దేశంలో కొత్త రైతు చట్టం – దాని పరిణామాలు – ఎర్రోజు శ్రీనివాస్‌

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలను, వాటి పర్యవసానాలను తెలుసుకునే కంటే ముందు పాత చట్టం ఏమి చెబుతుందో కూడా పరిశీలిద్దాం. భారతదేశంలో గల భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక భిన్నత్వాన్ని రూపుు మార్చాలని, దేశాన్ని ఏకరూప రాజ్యాంగా మార్చాలని అనుకునే కుట్రలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా నూతన చట్టాలు రూపొందించబడ్డాయి. ఇది రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాసే చర్య. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలకు పరిపాలన అధికారాలు, నియంత్రణ లేకపోతే, స్వయం నిర్ణయాధికారం లేకపోతే ఇక ఆ ప్రాంతంలోని ప్రజల హక్కులు, ఆకాంక్షల గురించి చెప్పనవసరం లేదు. ఇక బలహీనులైన రైతులు అత్యంత దుర్భర స్థితిని అనుభవించాల్సి వస్తుంది.

అత్యవసర వస్తువుల చట్టం-1995 ప్రకారం ఏదైనా ఒక నిత్యావసర వస్తువును అత్యవసర వస్తువుల కింద చేర్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించిన తర్వాతే కేంద్రం చేయవలసి ఉంది. ఈ చట్టం ప్రకారం లైసెన్స్‌, అనుమతులు ఇవ్వడం, వ్యవసాయ

ఉత్పత్తులను రెగ్యులేట్‌ నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేది. అత్యవసర ఆహార ఉత్పత్తుల కోసం వృథాగా ఉన్న భూమిని వ్యవసాయ వినియోగంలోకి తీసుకొచ్చి, పంట దిగుబడి పెంచే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. వస్తువులు కొనడం, అమ్మడం, నిల్వ చేసుకోవడం, రవాణా చేయడం, పంపిణీ చేయడం, ధర నియంత్రించే అధికారం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు వినియోగానికి మించి అధికంగా నిల్వ చేయడం, బ్లాక్‌ మార్కెట్‌ని నియత్రించే అధికారాలు ఉండేవి. దానివల్లనే వ్యాపారులు ఆహార పదార్థాలను అక్రమంగా నిల్వ చేయకుండా ఒక పరిమితి ఉండేది. సామాన్యులు సరుకులను ఓపెన్‌ మార్కెట్లో కొనుక్కునే స్థాయిలో ఉండేవి. వ్యవసాయ రంగం రేపు కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్తే ధరల నిర్ణయం వారిదే అవుతుంది. ప్రభుత్వాలు చేష్టలుడిగి ప్రేక్షకుల్లా మిగిలిపోవాలి.

వ్యవసాయ ఉత్పత్తులను అత్యవసర చట్టం పరిధిలో చేర్చాలన్నా, తొలగించాలన్నా ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవాలని 1955 చట్టం చెప్తోంది. కానీ ఇప్పుడు చేసిన నూతన చట్టం రాష్ట్ర అధికారాలను పూర్తిగా హరించి వేసింది. కేంద్రమే అన్ని అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు. కొత్తగా తెచ్చిన ఈ చట్టాల వల్ల భారతదేశపు ఆహార భద్రతకు, భవిష్యత్తు వ్యవసాయ రంగానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.

అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో వ్యవసాయ రంగం స్థితిగతులను పరిశీలిద్దాం. ముఖ్యంగా అమెరికా తీసుకువచ్చిన ఫార్మా యాక్ట్‌-2018లో వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలని నిర్ణయించింది. అమెరికాకు కెనడా, చైనా దేశాలు ఎగుమతులకు పెద్ద మార్కెట్‌గా ఉన్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా చైనాతో నడుస్తున్న వైరం కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఆగిపోయాయి. చైనాతో వాణిజ్య సంబంధాలు దెబ్బతినడం వల్ల ఇలా వస్తున్న లోటును అత్యధిక జనాభా గల భారతదేశానికి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచుకోవడం ద్వారా పూడ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంత పెద్ద జనాభా కలిగిన దేశం మరొకటి లేదు. ఇంత పెద్ద మార్కెట్‌ కూడా లేదు.

