కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం గ్రహీత మానస ఎండ్లూరితో జ్వలిత ఇంటర్వ్యూ

జ్వలిత
1. జ్వలిత: కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిక మీకు ముందుగా శుభాకాంక్షలు. ఈ పురస్కారం పొందిన సందర్భంగా మీరు ఎలా ఫీలవుతున్నారు?
మానస ఎండ్లూరి: ఈ పురస్కారం పొందినందుకు నేను చాలా ఆనందంగా ఫీలవుతున్నాను.

అయితే దీన్ని గుర్తింపు అనేకంటే కూడా గౌరవం అనుకుంటున్నాను. ఎందుకంటే అస్తిత్వాన్ని రాసుకునే రచయితలకు వచ్చే గుర్తింపు, గౌరవం ఆ రచయితకే కాదు తన జాతికి, తన వర్గానికి వస్తుందని నమ్మేదాన్ని. ఒక స్త్రీ వాదిగా, ఒక బహుజన వాదిగా, ఒక దళిత వాదిగా అట్టడుగు వర్గాల స్త్రీల గురించి ఆ వర్గపు… ముఖ్యంగా దళిత క్రైస్తవ మనుషుల గురించి నేను రాస్తున్నాను కాబట్టి ఈ పురస్కారం అనేది ప్రతి ఒక్కరినీ గౌరవిస్తుందని నేను భావిస్తున్నాను.
2. జ్వలిత: చాలా గొప్ప భావన. వ్యక్తిగతంగా కాకుండా, అస్తిత్వ స్పృహతో చాలా గొప్పగా ఉంది మీ సమాధానం. విహంగ పత్రిక బాధ్యత, విహంగ పత్రికలో మీ సాహిత్యం గురించి చెప్పండి?
మానస ఎండ్లూరి: విహంగ అనేది అంతర్జాలంలో మొట్టమొదటి మహిళా సాహిత్య పత్రిక. 2011లో మా అమ్మగారు, కీర్తిశేషులు డాక్టర్‌ పుట్ల హేమలతగారు దీన్ని మొదలుపెట్టారు. ఈ పత్రిక పెట్టిన ఐదు సంవత్సరాలకు నా మొట్టమొదటి కథ విహంగలో ప్రచురితమైంది. ఆ కథ పేరు ‘గౌతమి’. తెలంగాణ, ఆంధ్ర విడిపోతున్న సమయంలో ఎమోషనల్‌గా మనం పడ్డ స్ట్రెస్‌ను ఆ కథలో చిత్రీకరించడానికి ప్రయత్నం చేశాను. ఆంధ్రాలో ఉండే అక్క, తెలంగాణలో ఉండే తమ్ముడ్ని సింబాలిక్‌గా తీసుకొని రాశాను. అంటే నిజజీవితంలో కూడా మా నాన్నగారు హైదరాబాదీ అయినా ఉద్యోగరీత్యా రాజమండ్రిలో ఉండడం, నాన్నగారి సోదరులంతా అంటే బాబాయిలందరూ ఇక్కడే హైదరాబాద్‌లో ఉండడం, నేను హైదరాబాద్‌ మరియు రాజమండ్రిని దగ్గరగా చూడడం, ఈ రెండిరటి మధ్యలో మానసిక దూరం ఎంతో ఇబ్బంది పెట్టింది. జియోగ్రాఫికల్‌గా మనం వేరైనా, మానసికత కూడా అవసరమే కదా. దీంట్లో మళ్ళీ అసలు మనం విడిపోతున్నామా? దూరమవుతున్నామా? మనం వేరు వేరు అవుతున్నామా అన్న దృష్టిలో రాశాను. అయితే స్వతహాగా తెలంగాణ రాష్ట్రం రావడం గొప్ప విషయం. అది రావడం వల్లే వారి కళలకి కానీ, భాషకి కానీ వాళ్ళకంటూ ఒక సొంత గుర్తింపు రావడాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అలాగే ‘విహంగ’… మరీ ముఖ్యంగా పరిశోధక వ్యాసాల మీద దృష్టి పెడుతుంది. ఎందుకంటే విహంగ పత్రికకు Iూదీచీ నంబర్‌ ఉంది. అది ఉండడంతో గత ఏడాది నవంబర్‌ 25, 26 తేదీల్లో విహంగ తన పది సంవత్సరాల ప్రయాణాన్ని సదస్సుల రూపంలో జరుపుకుంది. అంతర్జాలంలో (వెబినార్‌) అంతర్జాతీయ సదస్సు జరుపుకుంది. దానికి ఇతర దేశాల నుండి ఎందరో పాల్గొని, పత్ర సమర్పణ చేశారు. త్వరలో అది ఓ పుస్తక రూపంలో రాబోతోంది. ఇంగ్లీష్‌ మరియు తెలుగు… అంటే ద్విభాషా సదస్సును నిర్వహించాము. ఎందుకంటే నవంబర్‌ 25న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 26న Iఅసఱaఅ జశీఅర్‌ఱ్‌బ్‌ఱశీఅ ణaవ. ఈ రెండిరటినీ దృష్టిలో పెట్టుకుని ఆ రెండు రోజుల సదస్సును నిర్వహించాము. విహంగలో సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఒక రచయిత, అమ్మ ఈ పత్రికను ప్రారంభించినప్పటి నుండి పని చేస్తున్నారు. విహంగకు రెక్కలు ఇచ్చేది తనే. అమ్మ తర్వాత అఫిషియల్‌గా నేను సంపాదకురాలిగా బాధ్యతలు తీసుకున్నాను.
