలుకు ఇచ్చి మనింట్లో ఎవరైనా ఉండడానికి వస్తే నేను వస్తాను బాబూ అని చెప్పింది. అయినా నేను వెళ్ళకుండా ఉండిపోయాను. కానీ నా భార్య వారం రోజులుగా సీరియస్‌గా ఉంటూ, భోజనం కూడా సరిగ్గా చేయకుండా ఉంది. మా అమ్మ మమ్మల్ని బలవంతంగా హైదరాబాద్‌కు పంపింది.

హైదరాబాద్‌లో ప్రముఖ టీవీ ఛానల్‌లో నా ఉద్యోగం అయినప్పటికీ నా మనసంతా అమ్మమీదే ఉంది. ఎందుకంటే అమ్మను వదిలి ఇంత దూరం ఎప్పుడూ రాలేదు.వీళ్ళు ఇచ్చే జీతం కంటే అమ్మ మాటలే చాలా విలువైనవని తెలుసుకున్నాను. సంవత్సరానికి పాప పుట్టింది. అంతులేని సంతోషం అచ్చం అమ్మలా ఉందని. పాపను తీసుకుని మా ఊరు వెళ్ళాం. మా అమ్మ కూడా సంతోషపడుతూ మా మనవరాలు చూడు ఎంత చక్కగా ఉందో అంటూ వచ్చే పోయే వాళ్ళకు చూపెడుతోంది. ఇంతలో నా భార్య సాహితి పాపను అలా అందరికీ చూపించకూడదని మా అమ్మతో చెప్పింది. అందుకు అమ్మ అందరికీ అంటే ఊళ్ళో వాళ్ళు పరాయివాళ్ళు కాదు అందరూ మనవాళ్ళే అని చెప్పింది. మా ఊరిలో ఒక వారం రోజులుండి తర్వాత హైదరాబాద్‌ వచ్చేశాం. నేను మా ఊరికి వెళ్ళడం తగ్గించేశాను. అప్పుడప్పుడూ మా అమ్మ వస్తూ ఉండేది. నేను ఉదయం వెళ్తే మళ్ళీ రాత్రి పది గంటలకు ఇంటికి వచ్చేవాడిని. ఇలా ప్రతిరోజూ నేను చేసే పని ఏమీ లేకపోయినా నా బిజీ షెడ్యూల్‌లో ఉన్నట్లుగా ఉండిపోయేవాడిని.

హైదరాబాద్‌లో నాకు సొంత ఇల్లు, కార్లు ఉన్నాయి. మా ఊర్లో ఉన్న ఇల్లు పాతబడిపోయింది. పొలాన్ని కౌలుకిచ్చి మా అమ్మగారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చాను. మా అమ్మ ఒక నెల రోజులు ఇంట్లో ఉండడానికి కూడా చాలా ఇబ్బంది పడింది. ఎందుకంటే సొంత ఊరు వదిలి ఇంతవరకు ఇన్ని రోజులు ఎక్కడా లేదు. మేము సినిమాలకి, షికార్లకి వెళ్ళేటప్పుడు మా అమ్మ బయటికి వచ్చేది కాదు. ఇంట్లో ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. మేము బయటినుంచి వచ్చేసరికి వంటపని, ఇంటి పని చక్కగా చేసేది. అమ్మ చేతి వంట అంటే చెప్పేదేముంది. బయట తిన్న తృప్తి

