మేథా పాట్కర్‌తో మీరా ప్రయాణం! -కె. సజయ

మేథా ఎలా అంటే తనే ఒక వ్యవస్థ. యాభై రకాల పనులు ఏకకాలంలో చేసేది. ఆమెకు చెప్పలేనంత శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. ఓపిక చాలా ఎక్కువ.

నేను ‘లా’ పూర్తి చేసిన తర్వాత 2008లో మూడు,నాలుగు నెలల పాటు స్వతంత్రంగా హైదరాబాద్‌ హైకోర్టులోనే ప్రాక్టీస్‌ కూడా చేశాను. ప్రాక్టీసు మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే హెచ్‌ఐవి పేషెంట్లకు ఇవ్వాల్సిన ఎఆర్‌టి మందుల పంపిణీలో జరుగుతున్న జాప్యం వల్ల గ్రామీణ పేదలు పడుతున్న ఇబ్బందుల గురించి ఒక పిల్‌ స్వతంత్రంగా వేశాను. మహబూబ్‌ నగర్‌ నుంచి అనుకుంట… ఇద్దరు భార్యాభర్తలు హెచ్‌ఐవి వైద్యంకోసం ఉస్మానియాకు వస్తే, అక్కడ మందులు స్టాక్‌ లేవు అన్న కారణం చేత వైద్యానికి నిరాకరించబడ్డారు. అతని పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ఈ అంశం మీద నేను వేసిన పిల్‌తో మందుల పంపిణీ వెంటనే జరగాలని హైకోర్టు అప్పటి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ, హెల్త్‌ డిపార్టుమెంటుకు ఒక మంచి డైరెక్షన్‌ ఇచ్చింది. ఒక లాయర్‌గా నాకు మంచి కాన్ఫిడెన్స్‌ వచ్చిన సందర్భం అది.

ఆ సమయంలోనే హౌసింగ్‌ రైట్స్‌కి సంబంధించి హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌ దగ్గర చాలా పెద్ద మీటింగ్‌ జరిగింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు భూ సేకరణ బాధితులు, ఔటర్‌ రింగ్‌రోడ్‌ బాధితులు, ఇంకా ఇతర ‘అభివృద్ధి’ పథకాల్లో నిర్వాసితులవుతున్న అనేకమంది వచ్చారు. ఈ సభలోనే నేను మేథాపాట్కర్‌ గారిని మొదటిసారి చూశాను. ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉంటున్న ఆమె గురించి అప్పటికే విని ఉన్నాను. నర్మదా ఉద్యమం గురించి, నిర్వాసితుల సమస్యల గురించి, ప్రభుత్వాల విధానాలు, చట్టాలు… ఇలా అనేక విషయాలను ఆమె ఆ సభలో చెప్పింది. ఆమె అద్భుతమైన ఉపన్యాసకురాలు. సమయం దొరికినప్పుడు ఆ రెండు రోజులు ఆమెతో ఈ అంశాల మీద నాకున్న ప్రశ్నలను వేస్తూ, మాట్లాడుతూ వెళ్ళాను. ‘మీరు పాల్గొనే అన్ని సభలను ఎవరైనా డాక్యుమెంట్‌ చేస్తున్నారా?” అని అడిగాను. దానికి ఆమె ‘ఎవరూ పూర్తి కాలం లేరని, ఎవరన్నా అలా వాలంటీర్‌గా వచ్చేవాళ్ళు ఉంటే చెప్పమని’ అడిగింది. ఆమె ఎలా అంటే, ‘అందరూ తిన్నారా లేదా, మాట్లాడారా లేదా అనేవన్నీ చాలా కేరింగ్‌గా పట్టించుకునే మనిషి. ఆ మీటింగ్‌ జరుగుతున్నప్పుడే నేను నా స్నేహితులు ఒకళ్ళిద్దరిని అడిగి చూశాను కానీ ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు నాకే మేథాపాట్కర్‌ చాలా కమిట్‌మెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి, ఆమెతో కలిసి పనిచేస్తే నేను కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు, అవగాహన పెరుగుతుంది, నేనే ఎందుకు వెళ్ళకూడదని అనిపించింది.

రెండోరోజే ఆమెతో ‘నాకు రావాలనుందని’ చెప్పాను. నా ఆలోచనను ఆమె వెంటనే అంగీకరించలేదు. ”అచ్ఛా, ఆప్‌ ఏక్‌ మెహెనే కేలియే దేఖ్‌నా, హమారా కామ్‌ ఆప్‌కో పసంద్‌ హైతో బాద్‌మే దేఖేంగే” అని చెప్పింది. నేను కూడా పూర్తి కాలం అనుకుని ముందు అక్కడికి వెళ్ళలేదు. ఒక నెల చూద్దామనే వెళ్ళాను. కానీ, అలా ఇంకో నెల, ఇంకో నెల అంటూ పొడిగించుకుంటూ వెళ్ళిపోయాను. మేథా చాలా విస్తృతంగా ప్రయాణాలు చేస్తుంది. తనతో అలా ప్రయాణం చేయడం నాకు ఉత్సాహంగా ఉండేది. నర్మదా వ్యాలీలో సమయం గడపడంతో పాటు, దేశం నలుమూలల్లా జరిగే అనేక పోరాటాలను తనతో ప్రయాణించడం ద్వారా ప్రత్యక్షంగా చూశాను. నందిగ్రామ్‌, సింగూర్‌ వంటి ఎన్నో పోరాటాలతో ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది మేథా వల్లనే. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ

ఉద్యమాలను డాక్యుమెంట్‌ చేశాను.

2008లో వెళ్ళిన నేను 2016 వరకూ అక్కడే ఉండిపోయాను. దాదాపు తొమ్మిది సంవత్సరాల పైనే అక్కడ పూర్తి కాలం పనిచేశాను. మధ్యలో కేవలం రెండు మూడు సార్లు వచ్చి అమ్మను చూసి వెళ్ళాను. అమ్మ కూడా నా దగ్గరికి వచ్చి వెళ్ళింది. మేథా ఎలా అంటే తనే ఒక వ్యవస్థ. యాభై రకాల పనులు ఏకకాలంలో చేసేది. ఆమెకు చెప్పలేనంత శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. ఓపిక చాలా ఎక్కువ. ఆమె పనిని చాలా నిబద్ధతతో, ప్రేమతో చేస్తుంది. ప్రజలకు అన్యాయం జరుగుతోంది, మనమేమన్నా చేయాలి అనే తపన ఆమెలో ఎంతో ఎక్కువ. ఆమెలో ఉన్న ఆ అంశంతోనే నేను ఎక్కువ ప్రభావితమయ్యాను. వాతావరణం ఎంత నిరాశాపూరితంగా ఉన్నా కానీ ఆమె దాన్ని చైతన్యవంతంగా మార్చేసేది. కొత్త కొత్త ఎత్తుగడలను ముందుకు తీసుకురావటంలో కూడా సృజనాత్మకంగా ఆలోచిస్తుంది. పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రభుత్వాలతో ఎలా చర్చించాలి, ఏ విధానంలో ఉద్యమాన్ని చేయాలి అనే దాంట్లో ఆమె బాగా వినూత్నంగా ఉండేది. వీటన్నింటితో నేను ఆమె నుంచి చాలా నేర్చుకున్నాను. అలాగే, నా లోలోపలి ఆలోచనలకు ఒక మార్గం కనబడడం మొదలైంది. నర్మదా ఆందోళనతో పాటు చీూూవీ (నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్స్‌ – ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక)లో నేను బాగా పనిచేయడం మొదలుపెట్టాను.

చీూూవీ మొదటినుంచీ కూడా దేశవ్యాప్తంగా ఒక టీంగానే పనిచేసేది. చాలామంది కార్యకర్తలు పనిచేసేవారు. ఇప్పుడు కూడా మేము ఒక టీంగా దాదాపు పదిహేడు మందిమి జాతీయ సమన్వయ బాధ్యతలు తీసుకున్నాం. అలానే మేథా నర్మదా ఆందోళన్‌కు కూడా సమయాన్ని ఎక్కువ కేటాయిస్తారు. ఆమెతో కలిసి ఇన్ని రకాల అంశాలతో కలిసి పనిచేయడంలో నేను అనేక అంశాలు నేర్చుకున్నాను. అంతకు ముందు నా ప్రపంచం చాలా చిన్నది. కొన్ని విషయాలకే పరిమితం. కానీ, ఇక్కడ నా పరిధి పెరిగింది. రైల్వే కార్మికుల పోరాటంలో చాలా విస్తృతంగా పాల్గొన్నాను. గూర్ఖాలాండ్‌ అంశం మీద రెండుసార్లు అక్కడికి వెళ్ళాను. ఉప్పు కొటార్లలో పనిచేసే కార్మికుల సమస్యపై పనిచేశాను. నర్మదా వంటి పెద్ద స్థాయి ఉద్యమంలో పూర్తికాలం పనిచేయడం అనేది ఒక సందర్భంలో ఎదురైంది. అప్పటివరకూ ఇలా అనేక అంశాలతో ఉన్న చిన్న చిన్న ఉద్యమాలతో కలిసి పనిచేస్తూ వచ్చాను.