అమెరికా మాత్రం తన అవసరాల కోసం వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు కెనడా, మెక్సికో దేశాలపై ఆధారపడుతున్నది. సమీపంగా ఉన్న దేశాల నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటూ, తూర్పు ఆసియా దేశాలకు ఎక్కువ ధరలకు తన వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమెరికాలో పండిన పత్తిలో 75%, పండించిన బియ్యంలో 50% ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు.

కానీ మన దేశంలో వినియోగానికి సరిపడే స్థాయిలోనే బొటాబొటిగా గోధుమ ఉత్పత్తి ఉంది. కొన్నిసార్లు అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఇతర దేశాల నుంచి గోధుమను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మన దేశంలో పండించే నూనె గింజలు దేశంలోని 40 శాతం అవసరాలకు మాత్రమే సరిపోతుంది. 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మనం వనస్పతి, వెజిటబుల్‌ ఆయిల్‌ ఉత్పత్తులను చైనా నుండి అధిక మొత్తంలో దిగుమతి చేసుకోవడం జరుగుతోంది.

పామ్‌ ఆయిల్‌, సోయాబీన్‌ ఆయిల్‌, పొద్దు తిరుగుడు నూనెల దిగుమతిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే నూనె గింజలు మన దేశ అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇవన్నీ ప్రభుత్వం చెప్పిన లెక్కలే. సోయాబీన్‌ నూనె కోసం అర్జెంటీనా, బ్రెజిల్‌, అమెరికా దేశాలపైన, పామాయిల్‌ కోసం ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలపై, పొద్దుతిరుగుడు నూనె కోసం కజకిస్థాన్‌, అర్జెంటీనా, రష్యా దేశాల పైన మనం ఆధారపడి ఉన్నాం.

మొత్తంగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులలో నూనెలు, వనస్పతిలే 34 శాతం ఉన్నాయి. మన దేశంలో గోధుమల వినియోగం సుమారు 97 నుండి 99 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు ఉంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే గోధుమలు గత మూడేళ్ళుగా సుమారుగా 100 మిలియన్‌ టన్నుల వరకు ఉంటున్నాయి. ఎంత అయితే తక్కువ ఉత్పత్తి అవుతుందో ఆ మొత్తం గోధుమలను అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కేంద్ర ప్రభుత్వం గోధుమలకు మద్దతు ధర పెంచిన తరువాత దేశంలో గోధుమ సాగు వీస్తీర్ణం పెరిగింది. దేశ అవసరాలకు సరిపోయే గోధుమ ఉత్పత్తి సాధ్యమైంది.

ఏప్రిల్‌ 2020 నాటికి ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మరియు ఇతర ఏజెన్సీల వద్ద 755.94 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార నిల్వలు ఉన్నాయి.

మన దేశ ప్రజలు ఏడాదికి 102 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వరకు వరి బియ్యాన్ని వినియోగిస్తున్నారు. భారతదేశంలో 70 శాతం మంది ప్రజలు ప్రతి రోజూ బియ్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వరి అనేది ప్రధాన వినిమయ ఆహారం. మన దేశంలో నాలుగు వేల వరివంగడాలు పండించడం జరుగుతోంది. 40 నుంచి 50 శాతం వరకు ఉత్పత్తి చిన్న, సన్నకారు రైతుల ద్వారా జరుగుతుంది. 90 శాతం మందికి 4.5 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణంలో భూమి ఉంది. బియ్యంలో

ఉత్పత్తి అయ్యే నూకల నుండి ఆల్కహాల్‌ తయారుచేస్తారు.