ఉండదు. ఏదైనా అమ్మ వంట అమృతమే. అమ్మ రాకముందు మా ఇంట్లో ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు. పల్లెల్లో పొలం పనులు చేసేవాళ్ళు, ఇంట్లో పనులు చాలా చక్కగా చేయడంలో ఆశ్చర్యం లేదు. ఇంట్లో ఐదుగురు చేసే పని, పల్లెల్లో పొలం పనిచేసేవాళ్ళు ఒక్కరితో సమానం. మా అమ్మ హైదరాబాద్‌ ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య సాహితి, నా కూతురు ఆమని ఇంతవరకూ ఇంట్లో ఎలాంటి పనులు చేయలేదు. నా భార్య సాహితి పల్లెటూర్లో ఎలా ఉందో ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. ఆమెతోపాటు నా కూతురు ఆమని కూడా అలానే ఉంది. అంటే సిటీలో ఏదైనా కొత్త సినిమా రిలీజైతే మొదటి ఆటలోనే చూసి వస్తారు. పైగా విపరీతమైన షాపింగ్‌ చేసి వస్తారు. నా కూతురికి పాతికేళ్ళు దాటినా, బాధ అంటే ఏమిటో తెలియకుండా పెరిగింది.

ఒకసారి అందరం కలిసి పెళ్ళికి వెళ్ళాం. అక్కడికి మా ఊరివాళ్ళు వచ్చారు. మా అమ్మను కూడా తీసుకువస్తే చాలా సంతోషపడేదేమో అనిపించింది. మేము బయటికి వెళ్ళిన ప్రతిసారీ అమ్మ వచ్చేది కాదు. అలాగని మేము ప్రతిసారీ అడిగేవాళ్ళం కాదు. ఈ సారి ఎందుకో అడగకుండా వచ్చినందుకు చాలా బాధపడ్డాను. మేము ఇంట్లోకి వెళ్ళేసరికి అమ్మ కిందపడి అటూ ఇటూ కొట్టుకుంటూ ఉంది. గబగబా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాను. అమ్మకు పక్షవాతం వచ్చిందని డాక్టర్లు చెప్పారు. ఒక కాలు, ఒక చేయి పనిచేయడం లేదు. ఒక వారం రోజుల తర్వాత డాక్టర్లు అమ్మను ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పారు. అమ్మను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత నా భార్య, కూతురు బిక్కమొహం వేసుకుని కూర్చుని ఉన్నారు. పాపం చాలా బాధపడుతున్నారని అనుకున్నాను. కానీ వంట చేసేవాళ్ళు లేరని, అందుకు బాధపడుతున్నామని చెప్పారు. రెండో రోజు నుంచి నేను పనిమనిషిని పెట్టాను. కానీ పనిమనిషి అన్ని పనులు చేయలేదని గ్రహించాను. నా భార్య, కూతురు బయటకు వెళ్ళేముందు అందంగా తయారవ్వడానికి మా అమ్మ కొన్ని కొన్ని వస్తువులు అందిస్తూ ఉండేది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ అందించేవాళ్ళు లేరు కాబట్టి అందుకు కూడా మనుషులను పెట్టమని ప్రతిరోజూ నస పెట్టేవారు. అమ్మను చూసుకోవలసిన వీళ్ళిద్దరూ, వాళ్ళిద్దరినీ చూసుకోవడానికి మరో ఇద్దరు పని మనుషులు కావలసి వచ్చింది. ప్రతిరోజూ నేను ఆఫీసుకి

వెళ్తున్నానే తప్ప ఆలోచనలన్నీ అమ్మ కోసమే. అమ్మకు వచ్చిన వ్యాధిని మందులతో కొంతకాలం వరకు తగ్గించినా, ఆప్యాయంగా పలకరించి మనస్ఫూర్తిగా సేవ చేస్తేనే అమ్మ త్వరగా కోలుకుంటుందని నా మనసులో నేను అనుకున్నా, కొంతమంది మిత్రులు చెప్పిన ఆలోచనలు కూడా ఇవే.