నర్మదాలో ఆశిష్‌ అనే ఒక మిత్రుడు ఉండేవాడు. చాలా మంచి కార్యకర్త. మొదట్లో స్కూల్‌లో చదువుకునేటప్పుడు ఆరెస్సెస్‌తో పనిచేశాడంట. ఆ ప్రాంతంలో ఇలాంటి సంస్థలు తప్పించి ప్రత్యామ్నాయ రాజకీయాలకు వేదిక లేకపోవడం ఒక కారణం. నర్మదా బచావో ఆందోళన్‌ మొదలైన తర్వాత ఆరెస్సెస్‌తో ముడిపడి ఉన్న అంశాలను అర్థం చేసుకుని హిందుత్వ రాజకీయాలమీద విమర్శనాత్మకంగా ఉండడం మొదలుపెట్టాడు. నర్మదా ఉద్యమం స్థానికంగా ఉన్న యువతను హేతుబద్ధమైన ప్రజా ఉద్యమాలలోకి కూడగట్టగలిగింది. ఇది కేవలం జీవనోపాధులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. తమ సాంస్కృతిక జీవన విధానానికి సంబంధించిన విషయం కూడా. జన జీవితం మొత్తం ఆ నది చుట్టూ పెనవేసుకుని

ఉంటుంది. అలాంటి నదిని, నది చుట్టూ ఉన్న జీవవరణాన్ని అభివృద్ధి పేరుతో ధ్వంసం చేయటం వెనక

ఉన్న రాజకీయాలను ఆశిష్‌ లాంటి యువకులు బాగా గ్రహించగలిగారు. తను అనుకోకుండా చిన్న వయసులోనే గుండె పోటుతో మే 20న చనిపోయాడు. చాలా ఎక్కువగా సిగరెట్లు తాగేవాడు. అయితే ఆ కారణంతో చనిపోలేదు. వాళ్ళ అక్క భర్త చనిపోయాడని కబురు వస్తే చాలా దూరం నుంచి 7-8 గంటలు వేసవి ఎండలో బైక్‌ నడుపుకుని వచ్చాడు. అన్నీ పూర్తి చేసి ఇంటికి వచ్చి గుమ్మంలో కూర్చుంటుండగానే తీవ్రంగా గుండెపోటు రావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. నర్మదా ఉద్యమంలో అతను చాలా కీలకమైన వ్యక్తి. ఈ ఉద్యమంలో వివిధ రకాలైన కార్యకర్తలు ఉండేవారు. కానీ కొంతమందే మనుషుల మధ్య అనుసంధానంగా ఉండేవారు. ఆశిష్‌ అలాంటి వ్యక్తి. తను అలా చనిపోవడం మాకు ఊహించని షాక్‌లాగా అయింది.

ఆశిష్‌ చనిపోయిన మే నెలలో అప్పటినుంచి ప్రతి సంవత్సరం నాలుగైదు రోజుల పాటు ఒక యువ సమ్మేళనాన్ని జరుపుతున్నాం. ఇప్పటికి పదేళ్ళ నుంచి జరుపుతూనే ఉన్నాం. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ ఉద్యమాల్లో పనిచేస్తున్న యువత వచ్చి తమ తమ అనుభవాలను పంచుకుంటారు. చాలా ఉత్సాహంగా ఉంటాయి ఈ సమావేశాలు. ఆశిష్‌ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉద్యమంలో చాలా సహాయంగా ఉండేవారు. వాళ్ళ నాన్న కూడా ఆ తర్వాత కొద్దికాలానికి చనిపోయారు. అమ్మ విద్య మా అందరితో ఇప్పటికీ ఎంతో ఆత్మీయంగా ఉంటారు. మా అందరిదీ ఒక విశాలమైన కుటుంబంగానే భావిస్తాము. రక్త సంబంధమే కుటుంబం కానక్కరలేదు!

క్లిప్టన్‌ అనే ఒక లాయర్‌ ఉండేవారు. కర్నాటక నుంచి వచ్చారు. తను కూడా ఆశిష్‌ లానే

ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తి. ఆశిష్‌ చనిపోయిన తర్వాత జరిపిన యువ సమ్మేళనంలో కలిసి నాతో మాట్లాడారు. నన్ను పూర్తి కాలం ఇక్కడే పనిచేయడానికి వీలవుతుందా అని ఆయన అడిగారు. అప్పటివరకూ నేను మేథాతో కలిసి అన్ని ప్రాంతాలకు వెళ్తున్నాను. అలాగే కొంత సమయం నర్మదాలో కూడా ఇస్తున్నాను. పూర్తి కాలం పనిచేయగలుగుతానా అని చాలా ఆలోచించాను. పూర్తి కాలం చేస్తే నేను ఇంక బయటికి వెళ్ళడానికి ఉండదు. ఆలోచించి చెబుతానని సమయం కావాలని అడిగాను. అయితే అప్పటికి నా ఉనికి మీరా దీదీగా మారలేదు. ఆ ఆలోచనలు లోపల సుళ్ళు తిరుగుతున్నాయి కానీ, వాటిని ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కావటంలేదు. మేథాతో ఎవరో ఒకరు వెళ్ళడం అవసరమే కానీ, ఎవరూ లేకపోయినా కానీ తను పని చేయగలిగే సమర్ధురాలని నాకు అప్పటికే అర్థమయింది. నాకు ఒక రకంగా నిర్ణయం తీసుకోవటం సవాలుగానే అనిపించింది. ఒక కార్యకర్తగా పూర్తి సమయం ఇవ్వటం ఉద్యమానికి అవసరం, అలానే నేను ఎక్కువ భాగం ఉద్యమంతో పనిచేయడం నా ఉనికికి కూడా ముఖ్యమే అని భావించాను. అదీకాక, ఇక్కడి ప్రజలతో ఒక అనుబంధం ఏర్పడింది. వాళ్ళతో చాలా కలిసిపోయాను. అదే నన్ను పూర్తి కాలం సమయం ఇవ్వటానికి అంగీకరించేలా చేసింది.

ఉద్యమమంటే ఒకటే పని కాదు కదా! అన్ని రకాల పనులూ ఉంటాయి. కోర్టుల నుంచీ, ప్రభుత్వ ఆఫీసులు, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగటం, మైదాన ప్రాంతాల్లో, గ్రామాల్లో సమావేశాలు, అడవుల్లో ఆదివాసీలతో సమావేశాలు, చర్చలు, ప్రచారోద్యమాలు ఇలా అనేక రకాలుగా పనిచేయాలి. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విషయాలలో ప్రజలు చాలా అనుభవజ్ఞులు. అలానే గ్రామ కార్యకర్తలు కూడా. నేను వాళ్ళనుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహిళల్ని. ఏ ఉద్యమానికైనా జీవధార మహిళలే. ఆదివాసీ, దళిత, మత్స్యకార, భూమిలేని మహిళలే నర్మదా ఉద్యమానికి పునాది. నాకు స్ఫూర్తిదాయకమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

నర్మదా బచావో ఆందోళన్‌ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 80వ దశాబ్దం మద్యనుంచీ ఈ ఉద్యమం మొదలైంది. అప్పటినుంచి ఎన్నో రకాల పోరాటాలు, ఆందోళనా పద్ధతులు ముందుకు వచ్చాయి. భారీ డ్యాముల వల్ల జరిగే విధ్వంసాన్ని ఈ ఉద్యమం చర్చకు తీసుకు వచ్చింది. పునరావాసంలో తలెత్తే ఎన్నో సమస్యలను, అధికారులుల, రాజకీయ నాయకుల అవినీతిని స్పష్టంగా వెలికి తీయగలిగింది. ఇది కేవలం కొద్ది జనాభాకు సంబంధించిన వ్యవహారం మాత్రం కాదు. నర్మదా లోయ అభివృద్ధి పేరుతో మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తలపెట్టిన డ్యాముల వల్ల కోట్లాదిమంది ప్రజలు నిర్వాసితులవుతున్నారు. నర్మదా లోయ పురావస్తు ప్రాధాన్యత, పురాతన మానవ నాగరికత దెబ్బ తింటుంది. ఎన్నో ఆదివాసీ సమూహాలు చెల్లాచెదురవుతాయి. నది మీద ఆధారపడిన మత్స్యకార సమూహాలు జీవనాధారం కోల్పోతాయి. ఆహార భద్రతనిచ్చే వ్యవసాయ భూములు, పర్వత శ్రేణులు, సహజ వనరులు అన్నీ ధ్వంసం అయిపోతాయి. ఇది చాలా విషాదకరం.