2017-18 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మోడల్‌ ఎ.పి.ఎం.సి అండ్‌ కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చట్టం తెచ్చింది. తరువాత కేంద్ర ప్రభుత్వానికి మల్టిపుల్‌ మార్కెట్‌ ఛానల్‌, ప్రీ అగ్రిమెంట్‌ కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ మొదలైనవాటిపై ప్రేమ పుట్టింది. వీటిని అమలు చేయడానికి పాత ఏపీఎంసి చట్టాలు అడ్డుగా ఉన్నాయి. వాటి అధికారాలు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. వాటి అధికారం తగ్గించడానికి కేంద్రం ఒక కుట్రపూరిత ప్రయత్నం మొదలుపెట్టింది. అందుకోసం 2019 జులైలో ఏడుగురు ముఖ్యమంత్రులు సభ్యులుగా హైపవర్‌ కమిటీ వేసింది. తనకు అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రులతో మాత్రమే కమిటీ వేసుకొంది. ఆ కమిటీతో కాంట్రాక్ట్‌ వ్యవసాయానికి అనుకూలంగా సిఫార్సులు చేయించుకుంది. వాటి అమలుకు అత్యవసర వస్తువుల చట్టం-1955 పెద్ద అడ్డంకిగా మారింది. అందుకే దానికి సవరణలు చేసింది. కార్పొరేట్‌, కాంట్రాక్ట్‌ వ్యవసాయానికి అనుకూలంగా మూడు చట్టాలు చేసింది. అందులో రైతులకు ఎంతో లాభం చేస్తున్నట్లుగా మల్టిపుల్‌ మార్కెటింగ్‌ అవకాశాలను ఇస్తున్నట్లుగా కొన్ని అందమైన అబద్దాలను చేర్చారు. పాత చట్టంలో ఉన్న లొసుగులను తొలగించి, రైతు అనుకూల విధానాలను రూపొందించమని ఉద్యమాలు నడుస్తుంటే, అంతకంటే నష్టదాయక చట్టాలు చేయటం దురదృష్టకరం. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్‌ అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతూనే, దీర్ఘకాలికంగా కాంట్రాక్ట్‌ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గతంలో ఉన్న కంట్రోల్‌ తీసివేస్తూ ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ పెద్ద మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు కొనుక్కోవడం, నిల్వ చేసుకోవచ్చని పాత చట్టాన్ని

ఉల్టా చేశారు. ఫలితంగా నిన్నటిదాకా నేరమైన విషయం ఈ రోజు న్యాయం అయిపోతుంది.

కొత్తగా పార్లమెంట్‌ ఆమోదం పొందిన మూడు బిల్లులు: అందమైన పేర్లతో ఆర్డినెన్స్‌ తేవడం.

1) వ్యవసాయ ఉత్పత్తి వ్యాపారం వాణిజ్యం (ప్రమోషన్‌ & ఫెసిలిటేషన్‌)

2) రైతులకు మద్దతు ధరపై ఒప్పందం (సాధికారత, రక్షణ)

3) అత్యవసర వస్తువుల చట్టం – 2020

దీని ప్రకారం అత్యవసర వ్యవసాయ ఉత్పత్తులను అన్‌ లిమిటెడ్‌గా నిల్వ చేసుకునే అధికారం కల్పించారు.

1. ఏ ప్రాంతంలోనైనా అమ్ముకోవచ్చు. ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవచ్చు. మార్కెట్‌ యార్డ్‌లో అమ్ముకునే అవసరం లేదు. పంట చేను మీద వచ్చి కొనుక్కోవచ్చు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీల ఆవరణలో అమ్ముకోవచ్చు. గిడ్డంగుల ఆవరణలో అమ్ముకోవచ్చు. స్టోరేజిలో పెట్టుకుని అమ్ముకోవచ్చు. ఇంకో పద్ధతి ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌. ఈ ఆర్డినెన్స్‌ ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌కు అనుమతిస్తుంది. ఆన్‌ లైన్‌ ప్లాట్‌ఫాం మీద అమ్మకాలు, కొనుగోలు చేసుకోవచ్చు. దీనికి ఏవైనా కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, రిజిస్టర్డ్‌ సొసైటీ, ఇన్‌కమ్‌టాక్స్‌ నెంబర్‌ కలిగి ఉన్నవారెవరైనా కొనుగోలు చేసుకోవచ్చు. ఫార్మర్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్‌, అగ్రికల్చరల్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ కూడా కొనుక్కోవచ్చు.