3. జ్వలిత: విహంగ ఒక ప్రత్యేక పత్రిక. నేను కూడా పత్రికలో రచనలు చేశాను. పుట్ల హేమలత గారు నన్ను ప్రోత్సహించారు. ఇప్పుడు మీ బాల్యం గురించి చెప్తారా?
మానస ఎండ్లూరి: మా అమ్మది నెల్లూరు, నాన్నది హైదరాబాద్‌. నాన్న ఉద్యోగరీత్యా నాకు నాలుగేళ్ళు ఉన్నప్పుడు రాజమండ్రి రావడం జరిగింది. రాజమండ్రిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో నాన్న 28 సంవత్సరాలు ప్రొఫెసర్‌గా పనిచేశారు. దాంతో నేను నా ఇంటర్మీడియట్‌ దాకా రాజమండ్రిలోనే చదువుకున్నాను. ఆ తర్వాత సైకాలజీ, ఇంగ్లీష్‌, సోషల్‌వర్క్‌తో డిగ్రీని ఏలూరు సెయింట్‌ థెరిస్సా కాలేజీలో చేశాను. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ లింగ్విస్టిక్‌ భాషా శాస్త్రంలో పీజీ చేశాను. అమ్మ, నాన్నలిద్దరూ సాహిత్యరంగానికి సంబంధించిన వారు కావడంవల్ల, నేను పుస్తకాలతో పెరిగాను. ఇంట్లో ఎప్పుడూ సాహిత్య వాతావరణం ఉండేది. పెద్ద పెద్ద రచయితలు వస్తూ ఉండేవారు. వారు తమ పుస్తకాలను అమ్మానాన్నలకు ఇచ్చి వెళ్ళేవారు. అలా పెరిగి పెద్దవుతున్నకొద్దీ సాహిత్యాన్ని సీరియస్‌గా తీసుకోవడం జరిగింది. ఇద్దరూ దళిత వాదులే అవడంతో కథలు, కవిత్వం అన్నీ చదివేదాన్ని. మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా దళిత చరిత్ర, బహుజనుల సమస్యలు వంటి వాటి గురించి చర్చిస్తూ ఉండేవారు. ఒక దళిత బిడ్డగా నేను విన్నదే కాదు, నేను చూసిన, అనుభవించిన అనుభవాలను, ఒక దళితురాలిగా నన్ను సమాజం ఏ విధంగా చూస్తోంది అనే అనుభవాలు కూడా నాకు మెండుగానే ఉన్నాయి. నా ముఖంలో బొట్టు కనిపించకపోవడంతో వాళ్ళ ముఖంలో మారిన మార్పులు కానీ, రంగులు కానీ ఒక క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా సమాజం నన్ను స్వీకరించలేకపోవడం కానీ, లేకుంటే క్రిస్టియన్‌నని తెలిసినప్పుడు వారిలో కనిపించిన మార్పు కానీ, ఇలా నేను చాలా రకాల వివక్షను ఎదుర్కొన్నాను. వీటన్నింటినీ చాలా స్పష్టంగా గమనించాను. బాల్యంనుంచే ఎప్పుడో, ఎక్కడో ఏదో రాయాలనే నమ్ముతూ ఉండేదాన్ని. చిన్న చిన్న కవితలు, హైకూలు వంటివి రాస్తూ ఉండేదాన్ని. ఖచ్చితంగా, ఇంకా బాగా రాయాలని ఇంట్లో ప్రోత్సహిస్తుండేవారు. అది రాయి, ఇది రాయి అంటూ చాలా ఎంకరేజ్‌ చేసేవారు. చిన్నప్పుడు ఎక్కువగా డైరీ రాసేదాన్ని. ఎప్పుడూ డైరీ రాయడం అలవాటు చేసుకోండి అని చెప్పేది అమ్మ. నాకు రాతలో బాగా ఇంట్రస్ట్‌ ఉండేది. అలా నా బాల్యం గడిచింది.
4. జ్వలిత: బాల్యం, విద్యాభ్యాసం రెండూ కలిపి చెప్పారు. అయితే మీ మొదటి రచన ఎప్పుడు చేశారు? ఆ ప్రక్రియ ఏమిటి?
మానస ఎండ్లూరి: నేను మొదట్లో కవిత్వమే రాశాను. అప్పటికి నా వయసు ఆరు లేదా ఏడు సంవత్సరాలు ఉంటుంది. మా తాతయ్య, నాన్న వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ‘‘దేవతలారా మా తాతయ్య ఎక్కడున్నాడు చూపించండి/చూపించి మళ్ళీ మీరే దాచేసుకోండి’’ అంటూ రెండు లైన్లు రాశాను. నిజానికి నాకు అంత స్పష్టంగా గుర్తులేదు. కానీ నాన్న మాత్రం ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఆ తర్వాత చిన్న చిన్న కవిత్వాలు అంటే భావ కవిత్వాలు రాస్తూ
ఉండేదాన్ని. ఎనిమిదో తరగతి నుండి ఇంటర్మీడియట్‌ వరకూ రాస్తూ ఉన్నాను. ఒకటి, రెండు కథలు రాశాను. నిజానికి ఏదో అనుకుని సరదాగా చేసిన రచన అని చెప్పొచ్చు. తర్వాత నా జీవితంలో రచన ఒక భాగంగా మారిపోయింది.
5. జ్వలిత: మొట్టమొదటి సీరియస్‌ కథ ఎప్పుడు రాశారు?