నేను ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. అమ్మ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి కానీ మాట్లాడలేని పరిస్థితి. అమ్మకి అన్నం తినిపించి మందులు వేసి మళ్ళీ పడుకోబెట్టాను. ఇంతకీ మా అమ్మ రోజూ అన్నం తిని మందులు వేసుకుంటోందా లేదా అని చిన్న సందేహం వచ్చింది. ఇంతలో నా భార్య, కూతురు వాళ్ళిద్దరితో పాటు పనిమనిషి కూడా వచ్చింది. ఎక్కడికి వెళ్ళారని అడిగాను. సినిమాకి వెళ్ళామని నా కూతురు సమాధానం చెప్పింది. మా అమ్మకు అన్నం తినిపించి, మందులు వేస్తున్నారా అని అడిగాను. నేను మీ అమ్మగారికి ఈ సేవ చేయలేను సార్‌ ఇంట్లో మొత్తం పని చేస్తున్నాను అని సమాధానం చెప్పింది పనిమనిషి. నేను జీతం ఇచ్చి, వేరే పనిమనిషిని కూడా పనికి రావద్దని చెప్పాను. నా భార్య సాహితి, కూతురు ఆమని పని మనుషులు లేకపోతే మేము ఎలా బతకాలి? కనీసం మీ అమ్మకు సేవ చేసేవారైనా కావాలి కదా, దయచేసి పనిమనిషిని పెట్టించండి అని ఒకరి తర్వాత ఒకరు బతిమాలుతూ వచ్చారు. ఇంట్లో మీ ఇద్దరే పని చేయాలి, మా అమ్మను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అని గట్టిగా చెప్పాను. నా భార్య సాహితి నేను మా ఇంట్లోనే ఇంతవరకూ పనిచేయలేదు. అలాంటప్పుడు మీ అమ్మగారికి సేవ చేయడానికి ఎలా ఒప్పుకుంటాను అనుకున్నారు అంది. ఇంతలో నా కూతురు కూడా చూస్తూ చూస్తూ ముసలివాళ్ళను ఎలా పట్టుకుంటారు డాడీ! అయినా ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో పడేస్తే నెలకో, రెండు నెలలకో ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు డాడీ, దయచేసి ఇంట్లో వద్దు డాడీ అని చెప్తుండగానే నా భార్య కూడా నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్‌ను కూడా ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లోనే వేశారు, మనం కూడా ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లోనే వేద్దాం అని చెప్పగానే నాకు ఎప్పుడూ రానంత కోపం వచ్చింది. వీళ్ళు ఇలా తయారవడానికి కారణం నేనే. వీళ్ళిద్దరూ సినిమాలకి, షికార్లలకి వెళ్తుంటే రోజూ ఎందుకు వెళ్తున్నారని ఆ రోజే ప్రశ్నించి ఉంటే ఇప్పుడు ఇలా జరిగి ఉండేది కాదేమో అని మనసులో అనుకున్నాను. పనిమనుషులు లేకపోవడం వల్ల ప్రతిరోజు వీరిద్దరూ బయటకు వెళ్ళి టిఫిన్‌, భోజనం చేసి వస్తారు. నేను మా అమ్మగారిని వదిలిపెట్టి ఆఫీసుకి కూడా వెళ్ళలేకపోతున్నాను. ఒక వారం రోజుల వరకు నేనే వంట చేసి అమ్మకు అన్నం పెట్టి, మందులు వేసేవాడిని. ఈ వారం రోజులు గమనించిన నా భార్య, కూతురు మీ ప్రవర్తన నాకేమీ నచ్చలేదు, ఆఫీసుకి వెళ్ళకుండా ఇలా రోజూ సేవలు చేసుకుంటూ పోతే చివరకు మిగిలేది చిప్పకూడే అని నా భార్య చెప్పగానే కోపం వచ్చింది. అందుకు నా కూతురు ఆమని కూడా ఎందుకు అలా మా వైపు కోపంగా చూస్తారు అంది. అప్పుడు నాకు మనసులో అనిపించింది అమ్మకు పక్షవాతం వస్తే పని చేయాల్సింది పోయి ఇలా మాటలతో చంపుతారా అని. అప్పుడప్పుడూ ఇలా అనుకోని సందర్భాలు వస్తే లోపలున్న కపట ఆలోచనలు బయటికి వస్తాయని ఊహించలేదు. ఇలా మాకే జరుగుతుందా? ఎవరికైనా ఇలా జరుగుతుందా అని లోలోపల అనుకున్నాను. కానీ బయట ప్రపంచం కూడా ఇలానే ఉందని కొంతమంది మిత్రులను అడిగి తెలుసుకున్నాను. ఏదేమైనా నా భార్యకు, కూతురికి మా అమ్మగారు ఇంట్లో ఉండడం ఇష్టపడటం లేదని తెలుసుకున్నాను. కానీ నేను ఆఫీసుకి ఎక్కువ సెలవులు పెట్టి అమ్మను డాక్టర్‌కి చూపించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవాడిని. కొన్నిరోజులకు అమ్మ ఆరోగ్యం కుదుటపడింది. సంతోషకరమైన విషయం ఏమిటంటే అమ్మ నడుస్తోంది, మాట్లాడుతోంది. కానీ ఇదివరటి చలాకీతనం ఇప్పుడు లేదు. కొద్దిగా నీరసంగా ఉంటోంది. నేను ఆఫీసుకి వెళ్ళగానే అమ్మను నా భార్యా, కూతురు తిడుతూ ఉండేవారని గ్రహించాను. నేను ప్రతిరోజూ ఆఫీసునుంచి ఇంటికి రాగానే అమ్మ తను మా ఊరికి వెళ్ళిపోతానని చెబుతుండేది. నా భార్య కూడా మన ఇంట్లో మీ అమ్మ ఒంటరిగా, బాధగా ఆలోచిస్తూ ఉండేకంటే మీ ఊరికి పంపించడం చాలా మంచిదని చెప్పేది. అయినా నేనేమీ పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత అమ్మ ఏడుస్తూ నేను మన ఊరికి వెళ్ళిపోతాను నాన్నా నన్ను పంపించు అని చెప్పగానే కనిపించే వ్యాధికంటే కనిపించని మనోవ్యాధి మనిషిని మరింత బాధిస్తుందని అనుకున్నాను. ఈ లోపు నా భార్య, నా కూతురు వచ్చి మీ అమ్మగారిని ఊరికి పంపిస్తారా? లేక మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మంటారా అని చెప్పగానే ఇప్పుడు ఏమైంది అందరం కలిసే కదా ఉండేది అని నేను చెబుతుండగానే మీ అమ్మగారు ఇంట్లో ఉంటే మేము క్షణం కూడా ఈ ఇంట్లో ఉండమని చెప్పి వెళ్ళి వరండాలో కూర్చున్నారు. మా అమ్మగారు ”నాన్నా! నా వల్ల ఇబ్బందులు వచ్చినా, రాకపోయినా తల్లిదండ్రులను ప్రేమించే కొడుకు కష్టంగా భావించడు. కుటుంబమంటే మొదట భార్య, పిల్లలు తర్వాతే ఎవరైనా. నీవు కోడలు, మనవరాలి మనసులు కష్టపెట్టకుండా జాగ్రత్తగా చూసుకో నన్ను మాత్రం మన ఊరికి పంపించు ఇప్పుడే” అని బట్టలు సర్దుకుని వచ్చింది.