నర్మదా నది చాలా పెద్దది. దాదాపు 1312 కిలోమీటర్ల పైన దూరం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిలో ఎక్కువ భాగం మధ్యప్రదేశ్‌లో ఉంటుంది. తర్వాత మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఉంటుంది. ఇది తమ జీవాడోరి (జీవధార)గా మధ్యప్రదేశ్‌ ప్రజలు భావిస్తారు. నర్మదా నది వారి సంస్కృతిలో భాగం, వారి జీవనాధారం. నది మనుగడే వారి మనుగడ. నది చుట్టూ వారి జీవితాలు పెనవేసుకుని ఉంటాయి. మూడు రాష్ట్రాలలోని 20 జిల్లాల్లో ఈ నది ప్రవహిస్తుంది. నదీ పరీవాహక ప్రాంతం చాలా ఎక్కువ. అభివృద్ధి పేరు మీద ఇక్కడ ఈ నది మీద 3000 చిన్న డ్యాములు, 135 మధ్య తరహా డ్యాములు, 35 పెద్ద డ్యాములు కట్టాలనేది నర్మదా వ్యాలీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ లక్ష్యం. వీటిలో చిన్న తరహా డ్యాముల నిర్మాణం 1970లోనే ప్రారంభమయింది. అయితే ప్రజల వ్యతిరేకతతో మధ్య, పెద్ద డ్యాములను కట్టలేకపోయారు. కట్టినవాటి రిజర్వాయర్లను కూడా నీటితో నింపలేకపోయారు. అనుప్పూర్‌ జిల్లాలో జబల్పూర్‌ దగ్గర మొదలయ్యే నదీ ప్రాంతాన్ని అమర్‌ కంటక్‌ అంటారు. అక్కడి నుంచి మొదలయ్యే డ్యాములు బర్గి, తవ, ఓంకారేశ్వర్‌, ఇందిరాసాగర్‌, వేద, మాన్‌, జోబట్‌, సర్దార్‌ సరోవర్‌ ఇలా ఉంటాయి. ఎక్కువ భాగం ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నాయి. సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ అన్నింటికంటే పెద్దది. ఈ ప్రాజెక్టులో గుజరాత్‌లో ఉండే డ్యామ్‌ ఇదొక్కటే. కానీ దీని కింద మునిగిపోయే భూమి ఎక్కువ భాగం మధ్యప్రదేశ్‌లో 192 గ్రామాలు, ఒక పెద్ద పట్టణం ధర్మపురి, మహారాష్ట్రలో 33 గ్రామాలు, గుజరాత్‌లో 20 గ్రామాలు

ఉంటాయి.

నిజానికి 99వ దశాబ్దంలోనే పైన చెప్పిన అన్ని ప్రాంతాలు మునిగిపోవాల్సింది. కానీ, ఇప్పటికీ అంటే ఈ 2019లో కూడా ఇంకా మనుగడలో ఉన్నాయంటే కారణం కేవలం ప్రజల నిరంతర పోరాటం వల్లనే సాధ్యమైంది. మూడు దశాబ్దాల వైవిధ్యభరితమైన పోరాటం. ప్రాణాలకు తెగించి నిలబడిన ప్రజలు, మరోవైపు న్యాయస్థానాల్లో ఎడతెగకుండా న్యాయం కోసం చేసిన పోరాటాలు, ప్రభుత్వ విధానాల డొల్లతనాన్ని ఎత్తి చూపించే పరిశోధనలు, ఇతర ప్రాంతాల నుంచీ వచ్చిన సంఘీభావం, వీటన్నింటివల్లా సాధ్యమైంది. ఒత్తిడి అన్ని వైపుల నుంచీ పెట్టగలిగినా కానీ కొన్ని గ్రామాలు మునిగి పోయాయి. ఇది ఉద్యమ ప్రారంభ సంవత్సరాలలో డ్యామ్‌ ఎత్తును క్రమక్రమంగా పెంచుతూ పోవటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. గుజరాత్‌, మహారాష్ట్రలలో అన్నీ ఆదివాసీ గ్రామాలే మునిగిపోయాయి. మధ్యప్రదేశ్‌లో కూడా అంతే. డ్యామ్‌ ఎత్తు పెంచుతూ పోయినప్పుడల్లా మరికొన్ని గ్రామాలు మునిగిపోతూ వచ్చాయి.. గ్రామాలు మునిగిపోయినప్పుడల్లా ఆదివాసీ ప్రజల ఆవాసాలు, వ్యవసాయం కొండల పైకి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ వింధ్యా సాత్పూరా పర్వత శ్రేణిలలో ఉంటాయి. అత్యంత విలువైన పర్యావరణ ప్రాంతం. ఆదివాసీల జీవితం చాలా కఠినమైన శారీరక శ్రమతో కూడుకుని ఉంటుంది. ప్రాథమిక అవసరాల కోసం, పనుల కోసం ఎంతో దూరం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. కొండలు ఎక్కి దిగాలి. అంత్యోదయ, ఉపాధి హామీ పని, అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటు కోసం కూడా ఎన్నో పోరాటాలు చేయాల్సి ఉంటుంది. వీటి అమలులో ప్రభుత్వాల అలక్ష్యం చాలా ఎక్కువ. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా వ్యవసాయం చేస్తూనే ఉంటారు. అదే వారి జీవనాధారం.

సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్ట్‌ మొత్తం కట్టాలనుకున్న ఎత్తు 130.68 మీటర్లు. 2006 వరకూ 121.92 మీటర్లు పెంచారు. ఈ ఎత్తే అసలు చాలా పెద్దది. మనం ఊహించలేము దాని విస్తీర్ణాన్ని. నిజానికి ఇక్కడ జరుగుతున్న రాజకీయమేమిటంటే, ఇది ఎంతసేపటికీ పునరావాసానికి సంబంధించిన విషయంగానే బయటకు వస్తుంది కానీ, ఇందులో ఇమిడి ఉన్న అనేక అంశాలను బయటికి రానీయదు. నర్మదా ఆందోళన్‌ అనేక ప్రాథమికమైన అంశాలను లేవనెత్తింది. అసలు ఇంత భారీ ప్రాజెక్టులు అవసరమని ఎవరు నిర్ణయిస్తారు? ఎత్తుని నిర్ణయించేది ఎవరు? వస్తాయని చెబుతున్న నీళ్ళు ఎవరికి పంచాలని అనే దాంట్లో నిర్ణయం ఎవరిది? ఇవి ఎవరికి అవసరం? ఇందులో ఇమిడి ఉన్న ఆర్థిక అంశాలేమిటి? నిర్మాణ వ్యయానికి ప్రతిరూపంగా వచ్చే లాభమేమిటి? ఇలా ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఇంకా వాటిని సంధిస్తూనే ఉంది. అడవులను నిర్మూలించే ప్రాజెక్టులతో వచ్చే పర్యావరణ ముప్పులను, భూకంపాల ప్రమాదాలను అనేక పరిశోధనల ద్వారా బయటకు తీసుకురాగలిగింది.

2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా మోదీ వచ్చాడు. దాదాపు 13 సంవత్సరాల పాటు అక్కడ అధికారంలో

ఉన్నాడు. ఈ పదమూడు సంవత్సరాలు కూడా రిజర్వాయర్‌లో ఉన్న నీళ్ళని కూడా పూర్తిగా వాడలేదు. కాలువల నెట్‌వర్క్‌ని అభివృద్ధి చేయలేదు. కాలువల్లో చిన్న కాలువలు, మధ్యస్థంగా ఉండేవి, చివర్లో ఉండాల్సిన పిల్ల కాలువలు ఇలా ఇంత పెద్ద వ్యవస్థని పట్టించుకోకుండా కేవలం పెద్ద డ్యాములు, పెద్ద కాలువలు కట్టేసి మిగతావాటిని వదిలేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మాణాల కోసం అంటూ కోట్లాది రూపాయలు తీసుకుంటూ కెనాల్‌ నెట్‌వర్క్‌ని నిర్లక్ష్యం చేశారు. చాలా పెద్ద అవినీతి కథ ఇది. 2015 వరకూ కూడా ఇది 30-35% కంటే ఎక్కువ పూర్తి కాలేదు. దీనివల్ల ఉన్న నీళ్ళనే రైతులకు సక్రమంగా అందించలేకపోయారు. కానీ, దాన్ని ఒప్పుకోకుండా డ్యామ్‌ నిర్మాణానికి ఉద్యమం అడ్డు పడుతోందని అందుకే గుజరాత్‌లోని రైతులకు నీళ్ళు అందించలేకపోయామని దుష్ప్రచారం చేయటం, ఉద్యమంలో ఉన్న ప్రజలు అబివృద్ధికి వ్యతిరేకులు అని ప్రచారం చేయటం. నిజానికి ఉన్న నీళ్లను ఎలా వాడుకోవాలనే ప్రణాళిక వాళ్ళ దగ్గర లేదు. అది కూడా ఉద్యమమే చెబుతూ వచ్చింది. వీటన్నింటి గురించి ఎన్నో క్షేత్రస్థాయి పరిశోధనలు, సర్వేలు చేశాం. కనీసం ఉన్న నీళ్ళతో కరెంటుని కూడా ఉత్పత్తి చేయలేకపోయారు. డ్యామ్‌ ఎత్తు పెంచటం అనే ఎజెండా తప్ప వాళ్ళ దగ్గర ఇంకో ఆలోచనే లేదు. అయితే అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడంతో ఇంకేమీ చేయలేకపోయాడు. అయితే గత దశాబ్దం కాలం నుంచీ ప్రజలు కూడా ప్రభుత్వాలు చేస్తున్న మోసాన్ని బాగా గ్రహించగలుగుతున్నారు. ప్రభుత్వ ప్రచారంతో మధ్యప్రదేశ్‌ ప్రజలు వాళ్ళ నీళ్ళు తమకు రాలేదని అనుకుంటున్నా గుజరాత్‌ రైతులు కూడా అసలు జరుగుతున్న మోసాన్ని గ్రహించారు. అక్కడ ఉండే చాలామంది యాక్టివిస్టులు కూడా నర్మదా అంశంలో ముందు మేథా పట్ల కొంత వ్యతిరేకతతో ఉండేవారు. ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని చాలా వరకు మార్చుకున్నారు. ‘నర్మదా కీ లడాయి’ అని ఇన్ని సంవత్సరాల పోరాటం మీద, ప్రభుత్వ వంచన ఎలా జరుగుతోందో మేథా చాలా అద్బుతమైన పాట కూడా రాశారు.