మానస ఎండ్లూరి: మొట్టమొదటి కథ 2015లో విహంగలో ప్రచురితమైంది. అప్పటినుంచి సీరియస్‌గా రాయడం మొదలైందని చెప్పవచ్చు. రాజమండ్రిలోని గోదావరి ఇంజనీరింగ్‌ కాలేజీలో ఆ టైంలో ఇంగ్లీష్‌ బోధించేదాన్ని. ఎస్‌.కె.వి.టి.లో మరియు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ వారికి కూడా స్పోకెన్‌ ఇంగ్లీష్‌ క్లాసులు తీసుకునేదాన్ని. సీరియస్‌గా ఏ ఉద్యోగాలూ చేయలేదు. భాషా శాస్త్రం కావడంతో రాజమండ్రి ఇంజనీరింగ్‌ కాలేజిలో స్పోకెన్‌ ఇంగ్లీష్‌ను రెండు సంవత్సరాలు చెప్పాను. అప్పటినుండి సీరియస్‌ కథలు రాయడం మొదలుపెట్టాను.
6. జ్వలిత: మీ రచనలకు స్ఫూర్తి, ప్రేరణ మీ తల్లిదండ్రులే కదా?
మానస ఎండ్లూరి: స్ఫూర్తి అంటే నా జీవితంలో నేను ఎదుర్కొన్న నిజ జీవిత సంఘటనలు నాకు స్ఫూర్తి అని చెప్తాను. జీవితానుభవాలే నాకు స్ఫూర్తి.
7.జ్వలిత: వివక్ష గురించి మీ వ్యక్తిగతం, సామాజికం, జెండర్‌ పరంగా, కుల పరంగా?
మానస ఎండ్లూరి: వివక్ష అంటే నేను వచ్చిన కుటుంబ నేపథ్యం దళిత క్రిస్టియన్‌ అని చెప్పొచ్చు. అమ్మ, నాన్న ఇద్దరూ క్రిస్టియన్స్‌. ఇద్దరూ రెండు రాష్ట్రాలకు సంబంధించిన వారు. నేను స్కూలుకి వెళ్ళినప్పుడు గానీ, బైటికి వెళ్ళినపుడు గానీ, ఏదైనా పనిమీద ఎటైనా వెళ్ళినపుడు గానీ, నా బొట్టు లేని ముఖాన్ని చూసేవారు. రాజమండ్రిలో పెరిగాను కదా మేడమ్‌, అక్కడ అడుగడుగునా బ్రాహ్మణత్వం, హిందుత్వం ఉంటూనే ఉంటుంది. అలాంటి ప్రాంతంలో నేను బైటికి వెళ్ళినపుడు జనాలు బొట్టు లేని నా ముఖాన్ని చూసి ఒకరకమైన ఎక్స్‌ప్రెషన్‌ పెట్టడాన్ని నేను కొన్ని వందలసార్లు గమనించాను. నా హిందూ ఫ్రెండ్స్‌ ఇళ్ళకు వెళ్ళినపుడు అందరికీ నమస్కారాలు పెట్టి నా దగ్గరికి వచ్చేసరికి ఆశ్చర్యపోయినట్లు చూడటం, అంటే ముఖం చూడగానే నువ్వు ఫలానా కులపు దానివని మాకు అర్థమయిందని ముఖం పెట్టడం… ఇలాంటివి రాజమండ్రిలో ఉన్నప్పుడయితే నేను చాలా ప్రత్యక్షంగా చూశాను. మా సీనియర్‌ ఒకమ్మాయి వచ్చింది పదవ తరగతిలో ఉన్నప్పుడు ‘‘ఐ డోంట్‌ లైక్‌ క్రిస్టియన్స్‌, బట్‌ ఐ లైక్‌ యూ’’ అంది. ఆ మాటను నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ అమ్మాయి చాలా ర్యాండమ్‌గా అని ఉండొచ్చు, లేకుంటే ఆ అమ్మాయిలో కూడా ఎప్పటినుండో కుల వ్యవస్థ బాగా నిండిపోయి
ఉంటుందని మనం అనుకోవచ్చు. కానీ ఆ అమ్మాయి నన్ను వ్యక్తిగా ఇష్టపడుతోంది కానీ నా నేపథ్యాన్ని ఒప్పుకోలేకపోతోంది. ఆ అమ్మాయికి నేను నా బిహేవియర్‌ పరంగా నచ్చినట్లు ఉన్నాను. ఆ అమ్మాయి కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేది. నా ఫ్రెండ్స్‌లో చాలామందికి క్రిస్టియన్స్‌ అనగానే ఒక ఒపీనియన్‌ ఉంది. క్రిస్టియన్స్‌ ఇలా ఉండరు, కానీ నువ్వు భలే ఉన్నావ్‌ అంటూ ఉండేవారు. నా సమక్షంలోనే కొంతమంది ముస్లిం మిత్రులను ‘‘మీరు స్నానాలు చేయరంటగా, అయినా నువ్వు శుభ్రంగా ఉన్నావులే’’ వంటివి అనడం చూశాను. అగ్రవర్ణ కులాల వాళ్ళకీ ఇది తెలుసు. కానీ వారు దీని గురించి మాట్లాడరు. మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇట్లాంటి వివక్షల్ని చాలా ప్రత్యక్షంగా చూశాను. అందుకే వీటిని ‘బొట్టు కథలు’గా రాసుకుంటూ వచ్చాను. నిజానికి ఈ బొట్టు కథల మీద చాలా విమర్శలు వచ్చాయి. ఇంటా, బయటా, దళితుల్లో కూడా కొంతమంది దీన్ని స్వీకరించలేకపోయారు. ఈ కాలంలో బొట్టు, కాటుక చూసి అవకాశం ఇవ్వకపోవడం వంటివన్నీ ఉండవని అన్నారు. కానీ ఎంతోమంది దళిత స్త్రీలు క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చినవాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత, వాళ్ళు క్రైస్తవాన్ని ఇంటివరకే పరిమితం చేసుకున్నారు. బొట్టు పెట్టుకుని తమ కులాన్ని దాచుకున్నారు. అలాంటి వాళ్ళు కొన్ని లక్షల్లో ఉంటారు. మనకు తెలిసినవారైనా ఈ సాహిత్యకారులలో కూడా ఉంటారు. ప్రముఖుల పిల్లల్లో ఉంటారు. కానీ ఫస్ట్‌ సైట్‌లో ఒక చిన్న గౌరవం, అంటే నేను చెప్పినట్లు అటువంటి వాటిని అధిగమించడానికి బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇంతవరకు ఈ విషయాలను నేను చాలా దగ్గరగా చూశాను. ఈ విషయాలు ముందు ఎక్కడా చర్చించబడలేదు, మాట్లాడలేదు కూడా. ఎం.ఎం.వినోదిని తన ‘తప్పిపోయిన కుమార్తె’ కథలో దీని గురించి ప్రస్తావించారు. తర్వాత సతీష్‌ చందర్‌ కూడా ‘బొట్టు లేని తనమే నా గుర్తింపు అయింది’ అనే ఒక కవిత కూడా రాశారు. నేను దీనికి సంబంధించి నాలుగైదు కథలు వ్రాయడం జరిగింది.