నేను మా అమ్మగారిని తీసుకుని ఊరికి వెళ్ళాను. మా ఇల్లు పాతబడి కూలిపోయింది. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి నేను మళ్ళీ హైదరాబాద్‌ వచ్చాను. నా భార్య, కూతురు ముఖాల్లో ఏదో చెప్పలేని ఆనందం కనిపించింది. కానీ ఇంట్లో వంట చేసి చాలా రోజులైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ బయట తిని ఇంటికి పడుకోవడానికి మాత్రమే వస్తారు. నేను కూడా ఆఫీసు క్యాంటీన్‌ అలవాటు చేసుకున్నాను. మా ఇంట్లోనే వీరిద్దరికీ భారంగా ఉన్న మా అమ్మ అక్కడ వాళ్ళకు భారంగా ఉంటుందేమోనని రోజూ భయపడుతూ ఉండేవాడిని. ఆఫీసు పనిమీద ఒక నెల రోజల పాటు వేరే ఊరికి వెళ్లడానికి ఫ్లైట్‌ టికెట్లు బుక్‌ చేసుకున్నాను. ఆ టికెట్లను నా భార్యకు, కూతురికి చూపించాను. వాళ్ళిద్దరూ మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ మాకు నెలకు అయ్యే ఖర్చులు రెండింతలు ఇచ్చి వెళ్ళండని చెప్పారు. కావలసినవి ఇప్పుడే తీసుకోండని అనగానే రెండు ఏటీఎం కార్డులు, నాలుగు ఖాళీ చెక్కులు తీసుకున్నారు. సెండాఫ్‌ ఇవ్వడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. నేను వాళ్ళకు వేరే దేశం వెళ్తున్నానని ఫైట్‌ టికెట్లు చూపించాను. కానీ నేను మా ఊరికి బయలుదేరాను. ఎందుకంటే అక్కడ మా అమ్మగారికి ఎలా ఉందో అని రోజూ భయపడుతున్నాను. నేను మా ఊరికి రానే వచ్చాను. అంతగా భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే పల్లెటూర్లో కొంతయినా ప్రేమ బ్రతికే ఉంది. నా భార్య, కూతురు పెట్టిన హింసకంటే పల్లెల్లో స్వేచ్ఛగా బ్రతకడం చాలా సులభం. ఎంతో కొంత అయినా పల్లెల్లోనే మానవత్వం మిగిలి ఉందని ఇక్కడ చూసి తెలుసుకున్నాను.