2006 నుంచీ 2014 వరకూ డ్యామ్‌ ఎత్తు పెంచలేకపోయారు. 2014లో మోదీ ప్రధానిగా వచ్చాడు. సత్రా కా సత్రా అని అంటారు మా వాళ్ళు. అంటే పదిహేడు రోజుల్లో వచ్చిన ప్రమాదం. వచ్చిన 17 రోజుల్లోనే డ్యామ్‌ ఎత్తు పెంచాలని నిర్ణయం తీసేసుకుంది ఈ బిజేపీ కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, వాళ్ళు డ్యామ్‌ నిర్మాణాన్ని పెంచడమయితే చేయగలిగారు కానీ 2014 నుంచీ ఇప్పటివరకూ కూడా ఆ గేట్లను కిందికి దించలేక పోయారు. ఈ మొత్తం డ్యామ్‌ చరిత్రంతా కూడా చట్టవిరుద్ధమైన వ్యవహారాలతోనే ఉంటుంది. ఫుల్‌ ఆఫ్‌ ఇల్లీగాలిటీస్‌. ముందు అసలు ఎవర్నయితే పెద్ద సంఖ్యలో నిర్వాసితులని గుర్తించారో వాళ్ళని అకస్మాత్తుగా అధికారికంగా నిర్వాసితుల లెక్కలో నుంచి తీసేశారు. బ్యాక్‌ వాటర్స్‌ లెక్కనంతటినీ తారుమారు చేసేశారు. ఎంత అవినీతి చోటుచేసుకుందో చెప్పలేం. నష్టపరిహారం ఇవ్వడంలో అవినీతి, పునరావాసం అమలు చేయడంలో అవినీతి పెద్ద స్థాయిలో జరిగాయి. మొత్తం ఈ క్రమంలో నిర్ణయం జరిగే విధానమే అవినీతితో కూడుకుంది. వీళ్ళు ఒక్కో వ్యవస్థని ఎలా నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారంటే, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ వంటి ముఖ్యమైనవన్నీ ఈ అవినీతి చట్రంలో భాగమైపోయి నిర్ణయాలను మార్చేశారు. ఇవన్నీ కూడా మనకి కనువిప్పు కలిగించే ఉదాహరణలు. వీళ్ళంతా కలిసి ప్రజల జీవితాలను పేపర్లమీదే తారుమారు చేసేశారు. ఒక పక్క అలా నిర్వాసితుల సంఖ్యను తగ్గించేయడానికి చూశారు. ఇంకో పక్క డ్యామ్‌ ఎత్తు పెంచడానికి నిర్ణయం పేపర్లమీదే జరిగిపోయింది. అయితే, ప్రజల వైపు నుంచీ పట్టుదలగా ఉన్న ఉద్యమం వల్ల ఇప్పటికీ కూడా ఆ గేట్లను కిందికి దించడం అనేది సాధ్యమే కాలేదు.

మరొక బాధాకరమైన విషయమేంటంటే, అక్రమంగా అనేక ఇసుక తవ్వకాలు జరిగిపోతున్నాయి. దీంతో నదీ పరీవాహక ప్రాంతమంతా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. నగరీకరణ పెరిగే కొద్దీ ఇసుక అక్రమ తవ్వకాలు పెరుగుతాయి. ఉద్యమంలో కూడా ఇలా కొత్తగా వచ్చే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే వాటిమీద కూడా పోరాట రూపాలు ఏర్పర్చుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. ఈ తవ్వకాలను అడ్డుకున్నందుకు మా కార్యకర్తలమీద ఇసుక మాఫియా దాడి కూడా చేశారు. మా ఆఫీసుని ధ్వంసం చేశారు. ఇసుక తవ్వకాలను, వాటిని చేరవేసే లారీలను అడ్డుకోవడం ఇలా వీటన్నింటితో మా సమయం దానికి చాలా కేటాయించాల్సి వచ్చింది. ఈ పని ఎంత సీరియస్‌గా చేశామంటే, సర్దార్‌ సరోవర్‌ ప్రాంతంలో ఇసుక తవ్వకాలను కొంతమేరకు ఆపగలిగాం. ఒక రోజులో 200 పైన తరలించే ఇసుక లారీల సంఖ్య మా పోరాటం వల్ల 40-50 వరకూ కుదించబడ్డాయి. ఇదంతా కూడా మాకు చాలా పెద్ద సవాలుగా నిలిచింది. మేము వాటిని తగ్గించడానికి ిప్రయత్నించడం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లారీల సంఖ్య పెరగడం, మేము ఆందోళనకు దిగటం అంతా ఒక క్రమంలో జరుగుతూ ఉండేవి. ఈ ఇసుక తవ్వకాలతో నదే ఇప్పుడు ఎంతో దయనీయమైన పరిస్థితిలోకి నెట్టబడింది.

గ్రామాలు మునిగిపోవడం అనేది ఒకప్పుడు చాలా పెద్ద సమస్య. జనాల్ని భయపెట్టి ముంపునకు గురిచేయాలంటే నిర్మాణాలు జరగాలి. పైనున్న డ్యామ్‌లకు నీళ్ళు వదిలి అప్పుడు ఈ గేట్లు కిందకి దించాలి. ఇదంతా ఇప్పుడు ఎందుకు జరగడంలేదంటే ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత. 2006-2014 వరకూ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉండేది. వాళ్ళేమీ అంత గొప్పవాళ్ళు కాదు. వాళ్ళ పాలనలోనే ఈ అవినీతి కొద్ది స్థాయిలో మొదలైంది. అయితే, యూపీఏ ప్రభుత్వంలో ప్రమాదం మరీ మెడమీద కత్తిలాగా లేదు. అంతేకాకుండా, యూపీఏ సమయంలో పునరావాసం గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది ముఖ్యమైన అంశం. ఆ తర్వాత వచ్చిన బిజెపి పాలన అవినీతిని వ్యవస్థీకృతం చేసి వికృత రూపంలోకి మార్చింది. అధికారంలోకి రావడం రావటమే నిర్మాణాన్ని మొదలుపెట్టేశారు.

అన్ని డ్యామ్‌ ప్రదేశాలలో మొదట జరిగేది ఆర్థికపరమైన స్కాములే. అన్ని ప్రదేశాల నుంచీ ఒకటే రకమైన ఫిర్యాదులు వచ్చేవి. వీటన్నింటి నుంచి మేము నేర్చుకున్నదేమిటంటే, ప్రతి గ్రామంలో కింది స్థాయి వరకూ పనిచేయాల్సిందే, ప్రతి ఒక్కరికీ సమాచారం అందాల్సిందే. మా ఉనికి కనీసం 150 నుంచీ 175 గ్రామాల్లో చురుకుగా ఉండేది. మిగతా గ్రామాలు కూడా కలిసి వస్తూ ఉండేవి. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ కొద్దిపాటి మానవ, ఆర్థిక వనరులతోనే ఉద్యమాన్ని నడిపేవాళ్ళం. ఏదీ కూడా ఎన్జీఓ పని కాదు. మేథా చాలా సమయం దీనికోసమే పెట్టేవారు.