8. జ్వలిత: దళిత క్రిస్టియన్స్‌గా మీరు చాలా వివక్షల్ని ఎదుర్కొన్నానన్నారు. అయితే ఒక అమ్మాయిగా జెండర్‌పరంగా వివక్షను ఎదుర్కొన్నారా?
మానస ఎండ్లూరి: అంటే మనది భారతదేశం కదా. కులం, మతం మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా మనలోకి తొంగి చూస్తూనే ఉంటుంది. స్త్రీగా నేను ఎదుర్కొన్న సమస్యలు అంటే… నువ్వు ఫలానా, అది చేయలేవు, నువ్వు ఆడపిల్లవి… అనేవి ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరికీ ఉంటూనే ఉంటుంది. అది గమనించడం, గమనించకపోవడం అనేవి మనమీద ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటాను. ఇప్పుడు నేను పెద్ద బండిని నడిపిస్తాను అంటే ఆడపిల్లవు నడపకూడదు అని చెప్పడం, ఇంట్లోనూ బయట ఇవి కేవలం చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ ఆడపిల్లల్ని ఎంతగా కుంగదీస్తాయన్నది అర్థం చేసుకోరు. ఫలానా టైంకల్లా ఇంటికి వచ్చేయాలి, బయట ఉండకూడదు వంటివన్నీ ప్రాథమిక స్థాయిలో విన్నాను. అవకాశాలు ఇవ్వకుండా అడ్డుపడే స్థాయిలో నేను చూడలేదు. అవకాశాన్ని పోగొట్టుకునే స్థాయికి నేను పోలేదు. ఆడపిల్లల్ని ష్ట్రవశ్రీజూశ్రీవంం పవఱఅస్త్ర గా చూస్తున్నారు. ఏ కులమైనా, ఏ మతమైనా పైవన్నీ ఎదుర్కోవలసిందే. సాధారణంగా ఇదంతా ముందుగా మనకు ఇంట్లోనే తారసపడతాయి. సాహిత్య రంగంలో ఉన్నాను కాబట్టి, స్త్రీ గురించి పురుషులు రాయడం గమనించాను. వారు స్త్రీలు పడి పడి రాస్తారు, స్త్రీలు ఇలా అనుకుంటారు అలా అనుకుంటారు, వేశ్యలు అలా మాట్లాడతారు అంటూ రాస్తుంటారు. మొన్న ఒక అబ్బాయి ‘వేశ్య ప్రతి మగవాడిని ప్రేమిస్తుంది’ అన్నాడు. అతనెందుకు అలా అన్నాడో నాకు అర్థం కాలేదు. అది చెప్పాలనుకుంటే వేశ్యే చెప్పొచ్చు కదా, లేదా తన అభిప్రాయమని చెప్పొచ్చు కదా. మొన్న ఒక పెద్దాయన అన్నారు ‘జీవితమే స్త్రీ లింగం’ అని. జీవితం స్త్రీ లింగం ఎలా అవుతుంది? వ్యవస్థ అంతా పురుషులతో నిండి ఉంటే అది స్త్రీ లింగం ఎలా అవుతుంది? ఆకాశంలో సగం స్త్రీ అని చెపుతూ బుజ్జగిస్తూ ఉంటారు. సాహిత్యంలో నేను చూసిన దానిబట్టి వేదికమీద పురుషులే ఉంటారు. కొంతమంది ఏదో అలంకరణగా ఒకరో, ఇద్దరో మహిళల్ని వేదికమీద కూర్చోబెడుతుంటారు. ఈ భేదాన్ని మాత్రం కేవలం సాహిత్యంలో నేను బలంగా చూస్తున్నాను. మనకు ఏదైనా ఒక కథ లేక కవితాసంపుటి ఏడాదికి ఒకటి వస్తూ ఉంటుంది. వాటిలో స్త్రీలకంటే పురుషుల రచనలే ఎక్కువగా ఉంటాయి. పోనీ స్త్రీలు లేరా అంటే కచ్చితంగా ఉంటారు. వీళ్ళని ఎక్కడా రానివ్వకపోవడం చూస్తుంటాం. అందుకే స్త్రీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ ఉండి ఉంటే… కచ్చితంగా ఎన్నో పెద్ద పెద్ద పురస్కారాలు, గౌరవాలు దక్కేవని నేను అనుకుంటున్నాను.