మా ఊరిలో ఎక్కడ చూసినా పచ్చదనం పరుచుకున్న చల్లటి వాతావరణం. అందుకేనేమో పెద్దలు సిటీకి రారు. ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు ఉండలేరు. మా పాతబడ్డ ఇంటిని పడగొట్టి జమ్ము గడ్డితో చిన్న ఇల్లు కట్టించాను. ఆ జమ్ము గడ్డి ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇక్కడ అమ్మను చూసుకునే

వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ, ఇద్దరితో మాత్రం నేను నెల జీతం ఇస్తానని అమ్మను చూసుకోమని చెప్తే డబ్బులు తీసుకోవడానికి వాళ్ళ మనసు అంగీకరించలేదు. ఎలాగో మా పొలం కౌలుగా చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత ఆ సమయంలోనే ఇస్తే సరిపోతుందని అనుకున్నాను. నేను హైదరాబాద్‌ నుండి ఊరికి వచ్చేటప్పుడు ఏటీఎం కార్డులు, చెక్కులు బ్లాక్‌ చేశాను. ఇంట్లో పదివేల రూపాయలు మాత్రమే ఉంచాను. వేరే దేశం వెళ్తున్నానని, అక్కడ ఫోన్‌ కలవకపోవచ్చు అని చెప్పి ఫోన్‌ స్విచాఫ్‌ చేసి వచ్చాను. ఎందుకు అలా చేశానంటే ఇద్దరికీ తినడానికి పదివేల రూపాయలు ఒక నెల రోజులకు సరిపోతుందని భావించాను. పేదవాడి కుటుంబానికయితే నెల రోజులకి ఈ పదివేల రూపాయలు చాలా ఎక్కువ. మా అమ్మగారు నేను ఊరిలో ఉన్న నెలరోజుల పాటు నా భార్య, కూతురు గురించి పదే పదే ఆలోచించింది. నన్ను అక్కడికి వెళ్ళమని చాలాసార్లు చెప్పింది.