ఇది అత్యధిక మొత్తంలో కొనుగోలుదారులను ఏ మాత్రం ఆకర్షించలేదు. ముఖ్యంగా కార్పొరేట్‌ సంస్థలు, మల్టీనేషనల్‌ అండ్‌ నేషనల్‌ కార్పొరేట్‌ రిటైల్‌ సంస్థలకు లాభం చేసేదిగా మాత్రమే ఉంది. లైసెన్స్‌ లేకుండా కొనుక్కునే విధానం అమల్లోకి రావడమనేది ఎంతమంది కొనుగోలు దారులను తయారు చేస్తుందో చూద్దాం. ఇక కొనుగోలుదారులపై ఎటువంటి లెవీ, మార్కెట్‌ ఫీజు వసూలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలను, వాటి అధికారాలను నిర్వీర్యం చేశారు.

2. రైతులకు మద్దతు ధరపై ఒప్పందం: దీనికి ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ అని ముద్దుపేరు కూడా పెట్టారు. దీనిలో ప్రధానమైనది ఫార్మింగ్‌ అగ్రిమెంట్‌. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. కనీసం ఒక పంట కాలానికి లేదంటే ఐదు సంవత్సరాల వరకు ఒక రైతు వద్ద అగ్రిమెంట్‌ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ పండ్లతోటలు, ఇతర దీర్ఘకాలిక పంటలు అయ్యేటట్లు ఉంటే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కూడా అగ్రిమెంట్‌ చేసుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. ఓ అందమైన పేరు ఏంటంటే ముందే పంట ధర నిర్ణయించడం. అగ్రిమెంట్‌ రాసుకున్నప్పుడే పంట ధర నిర్ణయించుకొని రాసుకోవాలి. ఇంకేమైనా అదనపు ధర చెల్లించాల్సి వస్తే అది కూడా అగ్రిమెంట్‌లో పొందుపరచుకోవాలి.

ఏదైనా డిస్ప్యూట్‌ వస్తే బోర్డుకి వెళ్ళి రిప్రజెంటేషన్‌ చేయవలసి ఉంటుంది. అగ్రిమెంట్‌ ఎవరు చేసినా కూడా దానికి సంబంధించిన పరిష్కారం అర్జీలు ఇచ్చిన 30 రోజుల లోపల పూర్తి కావాలి లేదంటే సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ను సంప్రదించవలసి ఉంటుంది. చట్టంలో అగ్రికల్చర్‌ ల్యాండ్‌ను రికవరీ కోసం తీసుకోకూడదని చెప్పినప్పటికీ రైతులకు అప్పులపాలయితే ఆ భూమిని అమ్ముకొని మాత్రమే కట్టవలసి ఉంటుంది. చట్టం మేజిస్ట్రేట్‌ వద్దకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు.

3. ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ చట్టం 2020: ముందు పాత చట్టం ఏం చెప్తోందో చూద్దాం. 1955 చట్టం ప్రకారం ఆహార పదార్థాలు, ఎరువులు, పెట్రోలియం వస్తువులు పాత అత్యవసర వస్తువుల కిందికి వస్తాయి. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వస్తువులను నిషేధించడం, సరఫరా, మార్కెట్‌ తదితర అంశాలపై నియంత్రణ అధికారం ఉంది.