9.జ్వలిత: మీ ‘మిళింద’ కథాసంకలనం మీ మొదటి పుస్తకం కదా! దీనిలో కొన్ని కతల గురించి మాట్లాడుకుందాం. ఃజశీతీతీవష్‌ఱఙవ తీaజూవః కథని ఏ ఆధారంతో రాశారు?
మానస ఎండ్లూరి: ఈ కథని నేను ప్రత్యక్షంగా చూడలేదు. తెలిసిన వారి జీవితంలో జరిగిన విషయం కూడా కాదు. ఒక టైంలో స్వలింగ సంపర్కులుగా ఉన్న పిల్లల్ని చిత్రహింసలు పెడుతున్న కేసులు చాలా వినిపించాయి, ఎక్కువగా వచ్చాయి. కొడుకు స్వలింగ సంపర్కుడయితే అతని తల్లి అతన్ని లైంగికంగా వేధించడం, దానివల్ల అతను స్త్రీలను ఇష్టపడతాడని, లేకపోతే స్ట్రెయిట్‌గా మారతాడన్న అపోహలో తల్లి ఇలా చేసిన ఉదంతాలు మన ఇండియాలోనే చాలా ఉన్నాయి. లేదంటే ఆడపిల్లలు లెస్బియన్‌గా ఉన్నప్పుడు మేనమామలు, తండ్రులు, బాబాయిలు వాళ్ళను రేప్‌ చేయడం, తద్వారా వారు పురుషులకు అలవాటు పడతారు అన్న అపోహలో వాళ్ళను చిత్రహింసలు పెట్టడం లాంటివి మన దేశంలోనూ, ప్రపంచ దేశాల్లోనూ ఉన్నాయి. ఇలా రికార్డు కాని కేసులు, విషయాలు చాలా ఉంటాయి.
10. జ్వలిత: కథలో స్పందన తల్లికి పేరు పెట్టలేదు. ఆ పాత్ర చాలా విశృంఖలంగా ఉంది?
మానస ఎండ్లూరి: నిజానికి స్పందన తల్లి పాత్ర విశృంఖలంగా చూడలేదు. సమాజంలో స్త్రీలలో ఆమెనీ ఒక స్త్రీగానే భావించాను. భర్తను కోల్పోయి ఇంకొక పురుషుడి దగ్గర స్వాంతన, ప్రేమ కోరుకుంటుంది. ఒక తోడు ఏ రకంగానయినా అయ్యుండొచ్చు… శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా అయినా అయి ఉండవచ్చు. కానీ అతను చివరికి ఆమెను మోసం చేస్తాడని ఆమె ఊహించి ఉండదు. ఆ ఉదంతాన్ని నేను కథగా రాశాను. ఆడపిల్లల చుట్టూ, ఆమె లెస్బియన్‌ అయినా, ఆమె స్రైట్‌ ఉమెన్‌ అయినా కూడా మగవాడికి లైంగికంగా ఎలా బలైపోతుందో చెప్పాను. స్పందన వాళ్ళ బావే ముందుకు వచ్చి తనని అలా చేయడానికి ఒప్పుకుంటాడు. తల్లి చెప్పి ఉండడం ఒక విషయం. ఈ విషయాన్ని నేను నా బాధ నుంచి రాసిన కథ. ఇందులో ఇంకో చిన్న విషయం ఏంటంటే మనం సినిమాల్లో చూసినప్పుడు, ఒక మగవాడు గే లేదా నపుంసకుడు అయితే వాళ్ళపై జోకులేసుకుని సెక్స్‌కి పనికిరాడని అంటాం. అతను ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా కానీ, అతని ఆలోచనలు, అస్తిత్వాలు ఉంటాయని గుర్తించక, అవన్నీ పక్కన పెట్టేసి అతను సెక్స్‌కి పనికిరాని వాడిగా కామెంట్లు చేస్తాం. అతని దగ్గరికి సెక్స్‌/లవ్‌ కోసం ఏ ఆడపిల్లా వెళ్ళదు. పురుషులు కూడా అతన్ని ఛీ కొడుతూ ఉంటారు. అంతేకాదు ఇంకొక గే అయిన పురుషుడు కూడా అతని వద్దకు వెళ్ళడు. అదే ఆడపిల్లలు లెస్బియన్‌ అయితే, ఆమె తనకు ఇష్టం లేదని చెప్పినా ఆమెను రేప్‌ చేయడానికైనా వెనుకాడరు. ఇదే ఫార్ములా మగవాళ్ళకు కూడా వర్తించాలి కదా. ఆ మగవాడు ఆమెను వదిలి వెళ్ళకపోగా కక్ష తీర్చుకోవడానికి చూస్తాడు. ఈ విధంగా ఆడపిల్లలు చిత్రవధకు లోనవుతున్నారు.
11.జ్వలిత: ఇంకొక కథ మెర్సీ పరిణయం. దీంట్లోని విక్టర్‌ వంటి వారిని సమాజంలో చూస్తూనే ఉంటాము. మెర్సీకి తల్లిదండ్రులు లేనందున అభద్రత ఉంటుంది. మెర్సీ పాత్ర గురించి వివరించండి.