పునరావాసం కోసం వెయ్యి కోట్లు విడుదల అయితే ప్రజల వరకూ చేరింది చాలా తక్కువ. అవినీతి మయం. కాంట్రాక్టర్‌లను పెంచటానికి ఉపయోగపడ్డాయి. అవసరమైన చోట కాలువలు తవ్వలేదు, అనవసరమైన చోట తవ్వారు. కాంట్రాక్టర్ల లాభం కోసం వేలాది ఎకరాల సారవంతమైన పంట భూములను నాశనం చేశారు. పోరాటం వల్లనే దీనిమీద జస్టిస్‌ ఝా కమిషన్‌ ఏర్పాటయింది. వేలాది మంది రైతులు ఎక్కడెక్కడ అవినీతి జరుగుతోందో ప్రత్యక్షంగా వాంగ్మూలాలు ఇచ్చారు. ఈ అవినీతిని వెలికి తీయడానికి అనేక విధాలుగా పోరాటం చేయాల్సి వచ్చింది.

మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, 2000, 2005 సంవత్సరాలలో సుప్రీంకోర్టు రెండు ముఖ్యమైన తీర్పులు ఇచ్చింది. భారీ డ్యాములు కట్టే ప్రణాళిక ముందుగానే, అక్కడ ప్రభావితమయ్యే ప్రజలకు, అలానే పర్యావరణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పనిసరిగా చూపించాలని స్పష్టంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని ఆధారం చేసుకుని మరెన్నో పోరాటాలను ముందుకి తీసుకెళ్ళగలిగాం. బడవాని అనే ప్రాంతంలో జాగృతి ఆదివాసీ సంఘటన్‌ అని సంఘం ఉండేది. వారితో కలిసి ఆరోగ్యం, జీవనోపాధులు వంటి అనేక అంశాల మీద నర్మదా బచావో ఆందోళనగా కలిసి పనిచేసేవాళ్ళం. కలిసి వచ్చే స్థానిక సంఘాలతో పనిచేయడమనేది ముఖ్యంగా ఉండేది. బ్రిటిష్‌ కాలం నాటి నిర్బంధ పూరిత భూసేకరణ చట్టంలో మార్పులు జరిగి 2013 భూసేకరణ, పునరావాస హక్కు చట్టం వచ్చిందంటే దానికి కారణం నర్మదా బచావో లాంటి అనేక ఉద్యమాల వల్లనే సాధ్యమయిందని గుర్తుంచుకోవాలి.

ఇక్కడ నిరక్షరాస్యత చాలా ఎక్కువ. కొద్దిపాటి చదువుకున్నవాళ్ళు కూడా హిందీ రాసేటప్పుడు ఎన్నో తప్పులతో రాసేవాళ్ళు. పాఠశాలల పరిస్థితి దయనీయం. ఆదివాసీ ప్రాంతాలయితే అసలు చెప్పనవసరం లేదు. మేము కేవలం భూ నిర్వాసితుల సమస్యనే కాకుండా ఈ అంశాల మీద కూడా పనిచేశాము. ఆదివాసీ ప్రాంతాలలో గ్రామాలు చాలా విసిరేసినట్లు ఉంటాయి. టీచర్లు అంత దూరం వెళ్ళరు, సౌకర్యాలు ఉండవు. అన్ని రకాల సమస్యలు ఉండేవి. అంగన్వాడీ, స్కూలు ఇలా అన్ని వ్యవస్థలోనూ అవినీతి స్పష్టంగా కనిపిస్తూ ఉండేది. ఇక వైద్య సౌకర్యాలు అంతంత మాత్రం. ఇలా ప్రజల నిత్య జీవితంలో ఉండే అన్ని సమస్యల మీదా పనిని సమన్వయం చేస్తూ

ఉండేవాళ్ళం. ఇలాంటి నేపథ్యంలో పునరావాసం అనేది చాలా పెద్ద సమస్య. నర్మదా ఆందోళన్‌లో ప్రారంభ సమయాల్లో భూమికి భూమి అనే నినాదం ఉండేది. ముంపులో ఎంత భూమి కోల్పోతే అంత భూమి ఇవ్వాలనేది ఆ డిమాండ్‌. అలా కొంతమందికి భూమికి భూమి వచ్చింది. ఇదేమంత సులభం కాలేదు. చాలా గొడవలు వచ్చాయి. అప్పుడు ఉద్యమం చాలా బలంగా, ఉధృతంగా ఉండేది. మొదట్లో డ్యామ్‌ని 121 మీటర్ల ఎత్తు వరకూ అలా తొందర తొందరగా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ క్రమంలో కొంతమందికి భూమి ఇచ్చారు. దాదాపు పధ్నాలుగున్నర వేల మంది భూమిని పొందగలిగారు. ఇది కేవలం ఉద్యమం ఉండడంవల్ల మాత్రమే సాధ్యమయింది. ఇది చాలా ముఖ్యమైనది. కాలువల తవ్వకాలలో భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా భూములు ఇప్పించగలిగాము. దీనిలో భూమిలేని కూలీలు, మత్స్యకారులు ఇలా అనేకమంది ఉన్నారు. భూమికి భూమి, ఇల్లు కట్టించడం అన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యమైన అంశాలు. నిజానికి ఇవన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం పేపర్లలో చెప్పినప్పటికీ వాటిని వాస్తవంగా అమల్లోకి తీసుకు రావటం అనేది అనేక సవాళ్ళతో కూడుకున్నది. వీటికోసం కేటాయించిన నిధులను సకాలంలో విడుదలయ్యేలా చూడటం, అవినీతి జరగకుండా అప్రమత్తంగా ఉండడం వంటి ఎన్నో సవాళ్ళు ఉద్యమం ముందు ఉండేవి. అయినా కానీ రాజకీయ, అధికార వర్గాల నుంచీ అవినీతి వ్యవస్థీకృతంగా ఉండేది. మేము చేసిందేమిటంటే, వీటిని అరికట్టేలా ప్రజలే అప్రమత్తంగా పర్యవేక్షించేలా చేయడం. మొత్తం గ్రామీణ ప్రజలే, ఈ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు.

ఇదంతా మొదటి విడత ఉద్యమంలో జరిగిన అంశాలు. రెండో విడతలో 2006 నుంచీ పునరావాసం గురించి అప్పటివరకూ ఉన్న చట్టాల బలాన్ని నీరుగార్చడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

ఇక్కడ కొంతమంది గ్రామీణ కార్యకర్తల గురించి గుర్తుచేసుకోవాలి. చాలా మంది ఉన్నారు కానీ, కొంతమంది గురించి ప్రస్తావిస్తాను. సీతారాం బాబా ఎనభై ఏళ్ళ వృద్ధుడు. ఎంత పెద్ద మీటింగ్‌ అవనీ, ఎంతమంది మహామహులైన అధికారులు, నాయకులు ఉండనీ, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు చేస్తున్న మోసాన్ని కథలు కథలుగా హాస్యపూర్వకంగా చెప్పేవాడు. మన్సారం భయ్యా ప్రజల్ని ఎంత బాగా సమీకరించేవాడంటే, అతని మీద జనాలకు అంత గురి. కమిలి దీదీ, రతన్‌ భాయి, సుద్దాస్‌ భయ్యా,, మత్స్యకార సమూహం నుంచీ షానా దీదీ ఇలా వీరందరూ ఇంకా అనేకమంది ఈ మొత్తం పోరాటాల విస్తృత రాజకీయాలను అర్థం చేసుకుంటూ వాటిని స్థానిక అంశాలతో సమన్వయం చేస్తూ ప్రజలతో నిరంతరం కలిసి పనిచేస్తూ ఉండేవారు. వీరందరిలో కూడా అదే స్ఫూర్తి, చైతన్యం బాగా ఎక్కువ. ఆ తర్వాతి కాలంలో నన్ను మీరా దీదీగా గుర్తించి, నన్ను అర్థం చేసుకుని నా భావాలకు సామాజిక ఆమోదాన్ని తెలిపి, భరోసాగా నిలబడిన వాళ్ళలో ఈ గ్రామీణ, మత్స్యకార, ఆదివాసీ అక్కచెల్లెళ్ళు చాలా ముఖ్య పాత్రను తీసుకున్నారు.

మీరా సంఘమిత్రగా… నేను!

2019 సంవత్సరం భాషా మెమోరియల్‌ అవార్డును జులై 21న అనకాపల్లిలో అందుకోబోతోంది మీరా సంఘమిత్ర.

పుట్టుకతో నాకివ్వబడిన అస్థిత్వం నుంచి నన్ను నేను స్వతంత్రంగా నా ఇష్టపూర్వకంగా మీరా సంఘమిత్రగా ఆవిష్కరించుకోవటం కోసం లెక్కలేనన్ని సవాళ్ళను ఎదుర్కొన్నాను. సమాజం నుంచే కాదు, నా నుంచి నేను కూడా! నాతో పాటు అనేక సవాళ్ళను అమ్మ కూడా ఎదుర్కొంది. ఇప్పటికీ ఇద్దరం ఇంకా కొత్త కొత్త సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నాం!