కొత్త ఆర్డినెన్స్‌ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారాలను కట్టబెట్టింది. అందులో తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, నూనె గింజలు లాంటి కొన్ని ఉత్పత్తులను మాత్రమే అసాధారణ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చేస్తుంది. ఆ అసాధారణ పరిస్థితులు ఏంటంటే ఒకటి యుద్ధాలు, రెండవది పదార్థాలకు అత్యంత కొరత ఉన్నప్పుడు, మూడవది ధరలు అధికంగా పెరిగినప్పుడు, నాల్గవది ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు సంభవించినపుడు.

సరఫరా, నిల్వలపై గతంలోని పరిమితిని తొలగించేశారు. ఎంతైనా నిల్వలు చేసుకోవచ్చు. 12 నెలల్లో పండ్లపై 100% అంటే (హార్టికల్చర్‌ ప్రొడ్యూస్‌) ఆహార ఉత్పత్తుల ధరలు గత సంవత్సరం కంటే 50% పెరిగితే స్టాక్‌పై పరిమితి విధిస్తారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. గతంలో కఠినమైన చట్టాలు

ఉన్నప్పుడే ఉదాహరణకు ఉల్లిపాయల ధరలు ఒక నెలలో కిలో పది రూపాయలు ఉంటే తర్వాత రెండు నెలలకు 50 రూపాయలు ఉండేవి. ఇప్పుడు 100 రూపాయలు అయ్యాయి. అత్యధిక నిల్వలకు అవకాశం కల్పించిన తర్వాత అసాధారణ పెరుగుదలని నియంత్రణ చేస్తామని కేంద్రం చెప్పింది కదా. పది రెట్లు పెరిగాయి. ఏం నియంత్రణ చేశారు. కార్పొరేట్‌ శక్తులను నియంత్రించే శక్తి ప్రభుత్వానికి లేదు. చట్టాల వల్ల మేలు జరుగుతుందన్న నమ్మకం సాధారణ ప్రజలకు ఏ మాత్రం లేదు.

2010 సంవత్సరంలో బీహార్‌లో తీసుకువచ్చిన నూతన వ్యవసాయ మార్కెటింగ్‌ విధానం వల్ల కొత్త పెట్టుబడిదారులు ఈ రంగంలోకి రాలేదు. ఉన్న మార్కెట్‌ యార్డులన్నీ కూడా నిరాదరణకు గురై పనికిరాని స్థితిలో శిథిలావస్థకు చేరాయి. వాటిని పట్టించుకునే నాధుడే లేడు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా మార్కెట్‌ యార్డులకు అదే పరిస్థితి రావచ్చు.

కోవిడ్‌-19 మహమ్మారిని తట్టుకుని నిలబడగలిగిన ఒకే ఒక రంగం వ్యవసాయ రంగం. గత సంవత్సరం కంటే ఈ జూన్‌ త్రైమాసికంలో 3.14 శాతం అభివృద్ధిని నమోదు చేసుకుంది. అయినప్పటికీ నూకలు, మొక్కజొన్న నుంచి ఆల్కహాల్‌ తయారు చేస్తూ ఆ వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ రంగం ఖాతాలో చూపించడం లేదు. అనేక పరిశ్రమలకు ముడి సరుకు అందిస్తున్నప్పటికీ వ్యవసాయ రంగం యొక్క ఆదాయాన్ని జీడీపీలో తగ్గించి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా రిటైల్‌ వ్యాపారం నుండి వచ్చే ఆదాయాన్ని కూడా వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంలో చూపడంలేదు.

దేశ అవసరాలకు సరిపోయే పప్పు ధాన్యాలు, నూనె గింజలు మన దేశంలో పండించాలంటే వాటికి మద్దతు ధర ఇచ్చి ప్రోత్సహించాలి. వ్యవసాయ రంగం కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్తే అత్యధిక జనాభా ఉపాధి కోల్పోతుంది. ఇప్పటికే ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. భవిష్యత్తులో వ్యవసాయ రంగం దెబ్బతింటే అత్యధిక జనాభా ఉపాధి లేక దుర్భర జీవనం గడపాల్సి వస్తుంది.

(కొలిమి వెబ్‌ మ్యాగజైన్‌ నుండి)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.