మానస ఎండ్లూరి: మెర్సీ పాత్ర తెలుగు సాహిత్యంలో చాలా అరుదైన పాత్ర. ఈ మధ్యకాలంలో సునీల్‌ కుమార్‌ గారు అలాంటి క్రిస్టియన్‌ పాత్రను సృష్టించారు. క్రిస్టియన్‌ పాత్రని పెట్టడమే అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే ఆ వర్గం నుండి రచయిత లేరు కాబట్టి. ఉన్నా వేళ్ళమీద లెక్క పెట్టగలిగినంత తక్కువ మంది ఉన్నారు. ఒక దళిత క్రైస్తవులు అన్నింటికీ దేవుడిమీద ఆధారపడుతుంటారు. ప్రతి చిన్నదాన్ని మాటకు వెనక, మాటకు ముందు దేవుడి పేరు లేకుండా మాట్లాడరు. వాళ్ళకు ఉన్న కష్టాలు కానీ, నష్టాలు కానీ అన్నీ దేవుడి పేరుమీదే మాట్లాడుతారు. ఎప్పుడూ చర్చి పాటలు పాడడం, ప్రార్థనలు చేయడం, వారు చదువుకునే లేదా ఉద్యోగస్థులైనా వారి నిత్య జీవితంలో దేవుడనేవాడు ఉంటూనే ఉంటాడు. అటువంటిదే మెర్సీ పాత్ర. వీళ్ళకు పిల్లలు పుడితే కూడా అంతగా క్రిస్టియానిటీ అనేది వారి జీవితంలో భాగమైపోయింది. కేవలం ఆదివారమే కాదు వేరే రోజులు కూడా వీటిలో కొన్ని ఉంటాయి. ఆమె తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ వద్ద ఉంటుంది. అమ్మాయి మంచి పొజిషన్‌కి రావాలని, బాగా చదువుకోవాలని, ఒక హోదాలో ఉండాలనే ఉద్దేశ్యంతో ఉన్న విద్యార్థిని. ఆ అమ్మాయికి విక్టర్‌ అనే అబ్బాయి పరిచయమవుతాడు. ఆమె అ అబ్బాయి తన వెంట పడడం ఇష్టపడదు. నువ్వు ఎలాగైనా నన్నే ప్రేమించాలంటాడు అతను. ఈ అమ్మాయి దేవుడే అంతా అన్నట్లుంటుంది. ఆ అబ్బాయి వెంటపడడం ఇష్టపడదు. నువ్వు మంచిగా మారాలని ప్రార్థన చేస్తా అంటుంది. ఆ తత్వం ఆ అమ్మాయిని అంతగా కట్టిపడేస్తుంది, అట్లాంటి పాత్ర అది.
12.జ్వలిత: విక్టర్‌ పాత్ర బాగా నడిపారు. ‘అయితే స్పృహ కోల్పోతే అగ్గిపుల్ల వెలిగించి మానం భగ్గుమనిపించాడు’ అని రాశారు. ‘మానం’ అనే పదాన్ని మీరు అంగీకరిస్తారా?
మానస ఎండ్లూరి: ఆ రోజుల్లో అమ్మ, నేను దీని గురించి చాలా చర్చించుకున్నాం. నేనేమో మర్మాంగాన్ని అని రాశాను. నేను ఉన్న జనరేషన్‌కి మాకు సాహిత్యంలో ఏ పదం వాడాలి, ఏది వాడకూడదు అనే ఆంక్షల గురించి తెలియదు. బుర్రలోకి ఏది వస్తే అది రాసే స్థితిలో మేమున్నాం. అయితే అమ్మ ఆ పదాన్ని ఎవరూ రాయట్లేదు అంది. అప్పుడు మానం అని రాశాను. అది శరీరానికి జరిగింది, గౌరవానికి సంబంధం లేదనే అంటాను నేను.
13. జ్వలిత: మాథ్యూస్‌ మోహన్‌ కథలో కోడ్‌ లాంగ్వేజ్‌ ఉపయోగించారు. ఆ కథలో డీకోడ్‌ చేయలేదు. అందుకని నాకు అర్థం కాలేదని అడుగుతున్నాను.
మానస ఎండ్లూరి: దీంట్లో ఏంటంటే క్త్రైసవ కుటుంబ వ్యవస్థ ఎవరికీ పట్టింపు అనేది ఉండదు. ఇది రెండు కోణాల నుండి రాసిన కథ. హిందూ పండుగలు, పబ్బాలు హిందువులకు తెలిసే ఉంటాయి. క్రైస్తవ జీవితాల నేపథ్యాల దగ్గరికి వచ్చేసరికి నిర్లక్ష్యం ఉంటుంది. ‘మీలో కూడా ఉంటారటగా అదే మీ ఏసుప్రభు ఎలా ఉన్నాడు, మీ చర్చిలో పాటలు వస్తున్నాయి’ అని చెప్పి దూరాన్ని బాగా వ్యక్తం చేస్తూ ఉంటారు. మీరు, మేము వేరు వేరు అని. ఇప్పుడు కూడా మీ వెంకటేశ్వరస్వామి, మీ సాయిబాబా అనే ఆలోచన కూడా రాదు. అదే వాళ్ళని మైనారిటీలుగా మారుస్తుంది. క్రైస్తవంలో నుంచి హిందుత్వంలోకి వెళ్ళిన వారు కూడా ఇలాగే అంటూ ఉంటారు. ఇన్‌డైరెక్ట్‌గా చెప్తూ ఉంటారు. ఇటువంటి ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ కథ. క్రైస్తవుల్లో తప్పకుండా ఉంటారు. ఈ ఇరువురి మధ్య ప్రేమ చరిత్ర ఉంది, అది మంచి చేయాలనే ఉద్దేశంతోనే. మన కుల వ్యవస్థ ఎలా ఉంటుందంటే మాల, మాదిగ కులం గురించి మాట్లాడేటప్పుడు తలుపులేసుకుని మాట్లాడుకుంటారు. ప్రత్యక్షంగా చూశాను నేను. అందరికీ తెలుసు, అయినా భయం. క్రైస్తవ మాల, మాదిగ అన్న పదాలను పలకాలంటే భయం అందుకే. కోడ్‌ లాంగ్వేజ్‌లో మాట్లాడతారు. కోడ్‌ లాంగ్వేజ్‌లో మాల రెండక్షరాలు మాదిగ మూడక్షరాలు. అందుకే కోడ్‌ లాంగ్వేజ్‌ అని అంటూ ఉంటారు మా ఇళ్ళలో ఇలా నవ్వుకుంటూ ఉంటాను.