నేను హైదరాబాద్‌ తిరిగి వెళ్ళగానే నా భార్య, కూతురు కోపంగా చూశారు కానీ ఏమీ అనలేదు. ఆమని నా దగ్గరకు వచ్చి డాడీ మీరు మమ్మల్ని మోసం చేశారో లేక బుద్ధి చెప్పారో తెలియదు కానీ మేము షాపింగ్‌ చేసిన తర్వాత ఏటీఎం కార్డు చూపిస్తే డబ్బులు లేవని తెలిసింది. అక్కడ మాకు పరువు పోయిందని గ్రహించాము. తిట్టుకుంటూ ఇంటికి వచ్చి కనీసం తినడానికైనా డబ్బులు ఉన్నాయో, లేవో అని అక్కడక్కడా వెతకగా పదివేల రూపాయలు కనిపించాయి. తినడానికి సరిపోతాయి అనుకున్నాము. బయట భోజనం ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని రోజులే వచ్చాయి. మూడు రోజులు పస్తులున్నామని చెప్పింది. నేను లోలోపల బాధపడ్డా అమ్మకి భోజనం విషయంలో జరిగిన విషయం గుర్తుకొచ్చి అంత బాధనిపించలేదు. వీరిద్దరూ పైకి ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నారే తప్ప లోపల నా మీద కోపం అలానే ఉంది, కానీ ముందున్న అహం మాత్రం ఇప్పుడు లేదని గ్రహించాను.

రెండు నెలల తర్వాత మా ఊరి నుంచి ఫోన్‌ వచ్చింది మా అమ్మగారు చనిపోయారని. మన ఊరు వెళ్దామని నా భార్యకి, కూతురికి చెప్పాను, కానీ వాళ్ళిద్దరూ రామన్నారు. వీళ్ళు మారరని మనసులో అనుకున్నాను. ఈ ఒక్కసారికి నా కోసం రమ్మని ప్రాధేయపడ్డాను. ఊరికి వచ్చిన తర్వాత, ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఊరిలో ఎవరూ పనులకు పోలేదు. అందరూ మా ఇంటి దగ్గరే ఉన్నారు. చాలామంది ఏడుస్తూ ఉన్నారు. ఆ రోజు కార్యక్రమం అయిపోయింది. నేను కొన్ని రోజులు ఉందామని చెప్పాను. అందుకు నా భార్య, కూతురు ఒప్పుకోలేదు, వెళ్ళిపోదామన్నారు. ఇంతలో మా ఊరిలో ఉన్న లాయరు భీమరాజు వచ్చి సాహితి, ఆమని అంటే మీరేనా అని అడిగారు. అవునని వాళ్ళిద్దరూ చెప్పారు. లాయర్‌గారు వచ్చి దస్తావేజులు తెచ్చి ఇక్కడ సంతకం పెట్టండని చెప్పారు. ఎందుకని అడిగేలోపే మీ అత్త అన్నపూర్ణమ్మగారు సాహితి అనే పేరుమీద పది ఎకరాల పొలం, ఆమని అనే పేరుమీద పది ఎకరాల పొలం రాసి ఇచ్చారని లాయర్‌ చెప్పారు. కొడుకు పేరు మీద రాయకుండా మాకు ఎందుకు ఇచ్చారని వారు అడగ్గా, నా కొడుకు ఎలాగైనా బ్రతకగలడు, మా అబ్బాయి లేకపోతే వాళ్ళు బ్రతకలేరని కాదు, వాళ్ళకు ఏదో ఒక సమయంలో ఆధారం అవుతుందన్న ఉద్దేశంతోనే వాళ్ళిద్దరి పేర్ల మీద రాస్తున్నానని అన్నపూర్ణమ్మ గారు నాతో చెప్పారని లాయర్‌ గారు బదులిచ్చారు. అప్పుడు నా భార్య సాహితి, కూతురు ఆమనిలు భోరున విలపించారు. వాళ్ళు చేసిన తప్పులకి క్షమించమని నా కాళ్ళు పట్టుకుని ఏడ్చారు. అవును నా పేరు చెప్పడం మర్చిపోయా సాహిత్య ప్రకాష్‌.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.