నర్మదా ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని విషయాలలో పూర్తి స్థాయిలో పనిచేయడంతో చిన్నప్పటి నుంచి నాలో చెలరేగుతున్న లోలోపలి భావాలను లోపల ఎక్కడో దాచేశాను. కానీ, అది ఎంతోకాలం సాగలేదు. 2012లో నా లోపలి భూతం మళ్లీ వెనక్కి తిరిగి వచ్చింది. ్‌ష్ట్రవ స్త్రష్ట్రశీర్‌ శీట ఎవరవశ్రీట షaఎవ పaషస ్‌శీ ఎవ. రావడం కూడా చాలా తీవ్రతతో వచ్చింది. భూతం అని నేను దీన్ని నెగటివ్‌ అర్థంతో అనటం లేదు. ఈ భూతం చిన్నప్పటి నుంచి నాలోనే ఉంది. ఎప్పటికప్పుడు దాన్ని దాచేస్తూ వచ్చాను. ప్రతిసారీ ఒక యుద్దం జరిగేది. అయితే ఇప్పుడు వచ్చినదాన్ని ఇంక నేను దాచలేకపోయాను. ఇక యుద్ధాన్ని, దాచడానికి కాదు బయటకు చూపించడానికే చేయాలనుకున్నాను.

నిజానికి, 2006-2007 ప్రాంతంలోనే నన్ను నేను బయట ప్రపంచానికి ఒక పద్ధతిలో ఆవిష్కరించుకునేదాన్ని. అప్పుడే ఈ-మెయిల్‌ వాడకం పెరుగుతోంది. నాకు అప్పుడు వaష్ట్రశీశీ ఎaఱశ్రీ ఱస

ఉండేది. ఎవరికైనా మెయిల్‌ పెట్టినప్పుడు కింద సంతకం పెడతాం కదా, నేను ఒక ఎరుకతోనే వశీబతీఃర ుబవవతీటబశ్రీశ్రీవ అని రాసేదాన్ని. అది నన్ను నేను చెప్పుకునే ఒక పద్దతిగా ఎంచుకున్నాను.

ఆ తర్వాత, నేను 2008 మార్చిలో నర్మదా ఉద్యమంలోకి వెళ్ళిన కొద్ది నెలలకే కేరళలో జరుగుతున్న చీూూవీ జాతీయ సదస్సుకి మొదటిసారి వెళ్ళాను. అప్పుడు ట్రెయిన్‌లో నాతో పాటు గుజరాత్‌ నుంచీ పర్యావరణ సురక్షా సమితిలో పనిచేసే ఆనంద్‌ మార్గొంకర్‌, మహాలక్ష్మి నుంచి ఆహార హక్కు ఉద్యమంలో ఉన్న ముక్త శ్రీ వాత్సవ ఉన్నారు. వాళ్ళిద్దరూ చీూూవీ లో సీనియర్‌ సామాజిక కార్యకర్తలు. ఇద్దరూ సెన్సిటివ్‌గా ఉండేవారు. వారితో నేను నా లోపలి ఆలోచనలను పంచుకున్నాను. అలా నా అంతరంగ ఆలోచనలను కొద్దికొద్గిగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. 2012లో నా లోపలి ఆ భావాలు తీవ్రమైపోయాయి. ముందు అమ్మతో చెప్పలేదు. ఎందుకంటే అమ్మతో నేను దగ్గరగా లేను. ఫోన్‌లో చెప్పే విషయం కాదనిపించింది. చెప్పటానికి అనువైన ప్రదేశం, ఏకాంతం కూడా ఎంతో అవసరం. నేను అమ్మకు దూరంగా ఉండడంతో అది సాధ్యం కాలేదు. తర్వాత మళ్ళీ మేథాతో కూడా మాట్లాడాను. అందరి నుంచీ ఒక మిశ్రమ స్పందన వచ్చింది. ఎవ్వరూ కూడా మొత్తంగా ఒకేసారి అంగీకరించలేదు కానీ నన్ను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నించారు.

ఆదివాసీ కార్యకర్తలు కైలాష్‌ భాయి అవస్త్త్య, దేవరాజ్‌ భాయి, ముఖేష్‌ భాయి, కమలినీ దీదీ… ఇలా అందరికీ నా భవిష్యత్‌ జీవితం మీద ఒక ఆందోళన ఉండేది. ఈ మిశ్రమ స్పందన అప్పటికీ ఈ అంశాల మీద ఎప్పుడూ ఏ చర్చ జరగకపోవటం వల్లనే అని నాకు అనిపించింది. ప్రతి ఒక్కరూ నా పట్ల ఎంతో ఆప్యాయంగా, మానవీయంగా ఉండేవారు. అప్పటికే ఉద్యమంలో అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిని నేను. అలాగే ఉద్యమానికి బాగా పనికొచ్చిన వ్యక్తిని కూడా! ఉద్యమానికి సంబంధించి నేను ఏమన్నా చెబితే అర్థం చేసుకునే వాతావరణమూ ఉంది.

అయితే ఈ విషయంలో నేను చెప్పింది విన్నారు కానీ, దాన్ని వెంటనే అంగీకరించలేక పోయారనిపించింది. కొంతమంది ”ఇలాంటి అంశాలు విన్నాము, ఫలానా గ్రామంలో కూడా కొంతమంది ఇలానే ఉన్నారు” అంటూ చర్చించేవారు. అలానే నాకూ చెప్పేవారు. మరికొంతమంది సహానుభూతితో అర్థం చేసుకుంటున్నట్లు ఉండేవారు. వేసుకునే బట్టల విషయంలో, ‘నాకు ఇలాంటి బట్టలు వేసుకోవడం నచ్చడం లేదు, నేను ఇంక వీటిని వేసుకోను’ అని చెప్పినప్పుడు అది వాళ్ళకి, నాకు పెద్ద సవాలుగా అనిపించింది.

ఎందుకంటే ఒక ఉద్యమంలో చాలాకాలం పాటు ఒక అస్థిత్వంతో పరిచయమై, అన్ని ప్రదేశాల్లో అంటే మీడియా, పోలీస్‌ స్టేషన్‌, కోర్టు, గ్రామాలు… ఇలా అన్ని చోట్లా ఇప్పుడు నా అస్థిత్వం మారుతుందంటే నిజంగా పెద్ద సవాలే! ఇది నిజంగా అసలు ఒక విషయమా, లేక కాదా, అసలేమిటిది? ఈ కొత్త పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలి? మిగిలినవాళ్ళకే కాదు, నాకు కూడా ఇదంతా ఒక సవాలును ఎదుర్కొనే క్రమమే! మేథా చాలా మంచి మనిషి. ఒక గాంధియన్‌ భావజాలంతో, సోషలిస్ట్‌ మనస్తత్వంతో ఉండే వ్యక్తి. అలాంటి తనకే నా నిర్ణయాన్ని అంగీకరించడానికి బాగా సమయం పట్టింది. నా గురించి ఎంతో ఆరాటపడింది. అనేకమందితో చర్చించింది. ఎందుకంటే ఒక ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న తనమీద ఈ మార్పుని వివరించాల్సిన బాధ్యత ఉంటుంది కదా! నన్ను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. ఇది హార్మోన్స్‌తో వచ్చే సమస్య అని, తాత్కాలికమైన పరిస్థితి అని, తర్వాత నీకు బాగైపోతుంది అని నన్ను సముదాయించడానికి, నన్ను ఒప్పించడానికి ప్రయత్నించింది.

కానీ, నేను ఎప్పుడైతే నా నిర్ణయాన్ని గట్టిగా చెప్పడానికి ప్రయత్నిస్తూ వచ్చానో, ఎవరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. యాక్టివిస్టులుగా ఉండే మగవాళ్ళకి ఇది పెద్ద సవాలు. ముందు అంగీకరించలేకపోయారు. అలా అని నా పట్ల ఎవ్వరూ వ్యతిరేకత చూపించలేదు. ఎవరన్నా నన్ను ప్రభావితం చేస్తున్నారేమో, ఇది తాత్కాలికం, ఎక్కువ కాలం ఇట్లా ఉండదు అనే చర్చలన్నీ వచ్చేవి. దీనివలన

ఉద్యమానికి నష్టం అనే చర్చ కూడా తీసుకువచ్చారు. అప్పుడు నేను నాకెదురైన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తూ ప్రశ్నలు-జవాబుల రూపంలో ఒక పెద్ద నోట్‌ రాశాను.