14. జ్వలిత: జెన్నిఫర్‌ కథ గురించి చెప్పండి. మీ మీద చలం ప్రభావం ఉందా?
మానస ఎండ్లూరి: చలాన్ని చదివాను. స్కూల్లో ఉన్నప్పుడు ‘మైదానం’ చదివాను. అప్పుడు అర్థం కాలేదు. కానీ తర్వాత మళ్ళీ చదివాను. దాని ద్వారానే నేను చలం ప్రభావంతో ‘మైదానంలో నేను’ అన్న కథని రాశాను. జెన్నిఫర్‌ కథని అనుకోకుండా రాశాను. కానీ అది నిజంగానే జరిగింది. మా తాతయ్య చనిపోయినప్పుడు నారాయణగూడ శ్మశానవాటికకు వెళ్ళాను. చాలా అందంగా ఉంటుంది. బ్రిటిషర్లు కట్టించారు. వారికి సంబంధించిన సమాధులు కూడా ఉండేవి అక్కడ. సమాధి మీద శిలువ గుర్తు, పక్కనే ఎగురుతున్న పావురాలు మరియు ఏంజెల్‌ పక్కపక్కనే ఉన్నాయి. బాగా అందంగా కనిపించేది. అప్పుడప్పుడూ అక్కడికి వెళ్తూ ఉండేదాన్ని. చనిపోయిన భార్య కోసం ఆమె భర్త అక్కడికి వస్తూ ఉండేవాడు. తన భార్య సమాధిపై పెట్టడానికి పూలు తెచ్చేవాడు. నా చిన్నప్పుడు ఆ దృశ్యం నా మనసులో నాటుకుపోయినట్లు ఉంది. ఆ మధ్య ఈ కథ రాసిన తర్వాత గుర్తువచ్చింది. కట్‌ చేస్తే, నా జీవితంలో అంతా అమ్మా, నాన్న నిండిపోయారు. వారు తప్ప బయటి ప్రపంచంతో పరిచయం తక్కువే. ఇంట్లో అమ్మా, నాన్నా… వారే నా ఫ్రెండ్స్‌. అమ్మ, నాన్న ఈ కథను చదివి బాగా ఏడ్చేశారు. చూశారా? అది అమ్మ చనిపోయినట్లు కథ రాసింది, బహుశా ఇప్పుడు నేను ఎలా బతికేది? అంటూ అమ్మ చాలా ఏడ్చేసింది. తీరా చూస్తే అది నిజంగానే జరిగింది. క్రిస్టియన్‌ కుటుంబాలలో ఉన్న ఆటుపోట్లను నిజాయితీగా రాశాను. సినిమాల్లోలా కాకుండా నిజాయితీగా చెప్పాలనుకున్నాను.
15. జ్వలిత: ఉల్ఫత్‌ కథ గురించి వివరించండి.
మానస ఎండ్లూరి: నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ట్రాన్స్‌జెండర్‌ దగ్గరికి స్వయంగా వెళ్ళాను. ఆసక్తికరం ఏంటంటే, కుల, మత పరంగా మైనారిటీ పరంగా ప్రస్తావించాను. హిజ్రాలు వేరేవాళ్ళను పెళ్ళి చేసుకుని జీవిస్తున్న వారి ఫోటోలన్నీ నాకు చూపించారు. అలా వారి జీవితాల గురించి రాశాను.
16. జ్వలిత: మీ మీద చలం ప్రభావం ఉందనిపిస్తోంది. అది మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నిజం. అయితే నాది ఒక అమాయకమైన ప్రశ్న ఏంటంటే నిజంగా అంతగా ప్రేమిస్తారా? అంత ప్రేమ ఉంటుందా? ప్రేమ అంత ఆకర్షిస్తుందా? ప్రపంచం నుండి వేరు చేస్తుందా?
మానస ఎండ్లూరి: దీంట్లో ఈ ట్రాన్స్‌జెండర్‌ని కలిసినప్పుడు, వారు చెప్పిన కొన్ని విషయాలను బట్టి చాలావరకు, అందరూ పెళ్ళిళ్ళు చేసుకోలేరు. అందులోనూ అలాంటివాళ్ళు… అంటే ఇద్దరు అబ్బాయిలు. ఆ ప్రేమను చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చూసిందేంటంటే, వారిలో విపరీతమైన కేరింగ్‌. వాళ్ళు ఒక విషయం చెప్పారు. ఏంటంటే, ప్రేమించడంలో మీరు మా ముందు ఎందుకూ పనికిరారు. మీకంటే జెండర్‌, ఇంకేవో సమస్యలు ఉంటాయి. కానీ మాకు దొరికిన వారినే గొప్పగా చూసుకుంటాం. సిగరెట్లతో కాల్చడం, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం వంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అందుకే దొరికిన వారినే వెంటబడి వెంటబడి ప్రేమిస్తూ ఉంటాం. వేరే గత్యంతరం లేనందున ఉన్నవాళ్ళను వదులుకోలేం అని చెప్పారు.