నన్ను నేను సమర్ధించుకోవటం అంత అవసరం లేనప్పటికీ, ఈ రకమైన ప్రశ్నలు సమాజంలో ఎప్పుడూ ఎదురయ్యే విషయాలే కాబట్టి, నాకు తోచిన విధంగా వాటికి సమాధానాలు ఇచ్చుకుంటూ రాశాను. నేను మీరాగా ఎలా ఉండబోతున్నాను, నా అస్థిత్వం ఉద్యమంలో ఎలాంటి విషయాలని ముందుకి తీసుకురాబోతోంది, ప్రజలతో, నిర్వాసితులతో పనిచేస్తున్నప్పుడు, ఆ విషయాలకీ దీనికీ ఎలాంటి సంబంధం ఉంటుంది… ఇలా వీటిని చర్చిస్తూ, నా అస్థిత్వం

ఉద్యమానికి సంఘర్షణ కాదని చెబుతూ రాశాను. నిజానికి నేను అంతకుముందు కంటే ఇప్పుడు మీరాగా ఇంకా బాగా పనిచేయగలుగుతాను. ఎందుకంటే ఇదే నా అసలు అస్థిత్వం. కానీ, సమాజం సృష్టించిన జెండర్‌ మూసల్లో నా శరీరం కనిపిస్తోంది. అది నాకు నచ్చటం లేదు. కాబట్టి, నేను నా శారీరక రూపురేఖలను నా ఆలోచనలకు అనుగుణంగానే మార్చుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు ఆత్మవిశ్వాసం ఉంది. ఇదే తెలియచెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశాను.

వాటి మీద అనేక చర్చలు జరిగాయి. మీరు మీ భూమి కోసం చేసేది సత్యాగ్రహం కదా, అలానే నేను నా అస్థిత్వం కోసం చేసేది కూడా సత్యాగ్రహమే అని వాదించాను. ‘సత్య కేలియే ఆగ్రహ్‌’, ‘యే మేరే సత్య కేలియే ఆగ్రహ్‌’. అప్పటికి అమ్మ రెండు మూడు సార్లు అక్కడికి వచ్చింది. నాన్న కూడా వచ్చారు. నాన్నకు నా నిర్ణయం నచ్చలేదు. మామూలుగానే చిన్నప్పటి నుంచీ ఆయనకు నా విధానం పట్ల ఇష్టం ఉండేది కాదు. అయితే అమ్మ ఊరుకోలేదు. మన బిడ్డను మనం ఎట్లా వదిలేస్తాం అని వెంటపడి ఆయన్ని కూడా తీసుకు వచ్చింది. కానీ ఇప్పటికీ ఆయన వాస్తవాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా లేరు. నా విషయమై చర్చించడానికి మొత్తం ఉద్యమంలో ఉండే ముఖ్యమైన వారందరితో (కోర్‌ టీం) ఒక పెద్ద సమావేశం జరిగింది. ‘ఏ కార్యకర్త పెహలే ఓ ఐడెంటిటీ థా, అబ్‌ ఏ మీరా కి ఐడెంటిటీ హై’ అని చెప్పటం కోసం జరిగిన సమావేశం అది. గ్రామస్థాయి నుంచీ ప్రతి ఒక్కరూ దానికి హాజరయ్యారు. 50-60 మందిదాకా ఉంటాం. ఆ మీటింగ్‌లో అమ్మ కూడా ఉంది. ఎక్కువమంది మగవాళ్ళే. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. దాదాపు ఐదారు గంటల సమావేశం సీరియస్‌గా జరిగింది. అన్ని రకాల సందిగ్ధతలూ అందులో చర్చకు వచ్చాయి. ‘అసలు అలా ఉండడం సాధ్యమా? ఇది సహజమేనా’ అనే దగ్గరి నుంచీ చర్చలు జరిగాయి. ‘నువ్వు ఇప్పటికిప్పుడు మీరాగా ఎలా ఉంటావు, పోనీ ఒక సంవత్సరం, రెండేళ్ళు మీ ఊరు వెళ్ళిపోయి పూర్తిగా మార్పు చేసుకుని ఒక కొత్త వ్యక్తిగా మళ్ళీ రా అని కొంతమంది; నువ్వు మీరావే, కానీ ఇలా ఆడవాళ్ళ బట్టలు వేసుకోకుండా, మామూలు ప్యాంటు షర్టు వేసుకొమ్మని కొందరు చెప్పారు. ఇలాగ కూడా చర్చ జరిగింది.

కొంతమంది బొట్టు పెట్టుకోవద్దన్నారు. మరికొంతమంది దుపట్టా వేసుకోవద్దన్నారు. నిజానికి నేను ఆ మీటింగులో ఒకరి అనుమతి కోసం అక్కడ కూర్చోలేదు. అక్కడ మేథా, అమ్మ ఇద్దరూ ఉన్నారు. అయితే, ఎందుకు కూర్చోవాలనుకున్నానంటే, ఈ ట్రాన్సిషన్‌ అన్న క్రమం, ముఖ్యంగా ఇలాంటి ఉద్యమ నేపథ్యంలో ఉన్నప్పుడు, ఇది కేవలం నా ఒక్కదాని విషయంగానే కాకుండా, అనేకమంది జీవితాలతో వివిధ స్థాయిల్లో ముడిపడిన అంశం. నా గురించి నేను రాడికల్‌గా అనుకున్నా కానీ, నా జీవితం ఒక రకంగా మిశ్రమ క్రమంలో ఉంది. ఈ మార్పుని సాఫీగా అందరూ అర్థం చేసుకునే విధంగా చర్చించడం అవసరం అనిపించింది. ఒకరకంగా అది నా బాధ్యతే. అంతే కాకుండా ఇది కేవలం నా వ్యక్తిగతమైన విషయంగా అనుకోవడం లేదు. సమూహంతో ముడిపడిన మార్పు కూడా. నా జీవితంలో నర్మదా ఉద్యమానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నాతోపాటు అనేకమంది ఉన్నారు. నాలో జరిగే ఈ మార్పుని వాళ్ళందరూ అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యమని భావించాను. చర్చకు పెట్టడం, ప్రశ్నించడం, ఒప్పించడం, రకరకాల భిన్నవాదనలు వినడం, ఒక ముగింపుకి రావడం అన్నీ కూడా ఒక సమూహపు ప్రయాణంలో భాగం. నిజానికి జెండర్‌కి సంబంధించి, ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్‌ విషయాలకి సంబంధించి నగర ప్రాంతాలలో అర్థం చేసుకునే వాతావరణం ఉంటుందని, ఒక స్పేస్‌ ఉంటుందని భావిస్తాం. కానీ నాకు బలమైన సహకారం కొండ ప్రాంతాల్లో ఉండే దళిత, మత్స్యకార మహిళల నుంచి ప్రధానంగా వచ్చింది. వాళ్ళంతా కూడా పేద మహిళలు. ‘ఠీక్‌ హై, తేరీ జిందగీ, తేరీ మర్జీ, ఛలో తుమ్‌ ఆజ్‌సే హమారా మీరా దీదీ హై’ అని వెంటనే చెప్పేశారు. వీళ్ళెవరూ కూడా నన్ను ఏ ప్రశ్నలూ వేయలేదు. వేసినదంతా వేరేవాళ్ళు. మేథా కూడా నన్ను మీరా అని పిలవడానికి దాదాపు తొమ్మిది నెలలు తీసుకుంది. తను నిజానికి నా విషయంలో ఎంతో కష్టపడింది. నాతో తనకి ఒక ఎమోషనల్‌ బాండింగ్‌ ఉంది. నా పని పట్ల గౌరవంగా ఉండేది. కానీ,

ఉద్యమంలో ఉన్న ఇతరులకి, సానుభూతి పరులకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనమీదే ఉండింది. ‘యే క్యా నాటక్‌ చల్‌ రహా హై’ అనే వాళ్ళకి సమాధానం చెప్పి ఒప్పించవలసిన బాధ్యత తనదే అయిపోయింది. ఈ అంశాన్ని ఎలా పరిష్కరించడం అన్నది తనకి పెద్ద సవాలుగా అయిపోయింది. కొన్ని నెలల పాటు అసంకల్పితంగా నన్ను నా పేరుతోనే పిలిచేది. తర్వాత కొన్ని నెలలపాటు పేరు లేకుండానే మాట్లాడేది. తన నోటినుంచీ వెంటనే నా కొత్త పేరు రాలేదు. తర్వాత వేలాదిమంది హాజరయిన ఒక పెద్ద బహిరంగ సభలో ‘హమారీ మీరా బెహన్‌’ అని పరిచయం చేసింది. వ్యక్తిగతంగా కన్నా పబ్లిక్‌లో నన్ను నా వ్యక్తిత్వాన్ని ఎలా నిలబెట్టాలి అని ఆలోచిస్తూ ఉందనుకుంటా! ఆ విధంగా తను స్పష్టంగా ఉండేది. ఇక అప్పటినుంచీ నన్ను మీరా గానే పిలవడం మొదలుపెట్టింది.

ఇది ఒకరకంగా నా వ్యక్తిగత, రాజకీయ ప్రయాణంలో ఎదురైన సవాళ్ళకు రాతపూర్వకంగా నేను ఇచ్చిన రూపం ఈ ప్రశ్నలు-జవాబులు. నేను ఒక రాజకీయపరమైన వ్యక్తిగా వివిధ ప్రజా ఉద్యమాలను అర్థం చేసుకోవటానికి ఈ విషయంలో నేను ఎంచుకున్న ఈ ప్రయాణం నాకు చాలా ఉపయోగపడింది.

నేను ఆదివాసీ ప్రాంతాల్లో సౌకర్యంగా ఉండేదాన్ని. నేను ఈ విషయాన్ని రొమాంటిసైజ్‌ చేయటం లేదు. కానీ, నగర ప్రాంతాల కన్నా కూడా అక్కడ జెండర్‌ పట్ల స్పృహ, స్పేస్‌, సున్నితత్వం వేరే విధంగా ఉంటాయి. నేను ఈ విషయంలో అక్కడ ఏ అసౌకర్యానికి గురి కాలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు కనీసం ఐదారు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చేది. అందరూ స్నేహంగా ఉండేవారు.

అందరి జీవితాల్లో పితృస్వామ్యం అనేది వివిధ రకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భూతం లాంటిది. ట్రాన్స్‌ వ్యకులుగా మాకైతే దానితో పోరాటం ఒక పెద్ద సవాలు. సిస్‌ జెండర్‌ వ్యక్తులుగా (స్త్రీలైనా, పురుషులైనా) సామాజికంగా ఆశించే అంశాలు ఉంటాయి. అంటే అబ్బాయిగా నువ్వు ఇలానే జీవితాంతం ఉండాలి అనే నిబంధన ఉంటుంది. అమ్మాయిలకు వేరే విధంగా! ప్రవర్తనా నియమావళులు అనేకం ఉంటాయి. దానివల్లనే సెక్సువాలిటీ కూడా రూపుదిద్దుకుంటుంది. బయటకు ఒక స్త్రీగానో లేదా పురుషుడుగానో గుర్తించబడి, ఆపాదించబడిన ఆ అస్థిత్వంలో ఇమడలేక నలిగిపోతారు. ముఖ్యంగా, వైవాహిక వ్యవస్థలో ఇమడలేక ఎంతో సంఘర్షణకు లోనవుతారు. ఇష్టం ఉన్నా లేకపోయినా గానీ అవతలి జెండర్‌ వ్యక్తిని మాత్రమే పెళ్ళిచేసుకోవాలనే ఒత్తిడి

ఉంటుంది. దీనివల్ల సంతోషం లేని సంబంధాలలో ఉండాల్సి వస్తుంది.

2012 నుంచీ నాలోలోపల తిరుగుతున్న ఆలోచనలకు ఒక స్పష్టమైన రూపాన్ని ఇవ్వటానికి ప్రయత్నించాను. అప్పటినుంచీ నా జీవితంలో ఒక కొత్త ప్రయాణం మొదలైంది. నర్మదా ఉద్యమ కార్యకర్తలతో మాట్లాడటం, వారితో ఒక చర్చలోకి వెళ్ళడం అంతా కూడా నన్ను నేను ఆవిష్కరించుకోవటానికి చాలా దోహదపడ్డాయి. అలానే బెంగుళూరులో ఉండే నా ట్రాన్స్‌ మెన్‌ స్నేహితులు జీ, బిట్టు ఇద్దరూ కూడా నాలో ఉన్న ప్రశ్నలకు ఒక రూపాన్ని ఇవ్వడానికి ఎంతో సహాయం చేశారు. నర్మదా ఉద్యమం నుంచీ నేను ఇక పూర్తి కాలం చీూూవీ కార్యకర్తగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ముందుగా వెళ్ళింది వీళ్ళిద్దరి దగ్గరికే. అక్కడే దాదాపు నెల రోజులు ఉన్నాను. ఆ తర్వాతే అమ్మ దగ్గరికి వచ్చాను.

విభిన్నమైన ప్రజా ఉద్యమాలను ఒక దగ్గరకు చేర్చే చీూూవీ ఒక విశాల వేదిక. వివక్ష లేని సమానత, ప్రజాస్వామ్య, మానవీయ, న్యాయబద్ధ విలువతో ఉండే పోరాటాలకు సంఘీభావంగా పనిచేస్తూ వాటిని నిరంతరం కలుపుకు వెళ్ళే వేదిక ఇది. చీూూవీ ఒక వ్యక్తి నడిపించే ఉద్యమం కాదు. ఒక సమూహ ఆచరణ. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దేశంలోని వివిధ ప్రాంతాలలో జాతీయ సదస్సులు నిర్వహిస్తూ ప్రజా ఉద్యమాలను కలుపుకు వెళ్తుంది. అందులో జెండర్‌ అంశాలు, అందులో కూడా అణగారిన, అంచుల్లోకి నెట్టివేయబడిన సమూహాల పోరాటాలు అత్యంత ముఖ్యమైనవి. ప్రారంభంలో ఈ అంశాల పట్ల పెద్దగా స్పష్టత లేనప్పటికీ పనిచేస్తున్న క్రమంలో ఈ సమూహాలన్నింటి హక్కుల కోసం బలమైన గొంతుకగా పనిచేస్తున్నాము. అలాంటి స్పేస్‌ ఉంది కాబట్టే నాలాంటి వ్యక్తులం మా అస్థిత్వంతో బహిరంగంగా ఉద్యమంలో ప్రధాన భాగస్వామ్యం తీసుకోగలుగుతున్నాము. యువ సంవాద్‌ పేరుతో దేశంలో సామాజిక అంశాలపై పనిచేస్తున్న యువతరాన్ని ఒక వేదిక మీదకు తీసుకువచ్చి వారు పనిచేస్తున్న అంశాల మధ్య ఒక సారూప్యతను తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నాము. అన్ని రాష్ట్రాలలోనూ ఈ యువ సంవాద్‌లను నిర్వహిస్తున్నాము. విభిన్న అస్థిత్వాలతో ట్రాన్స్‌ వ్యక్తులుగా ఉన్న మేము మనుషులందరిలో ఒక భాగం.మా అస్థిత్వాన్ని గుర్తించ నిరాకరించడమంటే అది స్త్రీలుగా మా మీద జరుగుతున్న హింసే అవుతుంది. జల్‌, జంగల్‌, జమీన్‌ అనేవి ఎంతో ముఖ్యమైన అంశాలు. అలానే జిందగీ అంటే ప్రతి జీవితం కూడా ముఖ్యమైనదే.

స్వతంత్రంగా, సహజంగా ప్రాథమిక హక్కులతో, గౌరవంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉండాలి. అందుకోసమే ఈ ప్రయాణం, ఉద్యమం, పోరాటం. ఎక్కడైనా, ఎప్పుడైనా భయంలేని, గౌరవంతో కూడిన ఒక మనిషిగా, ఒక స్త్రీగా జీవించే హక్కు కోసం నిరంతరం విభిన్న ప్రజా ఉద్యమాలతో కలిసి పని చేస్తూనే ఉంటాను. నా గళం ఎత్తుతూనే ఉంటాను.

… … …

వయసు చిన్నదైనప్పటికీ మీరా జీవిత ప్రయాణం ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలను మన ముందుకు తీసుకువస్తుంది. తన అస్థిత్వ ప్రకటన కోసం తాను లేవనెత్తిన ప్రశ్నలు కేవలం ఒక నర్మదా ఉద్యమానికి మాత్రమే పరిమితమైనవి కావు. చిన్నప్పటి నుంచీ తనకు అండగా నిలబడిన అమ్మంటే మీరాకు ప్రాణం. అలానే తన ప్రయాణంలో తన సవాళ్ళను ఓపిగ్గా భరించిన మేథాపాట్కర్‌ అంటే అత్యంత గౌరవం. సామాజిక న్యాయం వైపుగా తన ఆలోచనలను ప్రభావితం చేసిన ప్రతి వ్యక్తి పట్లా అత్యంత స్నేహభావం. వర్తమాన రాజకీయ రంగంలో ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కొంటూ తనదైన ముద్రను వేస్తున్న మీరా సంఘమిత్ర ప్రయాణం ఎవరికైనా స్ఫూర్తిదాయకమే.

అందుకే 2019 సంవత్సరం భాషా మెమోరియల్‌ అవార్డును జులై 21న అనకాపల్లిలో అందుకుంది. ఒక సామాజిక కార్యకర్తగా మారుమూల గ్రామీణ ప్రాంతంలో ప్రజలను చైతన్యపరుస్తూ పనిచేసిన భాషా అనే యువకుడి అకాల మరణం తరువాత అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ఏర్పాటు చేసిన ఈ అవార్డుని ప్రతి సంవత్సరం వివిధ సామాజిక అంశాల మీద పనిచేసే యువతకు అందిస్తున్నారు. మీరా సంఘమిత్ర పని అవార్డులను ఆశించేది కానప్పటికీ, దేశమంతా అలుపెరగని చైతన్యంతో తిరుగుతూ, అనేక ఉద్యమాలకు, సామాన్య ప్రజలకు అండగా నిలబడుతున్న తన సమిష్టి పనికి గుర్తింపే. మీరా, నీకు యాక్టివిస్ట్‌ డైరీ తరఫునా, సారంగ తరఫునా అభినందనలు. జిందాబాద్‌. సారంగ వెబ్‌ మ్యాగజైన్‌ (అయిపోయింది.)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.