17. జ్వలిత: ‘మిళింద’లో అంతలా స్త్రీ వాదం కనిపించలేదు. పురుషులను ప్రొటెక్ట్‌ చేసినట్లు అనిపించింది.
మానస ఎండ్లూరి: అవును నిజమే. ఎందుకంటే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకునేది పురుషులే. ప్రేమలో విఫలమైన పురుషులే కాదు, రైతులు, విద్యార్థులు… ఇలా పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి కారణాల వల్ల ఎక్కువ సంఖ్యలో వారే ఉంటారు. మన దేశంలో ఇది ఎక్కువ.
18. జ్వలిత: బహుజనులు, దళితులు అన్న పదాల మధ్య వివాదం నడుస్తోంది. బీసీలను మీరు వేరే పేర్లు పెట్టుకోండి అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయమేంటి?
మానస ఎండ్లూరి: బహుజనులు అన్న ఈ పదం మీద మనం హాస్యాస్పదమైన కామెంట్లు వింటూనే ఉంటాం. అయితే ఆ మధ్య జూపాక సుభద్ర బహుజని అనే పేరును కూడా తీసుకొచ్చారు.
19. జ్వలిత: కాదు. ‘బహుజని’ నేను సూచించిన పేరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా బహుజనులైతే ఆ వర్గాల మహిళలంతా కలిసి బహుజని కదా. అందుకే 2017లో రవీంద్రభారతిలో సభ జరిగింది కదా ఆ సన్నాహాలప్పుడు సూచించాను.
మానస ఎండ్లూరి: ఔనా! మేడం… మళ్ళీ దాంట్లో ఎందరు ఏకమయ్యారో తెలియదు కానీ, బహుజన స్త్రీలు అనేది వాళ్ళ
ఉద్దేశం. ఏమో నేనైతే బహుజనులు అని అంటున్నాను. కొందరు నన్ను కరెక్ట్‌ చేయడానికి చూస్తూ ఉంటారు. బహుజనులు కాదు వారు దళితులు అని కొంతమంది, దళితులు కాదు అని ఇంకొందరు అంటుంటారు. దళిత బహుజన అనేది వివక్షకు సంబంధించినది. దీన్ని నువ్వు ‘‘నేను బాధితురాల్ని’’ అని గర్వంగా ఎలా చెప్పగలుగుతున్నావు. ఎప్పుడూ ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. మొన్నటిదాకా అగ్రవర్ణాలు అన్నాం, ఇప్పుడు పీడకులు అంటున్నాం. ఉత్పత్తి కులాలను శ్రామికులు అంటున్నాం. కాలంతోపాటు భాష కూడా సవాళ్ళు విసురుతుంది. నేను ఒక వ్యక్తిగా దళితురాలిని అయి ఉండొచ్చు కానీ యూనివర్సల్‌గా నేను బహుజనురాల్ని. నేను దీన్ని సమర్థిస్తాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ కలిస్తేనే బహుజనులు కదా. కాబట్టి ప్రతి కులానికి వారి వారి సమస్యలు ఉంటాయి. ఒకరితో మరొకర్ని పోల్చలేం.
20. జ్వలిత: సాహిత్య అకాడమీ అవార్డు పొందినందుకు నేటి యువతరానికి మీరిచ్చే సందేశం లేదా సలహా?
మానస ఎండ్లూరి: దిగువ స్థాయి వర్గాల నుండి, వివక్షను ఎదుర్కొంటున్న వర్గాల నుంచి ఆడపిల్లలు రచయితగా రావాలనేది నా కోరిక, తపన. అగ్రవర్ణాల నుంచి రావలసిన సాహిత్యం ఎంతో వచ్చింది. అది ఒక విధంగా మిస్‌లీడ్‌కి దారి తీస్తుంది కూడా. వారంతట వారు రాస్తే తప్పించి మనకు కావలసిన సాహిత్యం ఆ స్థాయిలో వస్తుందేమో అని అనుకుంటున్నాను. బహుజన సాహిత్యం కూడా విస్తృతంగా రావాల్సి ఉంది.
21. జ్వలిత: ఆ కోణంలో మీరు ఎటువంటి బాధ్యత తీసుకుంటారు?
మానస ఎండ్లూరి: బాధ్యత అంటే నాకు పరిచయమైన వాళ్ళను, నా కుటుంబీకులను, తరచూ మీరు రాయండి, మీరు ఎలా వస్తే అలా రాయండి, ఏమైనా ఉంటే సరిచేయవచ్చు అని అడుగుతూ ఉంటాను. అందరూ రాయలేరని నాకు అర్థమయింది. వారికి చెప్పాను కూడా మీరు రాస్తే దాన్ని కరెక్షన్‌ చేసేవాళ్ళుంటారు అని. కానీ అది వాళ్ళ వల్ల కాలేదు. కానీ నా సాహితీ సర్కిల్‌లో ఎవరు కనిపించినా వెంటపడుతున్నాను. ఎన్నో చేయాలని అనుకుంటున్నాను. కానీ నేను ఇంకా నేర్చుకుంటున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వింటున్నాను. టాపిక్‌ పట్ల ఒక అవగాహన కోసం పలు రకాలుగా ఆలోచిస్తున్నాను. ఇంకా పరిపక్వత రాలేదేమో అనుకుంటున్నాను.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.